Begin typing your search above and press return to search.

ఇందిరా గాంధీ చేసిన ప‌నే చేస్తున్న కేసీఆర్‌... ఓట‌మి ఖాయ‌మా?

By:  Tupaki Desk   |   3 Feb 2022 4:05 AM GMT
ఇందిరా గాంధీ చేసిన ప‌నే చేస్తున్న కేసీఆర్‌... ఓట‌మి ఖాయ‌మా?
X
భార‌త రాజ్యాంగాన్ని మార్చాల్సిందే అంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చేసిన ఒక్క వ్యాఖ్య రాష్ట్రంలోని రాజ‌కీయ వేడిని ఊహించిన రీతిలో మార్చివేసిన సంగ‌తి తెలిసిందే. రాజ‌కీయ పార్టీలు, ప్ర‌జాస్వామ్య‌వాదులు, ద‌ళిత సంఘాలు ఈ ఎపిసోడ్‌పై ఒకింత ఘాటుగానే స్పందిస్తున్నాయి. ఇక ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ పై కూడా ఈ కామెంట్ల స‌మ‌యంలోనే ఘాటు విమ‌ర్శ‌లు చేసినందున బీజేపీ సైతం కేసీఆర్‌ను టార్గెట్ చేస్తోంది. తాజాగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజ‌య్ అయితే ఏకంగా కొత్త లాజిక్ తీసి కేసీఆర్ పై విరుచుకుప‌డ్డారు.

భారత రాజ్యాంగాన్ని సమూలంగా మార్చి కొత్త రాజ్యాంగాన్ని తీసుకురావాలని తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనను భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని బండి సంజ‌య్ స్ప‌ష్టం చేశారు. బాబా సాహెబ్ అంబేద్కర్ నాయకత్వంలో 369 నిబంధనలు, 8 షెడ్యూళ్లతో అతిపెద్ద లిఖితపూర్వక భారత రాజ్యాంగాన్ని బాబూ రాజేంద్రప్రసాద్ గారికి 1950 నవంబర్ 23న అందించిన రోజును భారత రాజ్యాంగ దినోత్సవంగా నిర్వహించుకుంటుండ‌గా సీఎం కేసీఆర్ ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డం ఏంట‌ని వ్యాఖ్యానించారు. ఇంత గొప్ప రాజ్యాంగాన్ని మార్చాలనే ఆలోచన కేసీఆర్ కు రావడం దురదృష్టకరమ‌ని, దీని వెనకాల కుట్ర దాగి ఉందని ఆరోపించారు.

రాజ్యాంగం కారణంగా ఎస్సీ, ఎస్టీలు భారత పార్లమెంట్ కు, శాసనసభకు ఎన్నిక కావడాన్ని సహించలేని కేసీఆర్ రాజ్యాంగాన్ని మార్చడం గురించి ఆలోచిస్తున్నాడని బండి సంజ‌య్ మండిప‌డ్డారు. ``గతంలో ఇందిరాగాంధీ కూడా రాజ్యాంగంలోని ప్రాథమిక సూత్రాలను మార్పు చేసే కుట్రపన్ని భంగ‌పడ్డారు. ఎన్నికల్లో ఓడిపోయి పరాభావాన్ని చవిచూశారు. ఇందిరాగాంధీ లాంటి నాయకులే రాజ్యాంగాన్ని మార్చాలనుకొని భంగపడితే.... ఆఫ్ట్రాల్ కేసీఆర్.. నువ్వెంత..?`` అంటూ బండి సంజ‌య్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

కేసీఆర్ త‌న మాటలకు భేషరతుగా జాతికి క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేస్తోందన్నారు. రాజ్యాంగాన్ని మార్చాలనే కేసీఆర్‌ కుట్రలకు నిరసనగా గురువారం తెలంగాణలో బీజేపీ నిరసన కార్యక్రమాలు చేస్తుందని ప్ర‌క‌టించారు.