Begin typing your search above and press return to search.

అమ్మ ఇప్పుడు యాపిల్ తింటున్నారట

By:  Tupaki Desk   |   18 Oct 2016 7:51 AM GMT
అమ్మ ఇప్పుడు యాపిల్ తింటున్నారట
X
తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్న అమ్మ జయలలితకు సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి తాజాగా బయటకు వచ్చింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నా.. అధికారికంగా ఆమె ఆరోగ్యానికి సంబంధించిన సమాచారం ఏదీ బయటకు రాని పరిస్థితి. అనధికారికంగా మాత్రం ఆమె పేపర్లు చదువుతున్నారని.. వైద్యులతో మాట్లాడుతున్నారన్న వార్తలు మాత్రం వస్తున్నాయి. గడిచిన వారం రోజులుగా అధికారికంగా అమ్మ ఆరోగ్యానికి సంబంధించిన ఎలాంటి బులెటిన్ బయటకు రాకున్నా.. అనధికారికంగా వస్తున్న సమాచారం ఆసక్తికరంగా మారింది.

తాజాగా అమ్మ వైద్యులతో మాట్లాడుతున్నారని.. తనకు వైద్యం చేస్తున్న వైద్యుల్ని పేరు పేరునా గుర్తించి.. తనకు చేస్తున్న చికిత్స విషయంలో ఆమె థ్యాంక్స్ చెబుతున్నారన్న వార్త ఒకటి బయటకు వచ్చింది. ఇదే కాకుండా అమ్మ ఆరోగ్యం మరింత మెరుగుపడిందన్న మాటకు బలం చేకూరేలా ఆమెకు ఉడకబెట్టిన యాపిల్ ముక్కలు ఇస్తున్నారని.. మంచినీటిని తాగిస్తున్నట్లుగా వార్తలు బయటకు వచ్చాయి.

ఒకవేళ నిజంగానే ‘అమ్మ’ ఆరోగ్యం అంతలా మెరుగుపడితే.. అందుకు సంబంధించిన వివరాలు అధికారికంగా వెల్లడిస్తే సరిపోతుంది. కానీ.. అలాంటిదేమీ లేకుండా ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన సమాచారాన్ని గుట్టుగా దాచటం ఏమిటో అర్థం కాని పరిస్థితి. ఒకవైపు అమ్మ ఆరోగ్య పరిస్థితి రోజురోజుకీ మెరుగుతుపడుతున్నట్లుగా అనధికారికంగా సమాచారం బయటకు వస్తుంటే.. మరోవైపు ఆమెకు వైద్యం చేస్తున్న వైద్యుల సంఖ్య పెరుగుతుండటం గమనార్హం. తొలుత అపోలో వైద్యులు ఆమెకు వైద్యం చేయటం.. అనంతరం లండన్ నుంచి డాక్టర్ రిచర్డ్ బీలే.. ఆ తర్వాత ఎయిమ్స్ నుంచి వైద్యుల బృందం రాగా.. ఇటీవల సింగపూర్ నుంచి మరికొందరు వైద్యులు అమ్మకు చికిత్స చేస్తున్నారు. ఇంతకూ అమ్మ తాజా ఆరోగ్య పరిస్థితి ఏంటి? అమ్మ ఉడకబెట్టిన యాపిల్ ముక్కలు తినటం.. వైద్యుల్ని పేరు పేరునా పలుకరించటం.. రోజూ పేపర్లు చదవటం లాంటి వాటిల్లో నిజం ఎంతన్న విషయాన్ని అధికారికంగా వెల్లడిస్తే.. అమ్మ ఆరోగ్యంపై తీవ్రంగా ఆందోళన చెందుతున్న కోట్లాది మంది ఎంతోకొంత సాంత్వన పొందే అవకాశం ఉందన్న విషయాన్ని మర్చిపోకూడదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/