Begin typing your search above and press return to search.

కవిత ఓటమికి ప్రతీకారం వేళైంది..

By:  Tupaki Desk   |   16 Dec 2019 5:12 AM GMT
కవిత ఓటమికి ప్రతీకారం వేళైంది..
X
చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏమొస్తుంది. ఇప్పుడు నిజామాబాద్ రైతుల బాధ అలాగే ఉంది. సీఎం కేసీఆర్ కూతురు, మాజీ ఎంపీ కవితను పట్టుబట్టి ఓడించిన రైతులు ఇప్పుడు అనుభవిస్తున్నారట.. అవును అధికారంలోకి వస్తే ఆరు నెలల్లోనే పసుపు బోర్డు, పంటలకు మద్దతు ధర ఇప్పిస్తానని కవితపై తిరుగుబాటు చేయించిన నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఇప్పుడు చావుకబురు చల్లాగా చెప్పాడు. పసుపు బోర్డులు కష్టమని సంక్రాతి వరకు ట్రై చేస్తానంటున్నాడు. మద్దతు ధర కేంద్రం నిర్ణయించాలంటున్నాడు. స్వయంగా బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్నా కనీస పసుపు బోర్డు తేలేని ఎంపీ అరవింద్ పై ఇప్పుడు అక్కడి పసుపు రైతులు పోరుబాట పట్టారు.

నమ్మించి నట్టేట ముంచేశాడని నిజామాబాద్ రైతులు ఇప్పుడు బీజేపీ ఎంపీ అరవింద్ పై పోరుబాట పట్టారు. పసుపు బోర్డు ఏర్పాటు చేస్తానని చెప్పిన ఎంపీ అరవింద్ ఎన్నికల సమయంలో రైతులను ఉసిగొల్పి ఎంపీ కవితపై పోటీచేయించి ఆమె ఓటమికి కారణమయ్యాడు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందని ఆరునెలల్లోనే పసుపు బోర్డు ఏర్పాటు మద్దతు ధర ఇప్పిస్తానని రైతులను నమ్మించి నిజామాబాద్ ఎంపీగా గెలిచాడు. కానీ ఇప్పుడేమైంది. పసుపు బోర్డుపై మాట దాటవేస్తున్నారు.

దీంతో తత్త్వం బోధపడిన రైతులు తాజాగా రైతు ఐక్య కార్యాచరణ కమిటీగా ఏర్పాడ్డారు. పసుపు బోర్డు ఏర్పాటు, పంటలకు మద్దతు ధర కోసం నేటి నుంచి రైతు జేఏసీ పాద్రయాత్రకు శ్రీకారం చుట్టింది. వీరికి మద్దతుగా అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలు పసుపు బోర్డు కావాల్సిందేనని మరో ఉద్యమానికి తెరలేపుతున్నారు. రైతు ఐక్యకార్యాచరణ కమిటీ సభ్యులు తాము పార్టీలకతీతంగా యాత్ర చేపడుతున్నామని పేర్కొంటుంటే.. టీఆర్ఎస్ నేతలు మాత్రం ఎంపీ అరవింద్ టార్గెట్ గా ఉద్యమం నిర్వహిస్తామని ప్రకటిస్తున్నారు.

టీఆర్ఎస్ కు అనుబంధంగా ఉన్న రైతు నేతలు ఆదివారం సమావేశమై ఎంపీ అరవింద్ ఎన్నికల్లో ఇచ్చిన హామీకి అనుగుణంగా పసుపు బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలను, రైతులను భాగస్వామ్యం చేసి అరవింద్ పై ఉద్యమానికి శ్రీకారం చుట్టారు.

ఇక అరవింద్ మాటలు విని కవితను ఓడించిన రైతు నేతలకు ఇప్పుడు తత్త్వం బోధపడింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎంపీ పసుపు బోర్డు ఏర్పాటు చేయకపోవడంపై వారంతా రగిలిపోతున్నారు. తమను నమ్మించి మోసం చేశాడని ఆరోపిస్తున్నారు. కవితను ఓడించి పెద్ద తప్పు చేశామని పశ్చాత్తాప పడుతున్నారు. అయినా చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏమొస్తుంది.. ఇప్పుడు నిజామాబాద్ ఎంపీని దెబ్బకొట్టే సమయం టీఆర్ఎస్ కు వచ్చింది. ఆయనపై ప్రతీకారానికి గులాబీ దండు సిద్ధమైంది. అదును చూసి రైతుల ఆగ్రహాన్ని ఆయనపైకి నెట్టేందుకు అధికార టీఆర్ఎస్ రెడీ అయ్యింది.