Begin typing your search above and press return to search.

జెట్ స్పీడ్ లో ఐటీ రంగం..కీలక వ్యాఖ్యలు చేసిన ‘గార్టనర్’

By:  Tupaki Desk   |   2 Dec 2021 5:34 AM GMT
జెట్ స్పీడ్ లో ఐటీ రంగం..కీలక వ్యాఖ్యలు చేసిన ‘గార్టనర్’
X
కరోనా మహమ్మారి విరుచుకుపడిన వేళ.. తమ ఉపాధి అవకాశాల మీద బోలెడంత భయాందోళనలకు గురయ్యారు ఐటీ ఉద్యోగులు. అయితే.. మిగిలిన రంగాల సంగతి ఎలా ఉన్నా.. ఐటీ రంగం జోరు అంతకంతకూ పెరగటమే కాదు.. కరోనా వేళ.. ఈ రంగం.. ఆ రంగం అన్న తేడా లేకుండా ప్రతి రంగం ఐటీ సేవల్ని తమకు తగ్గట్లుగా మార్చుకోవటానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేయటం తెలిసిందే. దీంతో.. ఐటీ రంగం తిరుగులేని రీతిలో దూసుకెళుతోంది. తాజాగా అందుబాటులోకి వచ్చిన సరికొత్త సాంకేతికతల్ని అందిపుచ్చుకోవటం కోసం పెద్ద ఎత్తున ఖర్చు పెట్టటానికి కంపెనీలు సిద్ధపడుతున్నట్లుగా చెబుతున్నారు.

ఇదే అంశాన్ని ప్రముఖ పరిశోదనా సంస్థ 'గార్టనర్' కూడా చెబుతోంది. పెద్ద ఎత్తున సంస్థలు డిజటలీకరణ.. క్లౌడ్ కు అనుగుణంగా సాంకేతిక వ్యవస్థల్ని మార్పులు చేసుకోవటం కారణంగా గతంలో ఎప్పుడూ లేనంత గరిష్ఠ స్థాయికి ఐటీ వ్యయాలు చేరనున్నట్లు చెబుతున్నారు. దీనికి 2022 వేదిక అవుతుందని అంచనా వేస్తున్నారు. రానున్న మూడేళ్లు ఐటీ సంస్థలకు పండుగ కాలం లాంటిదని చెబుతున్నారు. ఐటీ కంపెనీలకు భారీ అవకాశాలు లభించే నేపథ్యంలో లక్ష్యాలకు మించి ఫ్రెషనర్లకు అవకాశాలు ఇవ్వనున్నట్లుగా చెబుతున్నారు.

దేశీయంగా ఐటీ వ్యయాలు వచ్చే ఏడాదికి సుమారు రూ.7.63 లక్షల కోట్లకు చేరొచ్చని అంచనా వేస్తున్నారు. 2020తో పోలిస్తే 2021లో ఐటీ వ్యయాలు 10.8 శాతం అధికమవుతున్నాయని.. దీంతో పోలిస్తే వచ్చే ఏడాది మరో ఏడు శాతం పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. సాఫ్ట్ వేర్ రంగంలో పెద్ద ఎత్తున నియామకాలు జరుగుతాయని.. కొవిడ్ ముందుతో పోలిస్తే.. దాదాపు రెట్టింపు వ్యయాలు 2022లో సాఫ్ట్ వేర్ మీద జరగనున్నట్లు చెబుతున్నారు.

ఈ కారణంగా ఫ్రెషర్లకు భారీగా అవకాశాలు రానున్నట్లు చెబుతున్నారు. క్లయింట్ల అవసరాలకు తగ్గట్లు సీనియర్లను.. అనుభవంతో ఉన్న వారిని నియమించుకునేందుకు సంస్థలు అధికంగా ఖర్చు చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఈ కారణంగా ఐటీ ఉద్యోగుల జీతాల్లోనే పెరుగుదల ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. టీసీఎస్ 43 వేల మందిని నియమించుకోవాలని ప్లాన్ వేసి ఇప్పటికే పూర్తి చేసిందని.. మరో 35 వేల మందిని ఎంపిక చేసుకున్నట్లు చెబుతున్నారు. అదే రీతిలో ఇన్ఫోసిస్ సైతం 35 వేల మందిని నియమించుకోవాలని తొలుత అనుకున్నప్పటికి.. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మరో 10వేల మందిని అదనంగా నియమించుకోవాలని ప్లాన్ చేస్తోంది.

ఇదే బాటలో హెచ్ సీఎల్ కూడా వ్యవహరిస్తోంది. 2022-23 కు సంబంధించి 30 వేల మంది ఫ్రెషర్లను నియమించుకునే ప్లాన్ చేస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికి 20-22 వేల మందిని ఎంపిక చేయటం గమనార్హం. ఐటీ సేవల కోసం అంతర్జాతీయ కంపెనీలు వెచ్చించే మొత్తం 2021తో పోలిస్తే 2022లో 11 శాతం పెరుగుతుందని గార్ట నర్ అంచనా వేస్తోంది. ఈ అవకాశాల్ని భారతీయ కంపెనీలుఅందిపుచ్చుకుంటాయని చెబుతున్నారు. భారతీయ టెక్ కంపెనీలకు ఉన్న సమర్థత నేపథ్యంలో క్లౌడ్.. డిజటలీకరణ దిశగా సాంకేతికతను మార్చుకునేందుకు పలు సంస్థలు తమ కాంట్రాక్టులను భారత్ టెక్ కంపెనీలకు కేటాయిస్తాయని చెబుతున్నారు. సో.. ఐటీ రంగంలోని వారందరికి రానున్నదంతా మంచి కాలమేనని చెప్పక తప్పదు.