Begin typing your search above and press return to search.

కొత్త జిల్లాల నోటిఫికేషన్ అసలు లెక్క ఇదేనా?

By:  Tupaki Desk   |   27 Jan 2022 6:30 AM GMT
కొత్త జిల్లాల నోటిఫికేషన్ అసలు లెక్క ఇదేనా?
X
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలివే తెలివిగా పలువురు అభివర్ణిస్తున్నారు. ఎప్పుడేం చేయాలో ఆయనకు తెలిసినంత బాగా మరెవరికీ తెలీదని చెబుతున్నారు. నెలల తరబడి నలుగుతున్న కొత్త జిల్లాల విషయాన్ని అనూహ్యంగా తెర మీదకు తీసుకురావటం ద్వారా ఆయన అందరిని విస్మయానికి గురి చేశారు.

సాధారణంగా ప్రభుత్వం తీసుకునే కీలక నిర్ణయాల్ని మీడియా ముందుగా పసిగడుతుంది. కానీ.. కొత్త జిల్లాల విషయంలో మాత్రం అలాంటి అవకాశం ఇవ్వలేదు. ఆన్ లైన్ లో జరిగిన మంత్రివర్గ సమావేశంలోని దీన్ని ప్రస్తావించటం.. చర్చించటం.. ఆ వెంటనే నిర్ణయం తీసుకోవటం.. గంటల వ్యవధిలోనే గెజిట్ నోటిఫికేషన్ విడుదల కావటం చూస్తే.. అన్నీ పక్కాగా ప్లానింగ్ ప్రకారమే జరిగిందన్న మాట వినిపిస్తోంది.

ఇక.. కొత్త జిల్లాల నోటిఫికేషన్ తో అప్పటివరకు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా ఉన్న రెండుఇష్యూస్ డైవర్టు అయ్యాయనే చెప్పాలి. కొత్త జిల్లాల ప్రకటనకు ముందు వరకు ఏపీలో హాట్ టాపిక్ గా నడిచింది ప్రభుత్వ ఉద్యోగుల కొత్త జీతాలు.. సమ్మె ప్రకటన. రెండో అంశం.. మంత్రి కొడాలి నాని వారి కె కనెన్షన్ సెంటర్ లో జరిగిన కాసినో వ్యవహారం. కొత్త జిల్లాల ప్రకటనతో ఈ రెండు అంశాలకు ప్రాధాన్యత తగ్గిపోవటం.. కొత్త జిల్లాలకు సంబంధించిన అభ్యంతరాలు.. ఆనందాలతో రాష్ట్రంలోని రాజకీయ వాతావరణం పూర్తిగా మారిపోయింది.

ఇదంతా చూసిన వారు.. ఉద్యోగుల సమ్మె ప్రకటన గండాన్ని సీఎంజగన్ ఎలా అధిగమిస్తారన్న సందేహం ఉండేది. ఏదైనా ఇష్యూ రగులుకొని.. అది పెద్దది అయ్యే సమయానికి అనూహ్య ప్రకటనతో వేరే అంశాన్ని తెరమీదకు తీసుకొచ్చే టాలెంట్ సీఎం జగన్ లో ఎక్కువే అన్న విషయం తాజాగా మరోసారి నిరూపణ అయ్యిందని చెబుతున్నారు.

కొన్ని నెలలుగా నలుగుతున్న కొత్త జిల్లాల ఇష్యూను ఫలానా సమయంలో ఉంటుందన్న విషయంపై ఎప్పుడూ క్లారిటీ ఇచ్చేవారు కాదు. ఏమైనా.. కొత్త జిల్లాల ప్రకటన.. గురి చూసి వదిలిన బాణంలా దూసుకెళ్లిందని..సీఎం జగన్ కోరుకున్నట్లే.. ఈ విషయం మీదనే ఇప్పుడు చర్చ మొత్తం సాగుతోందని చెబుతున్నారు. మరి.. ఇప్పటివరకు హాట్ టాపిక్ గా మారిన ఏపీ ఉద్యోగుల సమ్మె.. మంత్రి కొడాలి నాని కాసినో ఎపిసోడ్ మళ్లీ ఎప్పుడు తెర మీదకు వస్తాయన్నది ప్రశ్నగా మారింది.