Begin typing your search above and press return to search.

ఎమ్మెల్యే గొట్టిపాటికి షాకిచ్చిన జగన్ సర్కార్

By:  Tupaki Desk   |   2 Dec 2019 11:30 AM GMT
ఎమ్మెల్యే గొట్టిపాటికి షాకిచ్చిన జగన్ సర్కార్
X
ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ఆయువు పట్టుపై దెబ్బ పడింది. టీడీపీ ఎమ్మెల్యేగా జిల్లాలో చెరగని ముద్ర వేస్తున్న ఆయన వ్యాపారాలపై తాజాగా విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు దాడులు నిర్వహించడం ఏపీలో కలకలం రేపింది.

అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ తోపాటు ఆయన అనుచరుల పేర్లతో ఉన్న గ్రానైట్ క్వారీల్లో కూడా విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. క్వారీల్లో చేపట్టే పనులు, లావాదేవీల వివరాలు సేకరించారు. ఎంత అనుమతి ఉంది..? ఎంత అక్రమ మైనింగ్ చేస్తున్నారనే విషాయలపై కొలతలు తీసుకున్నారు.ఇక గ్రానైట్ అమ్మకానికి సంబంధించిన వే బిల్లులకు మైనింగ్ శాఖ అనుమతిని పరిశీలించారు.

గొట్టిపాటి రవికుమార్ ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో ప్రకాశం జిల్లా అద్దంకి లో పోటీచేసి ఎమ్మెల్యేగా గెలిచారు. గతంలో ఈయన వైసీపీకి చెందిన వారే. 2014లో వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచి చంద్రబాబు ఆపరేషన్ ఆకర్ష్ కు గురై 2016లో టీడీపీలో చేరిపోయాడు. 2019 ఎన్నికల్లో టీడీపీ తరుఫునే నిలబడి గెలిచాడు.

ప్రకాశం జిల్లాలో వైసీపీ గాలిని తట్టుకొని గెలిచిన టీడీపీ ఎమ్మెల్యేల్లో ఈయన ఒకరు. గొట్టిపాటి ప్రధాన బలం మైనింగే.. ప్రకాశం జిల్లాలో ఈయన భారీగా మైనింగ్ క్వారీలు ఉన్నాయి. చంద్రబాబు ప్రోద్బలంతో టీడీపీ హయాంలో మూడు పువ్వులు ఆరు కాయలుగా అక్రమంగా మైనింగ్ తవ్వకాలు జరిపారన్న ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ప్రజలు కూడా ఈ అక్రమ మైనింగ్ పై నిరసనలు తెలిపిన దాఖలాలు జిల్లాలో ఉన్నాయి. అయితే టీడీపీ ప్రభుత్వం ఉండడంతో ఈయనపై ఎవరూ టచ్ చేసే సాహసం చేయలేదు..

కాగా తాజాగా గొట్టిపాటి రవికుమార్ కు వైసీపీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. క్వారీల్లో అక్రమ మైనింగ్ కు పాల్పడుతున్న ఆరోపణలు రావడంతో విజిలెన్స్ తో దాడులకు దిగింది. మరి ఇందులో ఏం తేలుతుందనేది వేచిచూడాలి.