Begin typing your search above and press return to search.

క‌రోనా షాకింగ్‌..భార‌త్‌లో బ్యాడ్ టైం ఎప్పుడంటే

By:  Tupaki Desk   |   7 Aug 2020 5:00 AM GMT
క‌రోనా షాకింగ్‌..భార‌త్‌లో బ్యాడ్ టైం ఎప్పుడంటే
X
భార‌త‌దేశంలో క‌రోనా వైర‌స్ విస్తృతి కొన‌సాగుతోంది. ప్ర‌తిరోజు వేల మంది క‌రోనా బారిన ప‌డుతున్నారు. తాజాగా, క‌రోనా కేసులు 20 ల‌క్ష‌ల‌కు చేరువ అ‌య్యాయి. గ‌త ప‌ది రోజులుగా 50 వేల‌కు త‌గ్గ‌కుండా పాజిటివ్ కేసులు న‌మోద‌వుతున్నాయి. తాజాగా 56 వేల‌కుపైగా క‌రోనా కేసులు రికార్డ‌య్యాయి. ఈ ప‌రిస్థితిని విశ్లేషిస్తున్న ఆరోగ్య నిపుణులు, భార‌త‌దేశంలో క‌రోనా వైర‌స్ రెండో ద‌శ మొద‌లైంద‌ని విశ్లేషిస్తున్నారు. మన దేశంలో జులై నాటికే కరోనా తారాస్థాయికి చేరుతుందనే అంచ‌నాలు వెలువ‌డిన‌ప్ప‌టికీ, అలాంటి ప‌రిణామాల యొక్క సూచ‌న‌లు ఆగ‌స్టులో చోటు చేసుకుంటున్నాయ‌ని పేర్కొంటున్నారు. సెప్టెంబ‌ర్‌, అక్టోబ‌ర్‌లో రెండో ద‌శ‌కు చేర‌డం ఖాయ‌మ‌ని అంచ‌నా వేస్తున్నారు.

దేశ‌వ్యాప్తంగా కొత్త‌గా 56,282 మందికి క‌రోనా వైర‌స్ సోకింది. దీంతో దేశంలో క‌రోనా కేసుల సంఖ్య 19,64,537కు చేరింది. ఇప్ప‌టివ‌ర‌కు న‌మోదైన పాజిటివ్ కేసుల్లో 5,95,501 మంది బాధితులు ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు. మ‌రో 13,28,337 మంది కోలుకున్నారు. తాజాగా క‌రోనా బారిన‌ప‌డిన‌వారిలో 904 మంది మ‌ర‌ణించారు. ఒకేరోజు ఇంత పెద్ద సంఖ్య‌లో బాధితులు మ‌ర‌ణించ‌డం ఇదే మొద‌టిసారి. దీంతో క‌రోనా మృతులు 40,699కు చేరారు. దేశంలో రిక‌వ‌రీ రేటు 67 శాతం దాటింద‌ని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది. వైరస్ కేసులు సంఖ్య భారీగా ఉన్నా…చాలావరకూ ప్రజలకు వైరస్‌పై అవగాహన వచ్చింది కాబ‌ట్టి వైరస్ మరణాల సంఖ్య తక్కువనే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

ఇక క‌రోనా వైర‌స్ రెండో ద‌శ గురించి గ‌మ‌నిస్తే, వాతావర‌ణ మార్పుల వ‌ల్ల ప్ర‌స్తుతం అంటువ్యాధులు సంభ‌విస్తున్నాయి. అయితే,దీనిపై ప‌లు స‌మ‌స్య‌లు తెర‌మీద‌కు వ‌స్తున్నాయి. ఏది కరోనా జ్వరమో, జలుబో, ఏది సాధారణ ఫ్లూ జలుబో గుర్తించ‌క‌ముందే చికిత్స‌కు నిరాక‌రిస్తున్నారు. ఇలాంటి త‌రుణంలో వ్యాధి విస్తృతి వ‌చ్చే రెండు నెల‌ల్లో మ‌రింత పెరుగ‌వ‌చ్చ‌ని అంచ‌నా వేస్తున్నారు. రాబోయే సెప్టెంబర్-అక్టోబర్ నెలల్లో వ్యాధి ముదిరే చాన్స్ ఉంద‌ని విశ్లేషిస్తున్నారు. కేసుల విస్తృతి ఇలాగే కొన‌సాగితే క‌రోనా రెండో ద‌శ‌గా పేర్కొన‌వ‌చ్చ‌ని...లాక్ డౌన్ విధించే అవ‌కాశాలు కూడా ఉన్నాయ‌నే చ‌ర్చ జ‌రుగుతోంది.