Begin typing your search above and press return to search.

బీజేపీపై ప్రేమ.. టీడీపీ పీడ.. జేసీ సంచలనం

By:  Tupaki Desk   |   6 Jan 2020 9:16 AM GMT
బీజేపీపై ప్రేమ.. టీడీపీ పీడ.. జేసీ సంచలనం
X
నెల్లూరు పెద్దా రెడ్డి అంటే ఎవరికీ తెలియకపోవచ్చు కానీ తాడిపత్రి పెద్దారెడ్డి అంటే తెలియని వారు ఉండరు. ఇప్పుడు ఆయన హవా అంతలా నడుస్తుంది. టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి హట్ కామెంట్స్ తో ఎప్పుడు హెడ్ లైన్స్ లో ఉంటాడు. తాడిపత్రి నుంచి వరుసగా 6 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందాడు. చంద్రబాబు హయాంలో టీడీపీ తరుఫున అనంతపురం ఎంపీ గా పనిచేశారు. కానీ 2019 ఎన్నికల్లో పోటీచేయలేదు. ఆయన కుమారుడు పోటీచేసి ఓడిపోయాడు.

మొన్నీమధ్యనే చంద్రబాబును పొగిడేసి వార్తల్లో నిలిచిన జేసీ తాజాగా అనంతపురంలో విలేకరులతో మాట్లాడుతూ ‘చంద్రబాబు పీడ పోవాల్సిందేనని’ హాట్ కామెంట్స్ చేసి సంచలనం సృష్టించారు. అంతేకాదు.. ఒకవేళ కేంద్రంలోని బీజేపీ కనుక పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) సమస్యను పరిష్కరిస్తే బీజేపీలోకి వెళతానని మోడీషాలకే బంపర్ ఆఫర్ ఇచ్చారు మన జేసీ దివాకర్ రెడ్డి. అసలు పీవోకే సాధనకు.. జేసీ బీజేపీలోకి చేరికకు ఏంట్రా సంబంధం అనేది అర్థం కాక చాలా మంది ఆయనతో పాటు ఉన్న నేతలు జుట్టుపీక్కున్న పరిస్థితి కనిపించింది.

దేశంలో ప్రాంతీయ పార్టీల పీడ పోవాల్సిందేనని.. తెలుగుదేశంతో సహా అన్ని పోయి జాతీయ పార్టీలే ఉండాలని జేసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాల్లో పరిపాలన బాగుండాలంటే ప్రాంతీయ పార్టీలు పోయి జాతీయ పార్టీలు రావాలన్నారు. ప్రాంతీయ పార్టీల్లో దండించే వారు లేక ఆడిందే ఆటగా..పాడిందే పాటగా సాగుతోందని విమర్శించారు.

మరి దీన్ని బట్టి మళ్లీ బీజేపీ బాట పట్టేందుకు జేసీ రెడీ అవుతున్నారా అన్న అంచనాలు నెలకొంటున్నాయి. మరి ఈసారైనా మన రెడ్డప్ప మాట మీద నిలబడుతాడా లేదా అనేది చూడాలి.