Begin typing your search above and press return to search.

సాగర్ ఫలితంపై జేసీ జోస్యం నిజమేనా?

By:  Tupaki Desk   |   17 March 2021 10:30 AM GMT
సాగర్ ఫలితంపై జేసీ జోస్యం నిజమేనా?
X
నాగార్జున సాగర్ అసెంబ్లీ స్థానానికి జరగాల్సిన ఉప ఎన్నికకు ఈసీ నోటిఫికేషన్ జారీ చేసింది. కొద్ది గంటల వ్యవధిలోనే కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ తమ పార్టీ అభ్యర్థిగా సీనియర్ నేత జానారెడ్డిని ఎంపిక చేసినట్లు ప్రకటించారు. దీంతో.. కాంగ్రెస్ తరఫు పోటీ చేసే అభ్యర్థిపై క్లారిటీ వచ్చేసింది. మరి.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఇదిలా ఉంటే సాగర్ ఉప ఎన్నికను బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకోనుంది. తాజాగా వెల్లడయ్యే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు కూడా సాగర్ ఉప ఎన్నిక మీద ప్రభావితం చూపటం ఖాయం.

ఇదిలా ఉంటే.. సీఎల్పీ (కాంగ్రెస్ శాసనసభాపక్షం) కార్యాలయానికి వెళ్లిన టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి కాంగ్రెస్ నేతల్ని కలిశారు. ఈ సందర్భంగా ఓపెన్ గా మాట్లాడిన జేసీ.. తెలంగాణ కాంగ్రెస్ నేతలు చేసిన తప్పుల్ని నిర్మోహమాటంగా బయటకు చెప్పేశారు. ఒకప్పటి తన బాస్ సోనియా నిర్ణయాన్ని తప్పు పట్టటమే కాదు.. తెలంగాణ ఇచ్చి తప్పు చేశారన్నారు.

తాను పుట్టి పెరిగింది కాంగ్రెస్ లోనేనని.. తన ఉన్నతికి కారణం కూడా కాంగ్రెస్సేనని చెప్పారు. పార్టీ బాగుండాలని తాను కోరుకుంటానని.. కానీ ఈ రోజున కాంగ్రెస్ దుస్థితి చూస్తుంటే బాధేస్తోందన్నారు. మేం ముఖ్యమంత్రి అంటే మేం ముఖ్యమంత్రి అని పోటీలు పడి పార్టీని నాశనం చేశారని మండిపడ్డారు. రాయల తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ కు మేలు జరుగుతుందని సోనియాకు తాను చెప్పానని.. అయితే అలా చేస్తే..సీమ నేతల పెత్తనం చేస్తారంటూ అప్పటి పార్టీ ఎంపీలు పొన్నం ప్రభాకర్.. వివేక్ లు ఒప్పుకోలేదన్నారు.

త్వరలో జరిగే సాగర్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ లో గెలిచే అవకాశం లేదని తేల్చేశారు జేసీ దివాకర్ రెడ్డి. సాగర్ నియోజకవర్గంలో జానారెడ్డికి మంచి పట్టుంది. ఇప్పటికే ఒకసారి ఓటమికి గురైన ఆయన.. రెండోసారి అయినా తనసత్తా చాటుతారని భావిస్తున్నారు. అయితే.. జేసీ అంచనా మాత్రం అందుకు భిన్నంగా జానా గెలవటం కష్టమని చెప్పిన వైనం కాంగ్రెస్ నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేస్తుందని చెప్పక తప్పదు.