Begin typing your search above and press return to search.

వాలంటీర్లకు జగన్ సర్కార్ షాక్...వారిపై వేటు

By:  Tupaki Desk   |   8 Dec 2020 2:30 PM IST
వాలంటీర్లకు జగన్ సర్కార్ షాక్...వారిపై వేటు
X
తన పాదయాత్ర సందర్భంగా ఏపీలో గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేస్తానని, వాటి ద్వారా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇచ్చిన హామీ నిలబెట్టుకునేందుకు దాదాపు 3 లక్షల మంది గ్రామ, వార్డు వాలంటీర్ల నియామకాలు చేపట్టి గ్రామ సచివాలయ వ్యవస్థకు జగన్ శ్రీకారం చుట్టారు. 18-35 సంవత్సరాల వయసున్న అర్హులైన అభ్యర్థులను వాలంటీర్లుగా నియమించారు. అయితే, నియామకాల సమయంలో కొందరు వాలంటీర్లను నిబంధనలకు విరుద్ధంగా నియమించారన్న విమర్శలు వచ్చాయి. ఆ సమయంలో రకరకాల ఒత్తిళ్లతో ఆ నియామకాలు చేపట్టారని విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే అలా నియమితులైన వాలంటీర్లకు ఏపీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. 18 సంవత్సరాలలోపు, 35 సంవత్సరాల వయసు పైబడిన వాలంటీర్లను వెంటనే విధుల నుంచి తొలగించాలని గ్రామ వాలంటీర్ సచివాలయం, వార్డు వాలంటీర్ సచివాలయం శాఖ డైరెక్టర్‌, కమిషనర్‌ జీఎస్‌.నవీన్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

స్థానిక నేతల ఒత్తిళ్లతో నిబంధనలకు విరుద్ధంగా కొందరు వాలంటీర్లను నియమించారని గతంలోనే విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆ వ్యవహారంపై ఫోకస్ చేసిన ప్రభుత్వాధికారులు...నిబంధనలకు విరుద్ధంగా నియమితులైన వారిపై కొరడా ఝుళిపించారు. 18 ఏళ్ల లోపు, 35 ఏళ్లు నిండిన వారిని వెంటనే విధుల నుంచి తొలగించాలని కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఒక్కో జిల్లాలో 2 వేల నుంచి 10వేల వరకు వాలంటీర్లు ఉద్యోగాలు కోల్పోనున్నారని తెలుస్తోంది. ఏపీలో మొత్తం 2.60 లక్షల మంది వాలంటీర్లున్నారు. అయితే, 35 ఏళ్ల వయసు పైబడి వాలంటీరుగా పనిచేస్తున్న వారికి సీఎఫ్‌ ఎంఎస్‌ సిస్టమ్‌ ద్వారా జీతాలు రావడం లేదు. ఈ నేపథ్యంలో ఆ శాఖ కమిషనర్ నవీన్ కుమార్ ఈ నిర్ణయం తీసుకున్నారు.