Begin typing your search above and press return to search.

అమరావతే రాజధాని..బిల్లు పై అర్ధరాత్రి జగన్ మంత్రాంగం

By:  Tupaki Desk   |   20 Jan 2020 7:46 AM IST
అమరావతే రాజధాని..బిల్లు పై అర్ధరాత్రి జగన్ మంత్రాంగం
X
ఏపీకి 3 రాజధానులు.. అమరావతి మార్పు పై కీలకమైన బిల్లు విషయంలో జగన్ సర్కారు అత్యంత రహస్యాన్ని, చాకచక్యాన్ని, గోప్యతను ప్రదర్శిస్తోంది. అసెంబ్లీ లో ప్రవేశ పెట్టే బిల్లును అర్ధరాత్రి జగన్ రూపొందించడం విశేషం. ఆదివారం తెల్లవారుజాము 2.30గంటల వరకూ ఈ బిల్లు లో సాంకేతిక, న్యాయ పరమైన చిక్కులు లేకుండా.. బిల్లు ఆమోదానికి అడ్డంకులు ఎదురు కాకుండా సీఎం జగన్ దగ్గరుండి ఈ బిల్లును సిద్ధం చేసినట్టు సమాచారం.

తాజాగా ఉదయం 10.30గంటలకు కేబినెట్ సమావేశంలో ఈ బిల్లును ఏపీ కేబినెట్ ఆమోదించింది. ఇదే బిల్లును అసెంబ్లీలో సీఎం జగన్ ప్రవేశ పెట్టనున్నారు.

ఈ ఏపీ రాజధాని బిల్లులో ఏపీ రాజధాని గా అమరావతే కొనసాగనుంది. కానీ అధికారం మాత్రం అమరావతిలో ఉండదని సమాచారం. ‘ఏపీ డిసెంట్రలైజేషన్ అండ్ ఈక్వల్ డెవలప్ మెంట్ ఆఫ్ ఆల్ రిజియన్స్ బిల్-2020’ పేరుతో జగన్ సర్కారు ఈ కొత్త బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. కేవలం పరిపాలన విధులను మాత్రమే విశాఖకు తరలిస్తూ బిల్లు లో పొందు పరిచినట్టు సమాచారం. అధికారిక నిర్ణయానికి ఎక్కడా న్యాయ పరమైన ఇబ్బందులు రాకుండా అమరావతి రాజధాని గా చెబుతూ పరిపాలన మొత్తం వికేంద్రీకరించడానికి బిల్లులో కీలక ప్రతిపాదనలు చేసినట్టు సమాచారం.

ఇక మండలిలో టీడీపీ అడ్డుకున్నా తిరస్కరించినా మనీ బిల్లు కావడంతో 14 రోజుల్లోనే డీమ్డ్ టు బి యాక్సెప్టెడ్ గా పరిగణించి ఈ బిల్లును ప్రతిపాదించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. దీంతో మండలి లో అడ్డుకున్నా ఈ బిల్లు 14 రోజుల్లో ఆమోద ముద్ర పడనుంది. అమరావతి సీఆర్డీఏ ను మార్చి ‘అమరావతి మెట్రో రిజియన్ డెవలప్ మెంట్ ఆథారిటీ’గా బిల్లు లో మార్చినట్టు సమాచారం. ఇందులోకి రాజధాని గ్రామాలను చేర్చినట్టు తెలిసింది.