Begin typing your search above and press return to search.

అప్పుడు వైఎస్సార్.. ఇప్పుడు జగన్.. కన్నీళ్లు పెట్టుకున్న ఫ్యాన్స్

By:  Tupaki Desk   |   30 May 2019 1:45 PM GMT
అప్పుడు వైఎస్సార్.. ఇప్పుడు జగన్.. కన్నీళ్లు పెట్టుకున్న ఫ్యాన్స్
X
ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని 175 స్థానాలకు గానూ ఆ పార్టీ 151 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలుపొందింది. దీంతో వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నవ్యాంధ్రప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రిగా గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఈరోజు (గురువారం) మధ్యాహ్నం 12.23 గంటలకు జగన్‌తో ఉమ్మడి రాష్ట్ర గవర్నర్‌ ఈఎస్‌ ఎల్‌ నరసింహన్‌ ప్రమాణం చేయించారు. అంగరంగ వైభవంగా జరిగిన ఈ కార్యక్రమానికి జగన్ కుటుంబ సభ్యులతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు - డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ సహా పలువురు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.

జగన్‌ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం జరిగిన తీరును పరిశీలిస్తే 2004లో ఆయన తండ్రి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమం గుర్తుకు రాక మానదు. రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసిన అనంతరం వైఎస్సార్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ కు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. అప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీని చిత్తుగా ఓడించారు. అనంతరం భారీ జన సందోహం నడుమ ప్రమాణ స్వీకారం చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే ఆయన ప్రమాణ స్వీకారాన్ని భారీగా నిర్వహించారు. ఆ సమయంలో వేదికను ఏర్పాటు చేసిన ప్రాంతంలో ప్రజలకు అత్యంత చేరువగా ఓపెన్ టాప్ జీపుపై తిరిగారు. అనంతరం వేదికపైకి వచ్చి తన కోసం వచ్చిన అభిమానులకు రెండు చేతులు జోడించి అభివాదం చేసుకుంటూ వెళ్లారు.

అంతేకాదు, ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో రైతులకు ఉచిత కరెంట్ పథకానికి సంబంధించిన ఫైలుపై తొలి సంతకం చేశారు. సరిగ్గా 15 సంవత్సరాల తర్వాత వైఎస్ జగన్‌ కూడా ఇదే తరహాలో వ్యవహరించారు. తండ్రిలాగే తిరుగుతూ - అభివాదం చేస్తూ దివంగత నేతను గుర్తు చేశారు. అంతేకాదు, ఇదే వేదికపై నుంచి వృద్ధులకు ఇస్తున్న పింఛన్‌ ను రూ. 250 పెంచుతూ ఫైలుపై సంతకం చేశారు. ఇది మొత్తం గమనించిన వైఎస్ కుటుంబ అభిమానులు ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయ్యారు. జగన్‌ను చూస్తే పెద్దాయన గుర్తుకు వచ్చారంటూ కన్నీటి పర్యంతం అయ్యారు. మొదటి రోజే తండ్రిలాగే కనిపించిన జగన్.. ఆయన లాగే గొప్ప ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకోవాలని వారంతా కోరుతున్నారు.