Begin typing your search above and press return to search.

నాడు ఎన్టీఆర్.. నేడు జగన్.. అదే చేస్తారా?

By:  Tupaki Desk   |   19 Dec 2019 11:02 AM IST
నాడు ఎన్టీఆర్.. నేడు జగన్.. అదే చేస్తారా?
X
శాసన మండలి. ఎమ్మెల్యేలుగా గెలవలేని వారికి రాజకీయ ఆశ్రయం కల్పించేందుకు అప్పుడెప్పుడో కాంగ్రెస్ నేతలు తెచ్చిన పద్ధతి ఇదీ.. ఇది రాజకీయ పునరావాసంగా మారి వారికి జీతభత్యాలు, ప్రభుత్వ సౌకర్యాలు సొమ్ము దుర్వినియోగం అవుతోందని 1980వ దశకంలో తెలుగుదేశం పార్టీ గద్దెనెక్కిన తర్వాత నాడు ఎన్టీఆర్ ఈ మండలి వ్యవస్థను రద్దు చేశారు. ఆ తర్వాత వైఎస్ఆర్ హయాంలో తిరిగి పునరుద్ధరించబడింది.

అయితే తాజాగా 151 మందితో గద్దెనెక్కిన జగన్ సర్కారుకు శాసన మండలి పక్కలో బల్లెంలో తయారైంది. ఇంతకు ముందు ప్రతిపక్షంలో జగన్ ఉండడంతో జగన్ కు సరిపడా బలం శాసన మండలిలో లేదు. అందుకే జగన్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇంగ్లీష్ మీడియం చదువులు, ఎస్సీ కమిషన్ ఏర్పాటు బిల్లులు శాసన మండలిలో వీగిపోయాయి. ఈ బిల్లులను ఆమోదించకుండా అసెంబ్లీకి తిప్పి పంపి టీడీపీ తన పంతం నెగ్గించుకుంది. మండలిలో వైసీపీకి బలం లేకపోవడం.. టీడీపీకి ఎక్కువ ఎమ్మెల్సీలు ఉండడంతో అక్కడ వైసీపీ సర్కారు తెస్తున్న కీలక బిల్లులు పాస్ కాని పరిస్థితి నెలకొంది.

ఇంగ్లీష్ మీడియం, ఎస్సీ కమిషన్ బిల్లులు శాసన మండలిలో ఆమోదం కాకుండా ఆగిపోవడంతో తిరిగి వచ్చే శాసనసభా సమావేశాల వరకూ ఈ బిల్లులు పెండింగ్ లో పడిపోయాయి. దీంతో సీఎం జగన్ శాసన మండలి విషయంలో కఠిన నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలిసింది.

ఏపీ శాసన మండలిని రద్దు చేసే యోచనలో జగన్ సర్కారు ఉందని ప్రచారం జరుగుతోంది. మండలి రెండు బిల్లులను వెనక్కి పంపడాన్ని సీరియస్ గా తీసుకున్న జగన్ .. ఏకంగా మండలి రద్దుకు అడుగులు వేస్తున్నట్టు సమాచారం. ఆర్థికంగా భారంగానూ మండలి తయారైందని.. కీలకమైన బిల్లులను వెనక్కి పంపడం కూడా జగన్ కు పుండు మీద కారం చల్లినట్టైందని భావిస్తున్నారు. అందుకే సమయం చూసి మండలి రద్దు చేయడానికి జగన్ డిసైడ్ అయినట్లు సమాచారం. దీంతో లోకేష్ సహా టీడీపీ, వైసీపీ ఎమ్మెల్సీల పదవులు పోనున్నాయి.