Begin typing your search above and press return to search.

ఈసారి ట్రక్కు సంగతి చూస్తామంటున్న జగదీశ్!

By:  Tupaki Desk   |   20 Sep 2019 5:07 AM GMT
ఈసారి ట్రక్కు సంగతి చూస్తామంటున్న జగదీశ్!
X
గులాబీ నేతల సుడి మామూలు కాదు. కింద పడ్డా పైచేయి తమదే అనేందుకు వీలుగా వారికి ఎప్పటికప్పుడు ఏదో ఒక సాకు దొరుకుతుంటుంది. ఎన్నికల్లో ఓడిన తర్వాత తమను తాము సమర్థించుకోవటానికి.. తమ లోపాల్ని కప్పిపుచ్చుకోవటం సాధ్యం కాని రీతిలో ఉంటుంది. ఇందుకు భిన్నంగా టీఆర్ ఎస్ నేతలు మాత్రం భలేగా చెబుతుంటారు. దిమ్మ తిరిగిపోయేలా షాకిచ్చిన తెలంగాణ ప్రజల కారణంగా సార్వత్రిక ఎన్నికల ఫలితాన్ని ఎంత మాత్రం జీర్ణించుకోలేకపోయిన టీఆర్ ఎస్ నేతలు.. బయటకు మాత్రం తాము ఓడలేదని.. ప్రజల్ని తమను ఓడించలేదని నమ్మకంగా చెబుతుంటారు.

తమ వాదనకు బలమైన ఆదారమంటూ వారు చూపించే సాక్ష్యం చూస్తే అవాక్కు అయ్యేలా చేసింది. తాము ఓడిపోవటానికి.. ప్రత్యర్థులు పన్నిన వలలో చిక్కుకోవటమేనని.. తమ పార్టీ గుర్తును పోలేలా ఉన్న ట్రక్కు గుర్తు కారణంగానే ఓడామే తప్పించి.. మామూలుగా అయితే తాము ఓడిపోయే అవకాశం లేదని చెబుతుంటారు. త్వరలో ఉప ఎన్నికలకు జరగనున్న నేపథ్యంలో ట్రక్కు సంగతి చూసేందుకు గులాబీ దళం సిద్ధమవుతోంది.

గతంలో ట్రక్కు కారణంగా స్వల్ప మెజార్టీతో ఓడిన నేపథ్యంలో ఈసారి అలాంటి పొరపాట్లు జరగకుండా చూస్తామని చెప్పారు మంత్రి జగదీశ్ రెడ్డి. త్వరలో హుజూర్ నగర్ (ఉత్తమ్ ఎంపీగా గెలిచిన నేపథ్యంలో ఈ స్థానంలో ఉప ఎన్నికల జరుగుతోంది) టీఆర్ ఎస్ అభ్యర్థిని అధినేత ప్రకటిస్తారని.. ట్రక్కు విషయంలో ఈసారి తాము అప్రమత్తంగా ఉండనున్నట్లు చెబుతున్నారు. మరి.. ట్రక్కు ఫ్యాక్టర్ ను తప్పించుకోవటానికి వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు సరే.. మరి ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను ఎలా కవర్ చేస్తారో చూడాలి.