Begin typing your search above and press return to search.

వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యే ఫైట్.. పిలిపించిన జగన్?

By:  Tupaki Desk   |   25 Nov 2020 5:20 PM GMT
వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యే ఫైట్.. పిలిపించిన జగన్?
X
ఎక్కడైనా ఓడిపోయి దెబ్బతిన్న ప్రతిపక్ష పార్టీలో గొడవలు ఉంటాయి. అధికారం, పరపతి, హోదా, డబ్బు ఉన్న అధికారపక్షంలో నేతలంతా మూడు పువ్వులు, ఆరు కాయలు అన్నట్టు అన్యోన్యంగా ఉంటారు. కానీ తాజాగా వైసీపీలో మాత్రం ట్రెయిన్ రివర్స్ అయ్యింది.

అధికార పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలుగా ఉంటూ బహిరంగంగా గొడవపడ్డ ఇద్దరు నేతలపై ఏపీ సీఎం జగన్ సీరియస్ అయినట్టు తెలిసింది. కాకినాడలో జరిగిన తూర్పు గోదావరి జిల్లా డీఆర్సీ సమావేశంలో వైసీపీ సీనియర్ నేతల వాగ్వాదం పార్టీ పరువు పోయేలా చేసింది. దీనిపై సీరియస్ అయిన సీఎం జగన్ ఆ ఇద్దరు ఎంపీ, ఎమ్మెల్యేలను తనను కలవాలంటూ కబురు పంపినట్టు తెలిసింది.

దీంతో రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇద్దరూ అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయంకు చేరుకున్నారు. ఇద్దరినీ వివరణ కోరిన సీఎం జగన్ డీఆర్సీ సమావేశంలో రచ్చపై ఇరువురు నేతల వివరణ తీసుకున్నట్టు తెలిసింది.

కాకినాడ డీఆర్సీ సమావేశంలో అలా బహిరంగంగా పరస్పరం తీవ్ర ఆరోపణలు చేసుకోవడానికి కారణం ఏంటని జగన్ వాకబు చేసినట్టు తెలిసింది. పరువు పోయేలా చేయవద్దని నేతలకు క్లాస్ తీసుకున్నట్టు ప్రచారం సాగుతోంది. అయితే ఈ భేటిపై ఎంపీ పిల్లి సుభాష్ కానీ.. ఇటు ద్వారంపూడి కానీ ఇప్పటిదాకా స్పందించలేదు.