Begin typing your search above and press return to search.

మోసానికి బాబుది ఫార్ములా..బీజేపీ పాలోయింగ్: ఐవీ రెడ్డి

By:  Tupaki Desk   |   29 Jan 2017 9:43 AM GMT
మోసానికి బాబుది ఫార్ములా..బీజేపీ పాలోయింగ్: ఐవీ రెడ్డి
X
ఒకవైపు ఏపీలో అనుదినం ఏ అంశం గురించి చర్చ జరుగుతోందో.. అదే అంశాన్ని చర్చ లోకి తీసుకొచ్చింది భారతీయ జనతా పార్టీ. బాబు ఫెయిల్యూర్ ను - బాబు మోసపూరిత ఆలోచనలను.. తమ విజయాలకు సోపానంగా మార్చుకోవాలని చూస్తోంది భారతీయ జనతా పార్టీ. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ విడుదల చేసిన మెనిఫెస్టోను గమనిస్తే.. ఇది చంద్రబాబు మోసానికి నకలు.. అని స్పష్టం అవుతోంది. ఏ మాటలతో అయితే బాబు ఏపీ ప్రజలను మోసం చేశాడో - అవే మాటలను భారతీయ జనతా పార్టీ యూపీలో చెబుతోంది! మోసపూరిత మంత్రాన్ని పఠిస్తోంది! ఇదంతా చూస్తుంటే.. ప్రజలను మోసం చేయడానికి బాబు ఒక ఫార్ములాను తయారు చేశాడని, దాన్ని ఆయన మిత్రపక్షాలు ఫాలో అవుతున్నాయని స్పష్టం అవుతోంది.

మోసపూరితంగా వ్యవహరించడంలో బాబు బీజేపీకి ఆదర్శంగా మారాడు. రైతులను - మహిళలను - విద్యార్థులను - బడుగుబలహీన వర్గాలను మోసం చేయడంలో పండితుడైన బాబును ఫాలో అవుతోంది బీజేపీ. ఏపీలో చంద్రబాబు ఎన్నికల సమయంలో ఏయే హామీలను ఇచ్చాడో.. యూపీలో తమ మెనిఫెస్టోలో బీజేపీ అవే అంశాలను పెట్టడం గమనించాల్సిన అంశం. రైతులకు రుణమాఫీ - యువతకు ల్యాప్ టాప్ లు - ఇంటికో ఉద్యోగం - మహిళల భధ్రతకు ప్రత్యేక ప్రాధాన్యతలను మెనిఫెస్టోలో ప్రముఖంగా పేర్కొంది బీజేపీ. ఇవే హామీలను ఇచ్చి ఏపీలో అధికారాన్ని సాధించుకుని బాబు ప్రజలకు వెన్నుపోటు పొడిచాడు.

యూపీలో భారతీయ జనతా పార్టీ ప్రధానంగా ఇచ్చిన హామీ రుణమాఫీ. రెండేళ్ల కిందట ఏపీలో చంద్రబాబు నాయుడు ఇదే హామీని ఇచ్చాడు ప్రజలకు. అమలుకు సాధ్యం కాని ఈ హామీని ఇచ్చి.. తడిగుడ్డతో గొంతు కోశాడు చంద్రబాబు. తనకు ఓటేయాలని - ఓటేస్తే.. అన్ని రుణాలూ మాఫీ చేసేస్తారని.. బ్యాంకులకు అనాపైసా కట్టొద్దని, తాకట్టులోని రైతు మహిళల బంగారాన్ని విడిపిస్తాను అని.. బాబు కన్నార్ప కుండా అబద్ధాలు ఆడాడు.

మోసపూరిత వాగ్దానాలను ఇచ్చి అధికారాన్ని సంపాదించుకున్న తర్వాత రుణమాఫీ వంటి అంశాల విషయంలో బాబు ఎంత కర్కశంగా వ్యవహరించాడో వివరించనక్కర్లేదు. ఏక కాలంలో అన్ని రుణాలనూ మాఫీ చేస్తానని చెప్పి.. దాన్ని ఐదేళ్లకు వాయిదా వేసి.. సవాలక్ష షరతులను పెట్టి మెజారిటీ రైతులను రుణమాఫీ పరిధిలోకి రాకుండా చేశాడు. కొంతమందికి నామమాత్రంగా మాఫీ చేస్తూ.. ఏడాదికి ఇంత అంటూ, కనీసం వడ్డీలకు కూడా సరిపడని స్థాయిలో నిధులిస్తూ.. మాఫీ అయిపోయింది మళ్లీ మోసపూరిత మాటలు మాట్లాడటం నిస్సిగ్గు చంద్రబాబుకే సాధ్యం అవుతోంది.

తిరిగి అధికారంలోకి వచ్చాకా రుణమాఫీకి కేటాయించిన నిధులు ఎన్ని? రాష్ట్రంలో రైతాంగానికి బ్యాంకుల్లో ఉన్న అప్పుల మొత్తం ఎంత? ఇప్పటి వరకూ ఎంత మాఫీ అయ్యింది? ఎంతమందికి మాఫీ చేశారు? వంటి అంశాల గురించి శ్వేతపత్రం విడుదల చేసే దమ్ములేదు చంద్రబాబుకు. అయితే… మాఫీ అయిపోయింది అంటూ రైతుల్లో మరింత అసహనం కలిగిస్తున్నాడు తెలుగుదేశం అధినేత.

మరి మోసానికే కాలం అని అనుకుంటున్నారో ఏమో కానీ.. కమలం వాళ్లూ ఇవే మాటలు చెబుతున్నారు. రుణమాఫీ హామీతో సహా మిగిలిన తెలుగుదేశం హామీలను కూడా వారు పల్లవిగా అందుకుంటున్నారు. యువతకు ల్యాప్ టాప్ లు, విద్యార్థులకు స్మార్ట్ ఫోన్లు ఇస్తానని ఏపీలో బాబు చెప్పాడు, యూపీలో బీజేపీ చెబుతోంది. ఇక ఇంటికో ఉద్యోగం.. బాబు చెప్పిన మరో ప్రహసనపు మాట. బీజేపీ కూడా దాన్నే అందుకుంది. మహిళల భద్రత కోసం ప్రత్యేక ఏర్పాట్లు.. బాబు ఇచ్చిన హామీ గురించి ఎంతగా చెప్పుకున్నా తక్కువే!

రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకుంటే.. దానికి బాధ్యులపై చర్యలు లేవు, ఇక విధి నిర్వహణలో ఉన్న మహిళా తహశీల్దారు మీద దాడికి పూనుకున్నాడు తెలుగుదేశం ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, అదేమంటే.. తిరిగి ఆ మహిళా ఉద్యోగిణి మీదే దాడి. స్వయంగా చంద్రబాబే ఆమెను దండించి.. మహిళల పట్ల తన వైఖరేమిటో వివరించాడు. ఇక ఏపీలో మహిళలపై గత రెండేళ్ల కాలంలో నమోదైన అఘాయిత్యాల గురించి గణాంకాలను చూస్తే.. దేశంలోనే అత్యంత దయనీయమైన స్థితిలో ఉందని ఈ రాష్ట్రం అనేది స్పష్టం అవుతోంది. అయితే.. ఆయనొస్తే.. మహిళలకే భయమే లేదని, చెప్పి భయానకమైన వాతావరణాన్ని కల్పించింది తెలుగుదేశం పార్టీ. ఈ విషయంలోనూ కమలం టీడీపీనే ఆదర్శంగా తీసుకుంది!

మరి ఒక చోట ప్రజలను మోసం చేయడానికి ఉపయోగపడిన మాటలు మరో చోట ఉపయోగపడతాయా? ఏపీలో విజయం సాధించిన మోసపూరిత వాగ్ధానాలు యూపీలోనూ వర్కవుట్ అవుతాయా? ఏపీ ప్రజలు మోసపోయినట్టుగానే యూపీ ప్రజలూ మోసపోతారా? బాబు మోసపూరిత వైఖరినే ఆదర్శంగా తీసుకున్న బీజేపీ చిత్తయిపోవచ్చు.

-ఐవీ రెడ్డి,
వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఇన్ చార్జ్, గిద్దలూరు నియోజకవర్గం, ప్రకాశం జిల్లా

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/