Begin typing your search above and press return to search.

హైద‌రాబాద్ వర్షం కురిస్తే...అమ‌రావ‌తి మ‌టాష్‌

By:  Tupaki Desk   |   9 Oct 2017 6:14 AM GMT
హైద‌రాబాద్ వర్షం కురిస్తే...అమ‌రావ‌తి మ‌టాష్‌
X
ఒక్క‌రోజు వ‌రుస‌గా దాదాపు రెండుగంట‌ల పాటు హైద‌రాబాద్‌లో కురిసిన కుండ‌పోత వాన గురించి హైద‌రబాదీలంద‌రికీ గుర్తుండే ఉంటుంది. ఏక‌దాటిగా ప‌డిన ఈ వాన‌తో న‌గ‌రం అత‌లాకుత‌లం అయిపోయింది. హైద‌రాబాదీల బాధ‌లు వ‌ర్ణ‌ణాతీతం. తెల్లారేక‌ల్లా ప‌రిస్థితి దాదాపుగా సెట్ అయిపోయిన‌ప్ప‌టికీ....తీవ్ర‌మైన ఇక్క‌ట్లు ప‌డింది నిజం. అయితే తెలుగువారి ప‌దేళ్ల ఉమ్మ‌డి రాజ‌ధాని క‌ష్టాలు ఒక‌రోజుకే ప‌రిమితం అయితే....న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని అమ‌రావ‌తి విష‌యంలో ఇలాంటి వ‌ర్ష‌మే వ‌స్తే...సీన్ వేరేగా ఉంటుందంటున్నారు న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్‌ మాజీ ఛీప్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావు.

న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధానిగా అమ‌రావ‌తి ప్రాంతాన్ని ఎంపిక చేయ‌డంపై ఐవైఆర్‌ మ‌రోమారు త‌న గ‌ళం విప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం రాజధాని అమరావతి నిర్మాణానికి నిర్దేశించిన ప్రాంతం సహేతుకం కాదని స్పష్టం చేశారు. నెల్లూరులో పర్యావరణ పరిరక్షణపై ఏర్పాటు చేసిన ఓ సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐవైఆర్ కృష్ణారావు మాట్లాడుతూ రాజధాని అమరావతి మునక ప్రాంతమని, భవిష్యత్తులో వరద ముంపునకు గురయ్యే అవకాశముందని హెచ్చరించారు. అమరావతితో పోలిస్తే దోనకొండ అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేదని, దొనకొండలో ప్రభుత్వ భూములతోపాటు అన్ని వసతులు ఉన్నాయని చెప్పారు. రాజధాని ఎంపికలో శివరామకృష్ణన్‌ కమిటీ నివేదికను పట్టించుకోకపోవడం సరికాదని ఐవైఆర్ తెలిపారు.

ప్రస్తుతం హైదరాబాద్‌ లో ఇటీవల వర్షాలకు వచ్చిన వరద కంటే పదిరెట్లు ప్రమాదకర స్థాయిలో అమరావతిలో వరదలు వచ్చి మునిగే అవకాశముందని ఐవైఆర్ కృష్ణారావు హెచ్చరించారు. అలాగే పర్యావరణ పరిరక్షణకు తీవ్ర విఘాతం కలిగి భవిష్యత్తులో కాలుష్యం బారిన పడుతుందని అన్నారు. ఇన్ని అవరోధాలు కనిపిస్తున్నా ప్రభుత్వం ముందుకెళుతోందని విమర్శించారు. ఏక పక్షంగా నిర్మించిన రాజధానులు విజయవంతం కాలేదని ఏపీ రాజధానిని అందరి అంగీకారంతోనే నిర్మించాలని ఐవైఆర్‌ కృష్ణారావు డిమాండ్‌ చేశారు. రాజధానులు మహానగరాలుగా ఉండాల్సిన అవసరం లేదని, మహానగరమే అవసరమనుకుంటే విశాఖను ఎంపిక చేసి ఉండాల్సిందని అన్నారు. రాజధాని సమీపంలో ప్రభుత్వ భూములు అధికారంగా ఉండాలని అప్పుడే నగరం వేగంగా అభివృద్ధి చెందతుందని అన్నారు. హైదరాబాద్‌ సమీపంలో వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు ఉండటం వల్లే వందలాది కేంద్ర ప్రభుత్వ సంస్థలు వచ్చాయని ఐవైఆర్‌ కృష్ణారావు తెలిపారు.

మ‌రోవైపు ఆయన ప్రసంగించే సమయంలో కొందరు సభలో గందరగోళం సృష్టించారు. వారు మాట్లాడుతూ అమరావతి రాజధాని ఎంపిక సమయంలో తొలి సంతకం పెట్టిన వ్యక్తి అప్పటి ప్రధానకార్యదర్శి మీరే కదా అంటూ ఎదురు ప్రశ్నించారు. ఈ సమయంలో సభలో కాసేపు గందరగోళ వాతావరణం నెలకొంది. చివరకు కొద్దిసేపు మాట్లాడిన కృష్ణారావు కొందరిపై అసహనం వ్యక్తం చేశారు. తాను కేవ‌లం ప‌రిపాల‌న ప‌ర‌మైన సంతకాలు మాత్ర‌మే చేశాన‌ని, విధాన ప‌ర‌మైన నిర్ణ‌యాలు తీసుకునేది ప్ర‌భుత్వ పెద్ద‌ల‌ని గ్ర‌హించాల‌న్నారు.