Begin typing your search above and press return to search.

ఇదేంది దివాకర్ రెడ్డి సారూ.. అలా అనేశారు!

By:  Tupaki Desk   |   1 April 2019 11:00 PM IST
ఇదేంది దివాకర్ రెడ్డి సారూ.. అలా అనేశారు!
X
మొన్నటి వరకూ శింగనమలలో సూపర్ పవర్ గా చలామణి అయిన యామినిబాల, శమంతకమణిలపై గట్టి ముద్రనే వేసేస్తున్నారు అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. వారు అవినీతి పరులు అని.. అందుకే వారి కుటుంబానికి టికెట్ దక్కలేదు అని జేసీ దివాకర్ రెడ్డి ప్రచారం చేస్తూ ఉన్నారు.

దీని వెనుక అసలు కథ ఏమిటంటే.. అనంతపురం ఎంపీ సీటు పరిధిలోకి వస్తుంది శింగనమల ఎమ్మెల్యే సీటు. అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే యామినిబాల. ఈమె శమంతకమణి కూతురు. శమంతకమణి ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్సీగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ సారి కూడా టికెట్ దక్కించుకోవాలని శమంతకమణి కుటుంబం గట్టిగా ప్రయత్నించింది. అయితే ఆ విషయంలో జేసీ దివాకర్ రెడ్డి అడ్డుపడ్డారు. యామినిబాలకు కానీ వారి కుటుంబంలో మరెవరికి అయినా టికెట్ ఇస్తే ఓడిపోతారని.. జేసీ కొత్తగా శ్రావణిశ్రీ అనే ఆమెను తెర మీదకు తెచ్చారు.

ఈమెకు జేసీ ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి. టికెట్ కోసం ఆఖరి వరకూ ప్రయత్నించిన యామినిబాల, శమంతకమణిల మీద కూడా జేసీ ఇటీవలే ఓపెన్ గా ఫైర్ అయ్యారు. జేసీ తీవ్రంగా దూషించే సరికి.. ఆ మహిళలు ఇద్దరూ ఏడ్చుకొంటూ వెళ్లారు.

చివరకు అయితే జేసీ పంతమే నెగ్గింది. శమంతకమణి కుటుంబానికి శింగనమల సీటు టీడీపీ టికెట్ దక్కలేదు. జేసీ చెప్పిన శ్రావణి శ్రీకు టికెట్ దక్కింది. ఆమెను వెంట పెట్టుకుని శింగనమలలో ప్రచారం చేస్తూ ఉన్నారు దివాకర్ రెడ్డి. ఈ నేపథ్యంలో.. దివాకర్ రెడ్డి మాట్లాడుతూ… యామినిబాల, శమంతకమణిలు అవినీతి పరులు అని, అందుకే వారికి టికెట్ దక్కలేదని చెప్పుకొచ్చారు.

ఇలా ప్రచారం చేసుకొంటూ పోతున్నారాయన. ఒకవైపు శమంతకమణి టీడీపీ ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు కూడా. ఆ విషయాన్నికూడా పట్టించుకోకుండా దివాకర్ రెడ్డి.. ఇలా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇది సహజంగానే సిట్టింగ్ ఎమ్మెల్యే వర్గానికి తీవ్ర అసహనం వ్యక్తం చేసే అవకాశముంది.