Begin typing your search above and press return to search.

ఏడాదిన్నరకే 95 శాతం హామీలని నెరవేర్చాం : సీఎం జగన్

By:  Tupaki Desk   |   30 Dec 2020 1:11 PM GMT
ఏడాదిన్నరకే 95 శాతం హామీలని నెరవేర్చాం : సీఎం జగన్
X
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు విజయనగరం జిల్లా పర్యటనలో భాగంగా నవరత్నాలు - పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో పాల్గొని , విస్తీర్ణంలో రాష్ట్రంలోనే అతి పెద్దదైన గుంకలాంలోని వైఎస్సార్‌ జగనన్న కాలనీ పైలాన్‌ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ .. రాష్ట్రంలో ఇళ్ల పంపిణి కార్యక్రమం ఒక పండుగలా జరుగుతుంది అని , రాష్ట్రంలో ప్రతి గ్రామంలోనూ, పట్టణంలోనూ పేదలకు ఇళ్ల పట్టాలు.. రాష్ట్ర వ్యాప్తంగా 35 లక్షలకు పైగా ఇళ్ల పట్టాల పంపిణీ చేపట్టామని తెలిపారు. పేదలకు 2.20 లక్షల టిడ్కో ఇళ్లను కట్టిస్తున్నామని వెల్లడించారు. 35.70లక్షల ఇళ్లను రెండు దశల్లో పూర్తి చేస్తామన్నారు.

దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా మహిళలకు, రైతులకు, విద్యార్ధులకు.. అక్కచెల్లెమ్మలకు, వందల సామాజిక వర్గాలకు అండగా నిలిచా. 50 లక్షలకు పైగా రైతులకు రైతు భరోసా సాయం అందించాం. 62 లక్షల మంది అవ్వాతాతలకు, వితంతువులకు, వికలాంగులకు పెన్షన్‌.. వారి ఇంటి వద్దకే అందించేలా గొప్ప కార్యక్రమం చేపట్టాం. 15 లక్షలకు పైగా విద్యార్ధుల చదువులకు తోడుగా నిలబడ్డా. రైతన్నలకు ఇన్‌పుట్ సబ్సిడీ అందించి అండగా నిలబడ్డా. గ్రామ/వార్డు సచివాలయాల ద్వారా 1.30 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాం అని ,కేవలం అధికారంలోకి వచ్చిన 18 నెలల్లో 95 శాతం హామీలు నెరవేర్చామని సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్ ‌రెడ్డి అన్నారు.

ప్రభుత్వం కడుతున్నది ఇళ్లు కాదు.. ఊళ్లు. కొత్తగా 17,005 వైఎ‍స్సార్‌ జగనన్న కాలనీలు నిర్మించబోతున్నాం. వైఎస్సార్‌ జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. గుంకలాం లేఅవుట్‌లో 12,301 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు ఇస్తాం. గుంకలాంలో చిన్న నగర పంచాయతీ ఏర్పడబోతుంది. కుల, మత, పార్టీలకతీతంగా ఇళ్ల పట్టాల పంపిణీ చేపట్టాం అని చెప్పారు. ఇళ్ల పట్టాలను నిరంతర ప్రక్రియగా మార్చాం. అర్హులైనవారు దరఖాస్తు చేసుకున్న 90 రోజుల్లో.. ఇంటి స్థలం కేటాయించేలా ఆదేశాలు ఇచ్చాం అని అన్నారు. లే అవుట్ విస్తీర్ణం బట్టి పార్క్‌లు, అంగన్‌వాడీలు, విలేజ్‌ క్లీనిక్‌లు, ఆర్‌బీకేలు ఏర్పాటు జరుగుతుంది అని అన్నారు. 300 చదరపు అడుగులు ఉన్న టిడ్కో ఇళ్లను ఒక రూపాయికే అందిస్తున్నాం. టిడ్కో ఇళ్లను పూర్తిచేసేందుకు రూ.9వేల కోట్లకుపైగా ఖర్చు చేస్తున్నాం. లక్షా 43వేల మంది టిడ్కో లబ్ధిదారుల్లో ఒక్కరు మాత్రమే చంద్రబాబు స్కీం కావాలన్నారు. 365, 430 చదరపు అడుగుల టిడ్కో ఇళ్లల్లో.. 50శాతం లబ్ధిదారుల వాటాను ప్రభుత్వమే చెల్లిస్తుంది. దీనివల్ల రూ.4,250 కోట్లు ప్రభుత్వంపై అదనపు భారం పడుతోంది అని అన్నారు.

లబ్ధిదారుల పేరుతోనే ఇంటి రిజిస్ట్రేషన్ చేయించాలనుకున్నాం. చంద్రబాబు అండ్‌ కో కుట్రలతో రిజిస్ట్రేషన్ ‌లు జరగలేదు. లబ్ధిదారులకు కేవలం 'డి' పట్టాలు మాత్రమే ఇస్తున్నాం. న్యాయపరమైన చిక్కులు తొలిగిపోగానే లబ్ధిదారులకు అన్ని హక్కులు కల్పిస్తాం. డిసెంబర్‌ 25న ఇళ్ల పట్టాలు పంచుతామని తెలిసి 24న కోర్టుకు వెళ్లారు. చంద్రబాబు ఎంత దుర్మార్గంగా ఆలోచిస్తున్నారో దీన్ని బట్టే తెలుస్తుంది అంటూ చంద్రబాబు పై మండిపడ్డారు. ఇళ్ల నిర్మాణం ద్వారా 30 రకాల వృత్తిదారులకు ఉపాధి అవకాశాలు దొరుకుతున్నాయి. చంద్రబాబు, అనుచరుల పిటిషన్ల వల్ల 10% ఇళ్ల పట్టాల పంపిణీ నిలిచిపోయింది. న్యాయపరమైన సమస్యలు పరిష్కారం కాగానే మిగిలిన వారందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తాం అని తెలిపారు.