Begin typing your search above and press return to search.

పందుల పోటీని ద‌గ్గ‌రుండి ప్రారంభించిన జేసీ!

By:  Tupaki Desk   |   14 Jan 2018 12:48 PM GMT
పందుల పోటీని ద‌గ్గ‌రుండి ప్రారంభించిన జేసీ!
X
సీనియ‌ర్ రాజ‌కీయ‌వేత్త‌లైన జేసీ బ్ర‌ద‌ర్స్ స్టైలే వేరు. అనంత‌పురం ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి ఇప్ప‌టికే త‌నదైన శైలిలో కామెంట్లు చేస్తూ ప‌తాక శీర్షిక‌ల‌కు ఎక్కుతుంటే ఆయ‌న సోద‌రుడు, తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి మ‌రో వినూత్న ట్రెండ్ తో త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకున్నారు. అది కూడా వ‌రుస‌గా రెండో సారి కావ‌డం విశేషం. సంక్రాంతి సందర్భంగా ప‌లు చోట్ల కోడి పందేలు నిర్వహిస్తుంటే అనంతపురం జిల్లాలో అధికారపార్టీకి చెందిన తాడిపత్రి ఎమ్మెల్యే జెసి.ప్రభాకర్‌రెడ్డి పందుల పోటీని ప్రారంభించారు. ద‌గ్గ‌రుండి ప్రారంభించ‌డ‌మే కాకుండా ఆ పోటీల సంద‌ర్భంగా అక్క‌డే ఉండి హాజ‌రైన వారికి భ‌రోసాగా నిలిచారు.

గతంలో 'పిగ్‌ ఫైట్‌' పేరుతో గ్రామీణ ప్రాంతాల్లో అప్పుడప్పుడు నిర్వహించే వారు. పోలీసులు కఠినంగా వ్యవహరించడంతో దీన్ని నిలిపివేశారు. గ‌త‌ ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా తాడిపత్రి పట్టణంలో పిగ్‌ ఫైట్‌ను జేసీ ప్రభాకర్‌రెడ్డి మ‌ళ్లీ తెర‌మీద‌కు తెచ్చి దగ్గరుండి ప్రారంభించారు. అంతేకాకుండా పందుల‌ పోటీలు నిర్వహిస్తున్నట్టు ముందుగా ప్రచారం కూడా నిర్వహించడంతో చుట్టుపక్కల గ్రామాల నుంచి జనం పెద్దఎత్తున తరలివచ్చారు. పందుల మధ్య జరిగే పోరును అందరూ ఆసక్తిగా గమనించడమే కాకుండా పందుల గెలుపోటములపై పందేలు కాశారు. ఈ పందులు ఒక్క తాడిపత్రి ప్రాంతం నుంచే కాకుండా జిల్లాలోని కళ్యాణదుర్గం, అనంతపురం తదితర ప్రాంతాల నుంచి కూడా పోటీకి రావడం గమనార్హం.