Begin typing your search above and press return to search.

వారిది ‘ఉక్కు’ స్నేహమేనా..? చేతులు కలిపిన అవంతి - గంటా!

By:  Tupaki Desk   |   12 Feb 2021 2:01 PM IST
వారిది ‘ఉక్కు’ స్నేహమేనా..? చేతులు కలిపిన అవంతి - గంటా!
X
వారు ఒక‌ప్పుడు ప్రాణ స్నేహితుల్లా మెదిలారు..! గురు శిష్యులుగా ముద్ర ప‌డ్డారు..! కానీ.. రాజ‌కీయాల్లో శాశ్వ‌త శ‌త్రువులు - శ‌శ్వాత మిత్రులు ఉండ‌రు క‌దా.. ఈ సామెత వారికీ వ‌ర్తించింది. 2019 ఎన్నిక‌ల ముందు ఇద్ద‌రూ విడిపోయారు.. ప్ర‌త్య‌ర్థులుగా మారారు.. ఎంత‌గా అంటే.. ఒక‌రి పొడ‌ మ‌రొక‌రు గిట్ట‌న‌ట్టుగా! సీన్ క‌ట్ చేస్తే.. ఇప్పుడు ఇద్ద‌రూచేతులు క‌లిపారు! వైజాగ్ స్టీల్ ప్రైవేటీక‌ర‌ణ‌ను వ్య‌తిరేకిస్తూ సాగుతున్న పోరాట వేదిక‌పైకి ఈ ఇద్ద‌రు నేత‌లు వ‌చ్చారు. మ‌రి, వీరిది ఎలాంటి స్నేహం కాబోతోంది? విశాఖ రాజకీయాల్లో ఈ చర్చ కూడా సాగుతోంది.

ఒకే వేదిక మీదకు...

మోడీ ప్ర‌భుత్వం తీసుకున్న ఉక్కు ఫ్యాక్ట‌రీ ప్రైవేటీక‌ర‌ణ నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకిస్తూ గంటా శ్రీనివాస‌రావు త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేశారు. అది స‌రిగా లేదంటే.. మ‌రోసారి పంపించారు. ఉక్కు ఫ్యాక్ట‌రీ వ‌ద్ద సాగుతున్న ఆందోళ‌న కేంద్రం వ‌ద్ద‌కు వెళ్లి మ‌ద్ద‌తు తెలిపారు. కేంద్రం వెన‌క్కు త‌గ్గే వ‌ర‌కూ పోరాటం సాగుతుంద‌ని చెప్పారు. ఇదే వేదిక వ‌ద్ద‌కు మంత్రి అవంతి శ్రీనివాస్ కూడా వ‌చ్చారు. వీరిద్ద‌రితో క‌లిసి సీపీఐ నేత నారాయ‌ణ కాసేపు హంగామా చేశారు. తాను మ‌ధ్య‌లో ఉండి.. ఇద్ద‌రి చేతులు ప‌ట్టుకొని కాసే మాట్లాడారు. దీంతో.. ఇన్నాళ్లూ ఉప్పూ నిప్పులా ఉన్న నేత‌లు.. ఒకే వేదిక‌మీద‌కు రావ‌డంతో చ‌ర్చ మొద‌లైంది.

గత చరిత్ర ఇలా...

విశాఖ రాజకీయాల్లో గంటా శ్రీనివాస్ - అవంతి శ్రీనివాస్‌ది ప్రముఖమైన చరిత్రే. గంటా గురువుగా అవంతి శిష్యుడిగా సాగించిన రాజకీయం అందరికీ తెలిసిందే. ఇద్దరూ ఒకే పార్టీలో ఉండే ఈ నేత‌లు.. ఒకే గ్రూపులో ఉండేవారు. రాజ‌కీయంగానే కాదు.. వీరిద్ద‌రూ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా. అయితే.. 2019 ఎన్నికల స‌మ‌యంలో వీరిద్ద‌రి మ‌ధ్య విభేదాలు త‌లెత్తాయి. ఏం జ‌రిగిందో తెలియ‌దుగానీ.. అవంతి వైసీపీలోకి వెళ్లిపోయారు. ఆ విధంగా ఇద్ద‌రూ విడిపోయారు. కేవ‌లం విడిపోయి ఉండ‌డ‌మే కాకుండా.. ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌లు సంధించుకున్నారు. అది ఎంత‌లా.. అంటే భూ క‌బ్జాల వెనుకు నువ్వున్నావంటే.. నువ్వు అనుకునేంత స్థాయికి చేరింది వీరి వివాదం.

ఆయ‌న మంత్రి.. ఈయ‌న ఎమ్మెల్యే..

గ‌త ఎన్నికల్లో భీమిలి నుంచి గెలిచిన అవంతి శ్రీనివాస్‌ వైసీపీ సర్కారులో మంత్రి ప‌ద‌వి ద‌క్కించుకోగా.. గంటా విశాఖ నార్త్‌ నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచి మిన్న‌కుండిపోయారు. ఆ త‌ర్వాత కూడా వీరు మౌనంగానే ఉండి, ఎవ‌రి ప‌ని వారు చూసుకుంటున్నారు. అంతేకాదు.. గంటా వైసీపీలోకి వ‌స్తానంటే.. అవంతి అడ్డు త‌గిలార‌నే వాద‌న బ‌లంగానే ఉంది. ఇలాంటి నేత‌లు ఇప్పుడు ఉక్కు ఫ్యాక్టరీ విష‌యంలో ఒక్క‌ట‌య్యారు.

దేనికి సంకేతం..?

ఉక్కు ఫ్యాక్ట‌రీ ప్రైవేటీక‌ర‌ణ విష‌యంలో అంద‌రికంటే ముందుగా గంటా స్పందించారు. అంతేకాదు.. త‌న ప‌ద‌వికి రాజీనామా కూడా చేశారు. దీంతో.. విశాఖ‌లోని ఎమ్మెల్యేల‌పై జ‌నం దృష్టి ప‌డింది. రాజీనామా చేసిన గంటా.. ఉద్య‌మంలో పాల్గొంటున్నారు. ఈ ప‌రిణామం.. త‌న‌కు మైన‌స్ అయ్యే ఛాన్స్ ఉంద‌ని అనుకున్నారో.. లేక పార్టీ నిర్ణ‌యంలో భాగంగానే ఉద్య‌మంలో పాల్గొంటున్నారో తెలియ‌దుగానీ.. పోరాటంలో అవంతి కూడా పాల్గొంటున్నారు. ఈ క్ర‌మంలోనే ఇద్ద‌రూ ఒకే వేదిక‌పై క‌లిశారు. మ‌రి, ఇది కేవ‌లం ఉక్కు ఫ్యాక్టరీ ఆందోళ‌న‌తో ముగిసిపోయే స్నేహ‌మా..? లేదంటే.. పాత పద్ధతిలో కొనసాగే దోస్తానా? అన్న‌ది చూడాల్సి ఉంది.