Begin typing your search above and press return to search.

ఇజ్రాయిల్ ముంద‌డుగు: క‌రోనాకు మందు ఆవిష్క‌ర‌ణ‌

By:  Tupaki Desk   |   21 April 2020 9:15 AM IST
ఇజ్రాయిల్ ముంద‌డుగు: క‌రోనాకు మందు ఆవిష్క‌ర‌ణ‌
X
ప్ర‌పంచ వ్యాప్తంగా కరోనా వైరస్ క‌ట్ట‌డి కోసం మందు క‌నిపెట్ట‌డంలో అన్ని దేశాలు ప‌రిశోధ‌న‌లు చేస్తున్నాయి. ఆయా దేశాల్లోని శాస్త్ర‌వేత్త‌లు, ప‌రిశోధ‌న సంస్థ‌లు, కంపెనీలు క‌రోనా నివార‌ణ‌కు డ్ర‌గ్ ఆవిష్క‌ర‌ణ‌కు విస్తృతంగా ప్ర‌యోగాలు, ప‌రిశోధ‌న‌లు, అధ్య‌య‌నం జ‌రుగుతోంది. ప్ర‌స్తుతం క‌రోనా విజృంభించ‌డానికి కార‌ణం మందు లేక‌పోవ‌డ‌మే. మందు ఉండి ఉంటే క‌రోనా వైర‌స్ ఇంత‌గా వ్యాప్తి చెందే అవ‌కాశం ఉండ‌లేని ప‌రిస్థితి. అయితే ఈ పరిశోధనల్లో ఇజ్రాయిల్ ముందడుగు వేసినట్టు క‌నిపిస్తోంది. ఇజ్రాయిల్‌ కు చెందిన ప్లూరిస్టెమ్ థెరపూటిక్స్ సంస్థ ప్రయోగాలు చేస్తోంది.

ఈ విష‌యాన్ని ఆ కంపెనీ ప్ర‌క‌టించింది. శ్వాస వ్యవస్థలు దెబ్బతిని, పలు అవయవాలూ పని చేయకుండా శల్యావస్థలో ఉన్న ఏడుగురు పేషెంట్లపై తాము చేసిన ప్రయోగాలు విజయవంతం అయ్యాయని ప్లూరిస్టెమ్ థెరపూటిక్స్ ప్ర‌క‌టించింది. ఈ ప్ర‌యోగాల‌పై తాము రూపొందించిన డ్రగ్ కరోనా వైర‌స్‌ ను క‌ట్ట‌డి చేస్తుంద‌ని విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. అల్లోజినిక్ ప్లాసెంట‌ల్ ఎక్స్‌పాండెడ్ (allogeneic placental expanded -PLX) cells థెరపీని అమెరికాలో కూడా ట్రయల్స్ వేస్తున్నట్లు ప్లూరిస్టెమ్ థెరపూటిక్స్ వెల్ల‌డించింది. న్యూజెర్సీలోనూ ఓ క్రిటికల్ పేషెంటు పై దీన్ని ప్రయోగిస్తున్నారు.

ప్లాసెంటా సెల్స్ ఈ థెర‌పీ లో ఉపయోగించ‌నున్నారు. పలు అనారోగ్య కారణాలకు ప్లాసెంటా సెల్స్ ఉపయోగిస్తున్నారు. కరోనా వైర‌స్‌ పై దీనిని ప్రయోగిస్తున్నారు. ఇది మనిషిలోని వ్యాధి నిరోధ‌క శ‌క్తిని (ఇమ్యూనిటీ) బాగా పెంచుతుందని ప్లూరిస్టెమ్ థెరపూటిక్స్ కంపెనీ సీఈఓ, ప్రెసిడెంట్‌ యాకీ యానయ్ వెల్ల‌డించారు. దీనిపై ట్రయల్స్ త్వరలో పూర్తి చేస్తామ‌ని, అనుమతులు కూడా త్వరగానే వస్తాయని ఆయ‌న ఆశాభావం వ్య‌క్తం చేశారు. దీనిపై ఒకసారి అనుమతులు వచ్చాయంటే.. వేల మందికి చికిత్స ప్రారంభిస్తామని ఆ కంపెనీ పేర్కొంది. అమెరికా, ఇజ్రాయిల్ ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇస్తే... తాము రంగంలోకి దిగుతామని చెబుతున్నారు.