Begin typing your search above and press return to search.

పంద్రాగ‌స్టు- ప‌వ‌న్ సంచ‌ల‌న కామెంట్లు.. జ‌గ‌న్‌పై ప‌రోక్షంగా!

By:  Tupaki Desk   |   15 Aug 2021 9:30 AM GMT
పంద్రాగ‌స్టు- ప‌వ‌న్ సంచ‌ల‌న కామెంట్లు.. జ‌గ‌న్‌పై ప‌రోక్షంగా!
X
పంద్రాగ‌స్టు వేడుక‌ల సంద‌ర్భంగా.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొన్ని కీల‌క సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. వాస్త‌వానికి ఇటీవ‌ల కాలంలో ఆయ‌న మీడియాకు, ప్ర‌క‌ట‌న‌ల‌కు కూడా దూరంగా ఉంటున్నారు. కానీ, తాజాగా బీజేపీ+జ‌న‌సేన స‌మావేశం త‌ర్వాత‌.. ఆయ‌న దూకుడు పెంచ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. రాష్ట్రంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వ వైఖ‌రిపై ఒక రోజు ముందు.. విజ‌య‌వాడ‌లో భేటీ అయిన‌.. బీజేపీ-జన‌సేన నేత‌లు.. జ‌గ‌న్ స‌ర్కారుపై దూకుడు పెంచాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఈ క్ర‌మంలో ఆ వెంట‌నే వ‌చ్చిన పంద్రాగ‌స్టు వేడుక‌ల‌ను ప‌వ‌న్ త‌న‌కు అనుకూలంగా మార్చుకున్నారు. ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై సీరియ‌స్ కామెంట్లే చేశారు.

వారు నాయ‌కులు కాదు..
జ‌న‌సేన కార్యాల‌యంలో జెండావిష్క‌ర‌ణ చేసిన ప‌వ‌న్‌.. అనంతరం.. మాట్లాడుతూ.. రాష్ర రాజ‌కీయ ప‌రిస్థితిపై ఆస‌క్తిక‌ర కామెంట్లు కుమ్మ‌రించారు. రెండు వేలు ఇచ్చి ఓట్లు కొనుక్కునే విధానం.. ఓటు అమ్మకునే విధానం మారాలని వ్యాఖ్యానించారు. రాజకీయ నాయకులంటే పేకాట క్లబ్ లు‌నడిపే వారు కాదని వ్యాఖ్యానించారు. సూట్ కేసు కంపెనీలు పెట్టి కోట్లు కొల్లగొట్టే వారు నాయకులు కాదని పేర్కొన్నారు. కొత్త తరం నాయకులు, కొత్త రాజకీయం రావాలన్నారు. తాను వృద్దుడిగా అయ్యే లోపు రాజకీయ మార్పు వస్తుందని ఆశిస్తున్నానని చెప్పారు. తప్పు చేస్తే... శిక్ష తప్పదు అనే భయం ఉండాల‌న్నారు.

ప్ర‌జ‌లారా.. మీరు మారండి!

ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ప్ర‌జ‌ల‌కు ఒక పిలుపు ఇచ్చారు. తమ ఆలోచనల తీరు మార్చుకోవాలని సూచించారు. ఓటు‌వేసే ముందు సామాజిక ప్రయోజనాలా... వ్యక్తిగత ప్రయోజనం కావాలా అనేది ఆలోచిం చాలని కోరారు. ప్రజల్లో ఈ ఆలోచన వచ్చినప్పుడే రాజకీయ వ్యవస్థ మారుతుందని పవన్ పేర్కొన్నారు. ``నేడు ఒక కులం మీద పాలకులు కక్ష కట్టి వేధిస్తే... రేపు వాళ్లు అధికారంలోకి వస్తే మరో కులం పై కక్ష కట్టే ప్రమాదం ఉంద``ని హెచ్చరించారు. ప‌రోక్షంగా ఆయ‌న క‌మ్మ సామాజిక వ‌ర్గం గురించి ప్ర‌స్తావించారు. కులాల మధ్య అసమానతలు పోయి .. భారతీయులుగా ఉండాలని పిలుపునిచ్చారు.

25 ఏళ్ల ఫ్యూచ‌ర్ ఉంది..

ప్రపంచ దేశాల అభివృద్ధి లో భారతీయుల పాత్ర ఎంతో ఉందని పేర్కొన్నారు. కానీ మన‌దేశానికి వారు సేవలు అందించ లేకపోతున్నారన్నారు. ఇందుకు మన రాజకీయ నాయకులే ప్రధాన కారణమని చెప్పుకొచ్చారు. మువ్వెన్నల జెండా రూపకర్త పింగళి వెంకయ్య దుర్భరమైన జీవితం అనుభవించారని చెప్పారు. జనసేన ఆవిర్భావానికి ప్రేరణ ఇటువంటి సంఘటనలేనని పవన్ వివరించారు. 25ఏళ్ల భవిష్యత్తు ప్రస్థానంతో ముందుకు వెళుతున్నాని స్పష్టం చేసారు. నాడు ఆస్తులు వదులుకుంటే... నేటి రాజకీయ నాయకులు ఆస్తులు దోచుకుని వాడేసుకుంటు న్నారంటూ ఆవేదన వ్యక్తం చేసారు.

జ‌గ‌న్‌పై ప‌రోక్ష విమర్శ‌లు..

నాటి త్యాగాలు, ఉద్యమ స్పూర్తి నేటి తరంలో రావాలని కోరారు. ప్రభుత్వ పధకాలకు సిఎం, వారి కుటుంబ సభ్యులు పేర్లు పెట్టుకుంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. మన దేశం, రాష్ట్రం కోసం పోరాడే మహనీయులు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. ప్రకాశం పంతులు, పొట్టి శ్రీరాములు, పింగళి వంటి వారి పేర్లు ఎందుకు పెట్టరని పవన్ ప్రశ్నించారు. జనసేన అధికారంలోకి వస్తే అన్ని పధకాలకు జాతీయ నాయకుల పేర్లే పెడతామని ప్రకటించారు. జగన్ ప్రభుత్వం రోజురోజుకీ ప్రజల్లో విశ్వాసం కోల్పోతోందని పార్టీ నేతల సమావేశంలో పవన్ వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యల పైన ఎక్కడికక్కడ పోరాటాలకు సిద్దం కావాలంటూ నేతలకు పిలుపునిచ్చారు.