Begin typing your search above and press return to search.

‘త్యాగం’తో మనసు దోచుకున్న కేంద్రమంత్రి

By:  Tupaki Desk   |   7 Nov 2016 4:47 AM GMT
‘త్యాగం’తో మనసు దోచుకున్న కేంద్రమంత్రి
X
గత ప్రభుత్వాల్లో పని చేసిన కేంద్రమంత్రుల తీరుకు భిన్నంగా మోడీ మంత్రివర్గంలోని మంత్రుల తీరు ఉందన్న మాట రోజురోజుకీ మరింత బలపడుతోంది. దీనికి తగ్గట్లే అనేక ఉదంతాలు ఈ మధ్యన బయటకు వస్తున్నాయి. ఇప్పటికే సోషల్ నెట్ వర్కింగ్ సైట్ల ద్వారా దేశ ప్రజలకు చేరువైన పలువురు కేంద్రమంత్రులకు తగ్గట్లే.. తాజాగా మరో కేంద్రమంత్రి తన చేతలతో దేశ ప్రజల మనసుల్ని దోచుకున్నారు.

ఒక మహిళ కోరిన సాయానికి సానుకూలంగా స్పందించటమే కాదు.. తనకున్న సౌకర్యాల్ని త్యాగం చేసిన తీరు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇంతకీ ఆ కేంద్రమంత్రి ఎవరు? ఆయన చేసిన త్యాగం ఏమిటి? అందరూ ఆయన్ను మెచ్చుకునేలా ఏం చేశారు? లాంటివి చూస్తే..

బెంగళూరు నుంచి రాంచీకి ఇండిగో విమానంలో ప్రయాణిస్తున్నారు కేంద్రమంత్రి జయంత్ సిన్హా. అదే విమానంలో శ్రేయ ప్రదీప్ అనే యువతి తన తల్లితో కలిసి ప్రయాణం చేస్తోంది. అయితే.. శ్రేయ తల్లి కాలికి దెబ్బ తగలటంతో ఆమె నడవలేని స్థితి లో ఉంది. వారు కూర్చున్న సీటు సరిగా లేకపోవటంతో అదే విమానంలో ప్రయాణిస్తున్న కేంద్రమంత్రి వద్దకు వెళ్లి.. సీటు మారాలని కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన ఆయన తన ఫస్ట్ క్లాస్ సీటును ఇచ్చేసి ఆయన వేరే సీట్లో కూర్చున్నారు.

కేంద్రమంత్రి సిన్హా చేసిన సాయాన్ని ట్విట్టర్ ద్వారా పేర్కొన్న శ్రేయ.. ఆయనతో తాను దిగిన ఫోటోను పోస్ట్ చేశారు. ఆమె చేసిన పోస్ట్ పై స్పందించిన కేంద్రమంత్రి.. హుందాగా.. ‘‘యూ ఆర్ వెరీ వెల్ కమ్’’ అంటూ బదులిచ్చారు. సౌకర్యాలుండే ఫస్ట్ క్లాస్ సీటును త్యాగం చేసిన కేంద్రమంత్రి తీరు దేశ ప్రజల్ని అమితంగా ఆకర్షిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/