Begin typing your search above and press return to search.

అమరావతిపై విజయవాడలోనే మద్దతు లేదా ?

By:  Tupaki Desk   |   7 March 2021 9:40 AM GMT
అమరావతిపై విజయవాడలోనే మద్దతు లేదా ?
X
రాష్ట్ర రాజకీయాలకు కేంద్ర బిందువు, రాజధాని అమరావతికి సమీపంలోనే ఉన్న విజయవాడ జనాల్లోనే అమరావతిపై సెంటిమెంటు లేదా ? అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇది కూడా వైసీపీ నేతలో లేకపోతే తెలుగుదేశంపార్టీ వ్యతిరేకులో చెప్పింది కాదు. స్వయంగా చంద్రబాబునాయుడే తేల్చి చెప్పిన విషయం. విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ అభ్యర్ధి కేశినేని శ్వేత, డివిజన్లోని అభ్యర్ధుల తరపున చంద్రబాబు రోడ్డుషో నిర్వహించారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ అమరావతి సెంటిమెంటు విజయవాడ జనాల్లోనే లేకపోతే ఎలా ? అంటు మండిపడ్డారు. అమరావతి కోసం నేనొక్కణ్ణే పోరాటం చేయాలా ? ఏం మీకు బాధ్యత లేదా ? అంటూ జనాలను నిలదీశారు. తాను పోరాటం చేస్తుంటే జనాలు మాత్రం ఇళ్ళల్లో కూర్చుని భోజనం చేసి హాయిగా నిద్రపోతున్నారంటూ రగిలిపోయారు. పట్టిసీమ నీళ్ళు తాగటం లేదా ? మీకు రోషం లేదా ? అంటూ పదే పదే జనాలను రెచ్చగొట్టే ప్రయత్నంచేశారు.

అమరావతి పరిరక్షణ కోసం ఇంటికొకరు రోడ్లపైకి వచ్చి పోరాటాలు చేయలేరా ? రాజధానిని పరిరక్షించుకోవటం కోసం అన్నీ నేనే చేయాలా ? మీరు మాత్రం ఏమీ చేయరా ? అంటూ కోపడ్డారు. విజయవాడ కార్పొరేషన్లో గెలిచి మేయర్ పీఠాన్ని అందుకోలేకపోతే తలెత్తుకుని తిరగలేమని రోడ్డుషోలో తన పక్కనే ఉన్న నేతలను ఉద్దేశించి చెప్పారు. ఆధిపత్య పోరాటాలను పక్కన పెట్టి అందరు కలిసి ఐకమత్యంగా పోరాటం చేస్తేనే కార్పొరేషన్ గెలుస్తుందని నేతలకు ఫుల్లుగా క్లాసు పీకారు.

తాజాగా చంద్రబాబు మాటలు విన్న తర్వాత అమరావతి సెంటిమెంటు విజయవాడలో లేదన్న విషయం స్పష్టంగా అర్ధమైపోయింది. విజయవాడలోనే సెంటిమెంటు లేకపోతే ఇక రాష్ట్రవ్యాప్తంగా ఎందుకుంటుంది ? ఇంతకాలం అమరావతిని రక్షించుకోవాలనే సెంటిమెంటు రాష్ట్రమంతటా ఉందని చంద్రబాబు అండ్ కో చెప్పిందంతా అబద్దాలే అని రోడ్డుషోలో స్వయంగా చంద్రబాబే అంగీకరించారు.