Begin typing your search above and press return to search.

అధికారపార్టీ ఫెయిల్యూరేనా ?

By:  Tupaki Desk   |   2 Nov 2021 8:00 AM IST
అధికారపార్టీ ఫెయిల్యూరేనా ?
X
ఇపుడిదే అంశంపై  బద్వేలు నియోజకవర్గం వైసీపీ నేతలు ఆలోచించాలి. బద్వేలు అసెంబ్లీ ఉపఎన్నికలో పోలైన ఓట్లు 68 శాతం. 2019 ఎన్నికలతో పోలిస్తే ఇపుడు పోలైన ఓట్లు 9 శాంతం తక్కువే. ఏకపక్షంగా సాగిన ఈ ఎన్నికలో ఎందుకని ఇంత తక్కువగా ఓట్లు పోలయ్యాయి ? మిగిలిన 32 శాతం ఓటర్లు ఎందుకని పోలింగ్ లో పాల్గొనలేదు ? అనేది చాలా కీలకమైన పాయింట్. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గడచిన రెండున్నర ఏళ్ళల్లో ఎన్నో సంక్షేమ పథకాలు అమలుచేస్తోంది.

మిగిలిన రాష్ట్రంలో లాగే బద్వేలులో కూడా చాలామందికి సంక్షేమపథకాలు అందుతునే ఉండచ్చు. మరి సంక్షేమపథకాలు అందుకుంటున్న లబ్దిదారుల దామాషాతో పోలిస్తే ఓటింగ్ కు గైర్హాజరైన ఓటర్ల శాతం ఎక్కువనే చెప్పాలి.  32 శాతం ఓటర్లు పోలింగ్ కు గైర్హాజరయ్యారంటే మామూలు విషయం కాదు. మరి ఎందుకని అంతమంది పోలింగ్ లో పాల్గొనలేదు ? ఎందుకంటే అధికారపార్టీ నేతల నిర్లక్ష్యమో లేకపోతే పోల్ మేనేజ్మెంట్ లో ఫెయిలవ్వటమే కారణమని తెలుస్తోంది.

నిజానికి ఏకపక్షంగా సాగిన బద్వేలు ఎన్నికలో  పోలింగ్ 80 శాతంకు పైగా టచ్ అవుతుందని అధికార పార్టీ నేతలు అంచనాలు వేసుకున్నారు. కానీ జరిగింది 68 శాతం మాత్రమే. ఎన్నిక ఏదైనా నూరుశాతం పోలింగ్ మనదగ్గర సాధ్యంకాదు. కానీ టీడీపీ లేని ఎన్నికలో వైసీపీ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనబడుతోంది. నిజంగానే వైసీపీ నేతల పోల్ మేనేజ్మెంట్ పక్కాగా ఉండుంటే పోలింగ్ శాతం ఇంకా బాగా పెరిగేదనటంలో సందేహమేలేదు.

ఏ ఎన్నికలో అయినా ప్రచారమంతా ఒకఎత్తు పోలింగ్ రోజున పోల్ మేనేజ్మెంట్ ఒకఎత్తు. ఎంత ప్రచారం చేసుకున్నా పోలింగ్ రోజున ఫెయిలైతే చేసేదేమీ లేదు. పోలింగ్ రోజున మొత్తం నేతలు, శ్రేణులు పక్కా వ్యూహంతో పాల్గొని జనాలను పోలింగ్ కేంద్రాలకు తీసుకొచ్చి ఓటింగ్ చేయించగలిగితేనే అనుకున్న ఫలితం వస్తుంది. ఈ విషయం గతంలో చాలా ఎన్నికల్లో నిరూపితమైంది కూడా. మరి ఈ విషయం వైసీపీ నేతలకు తెలీకుండానే ఉంటుందా ?

బద్వేలు ఉపఎన్నికకు ఓవరాల్ ఇన్చార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. మంత్రి ఎన్నో ఎన్నికలను ఫేస్ చేసిన నేత. ఇక ఈయనకు సాయంగా మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంపీలు కూడా ఉన్నారు. అందరు ఎన్నికల మేనేజ్మెంట్ లో ఆరితేరిన వారే. ఇంతమంది ప్రత్యక్షంగా భాగస్వాములుగా ఉన్న ఎన్నికలో పోలింగ్ శాతం తక్కువగా ఉందంటే కచ్చితంగా వాళ్ళ ఫెయిల్యూర్ అనే చెప్పాలి. ఇదే సందర్భంలో జనాలు కూడా స్వచ్చంధంగా పోలింగ్ కు రాని విషయం గమనించాలి.

అదేమిటంటే ఉపఎన్నికలో అధికారపార్టీ డబ్బు, మద్యం జోలికి పెద్దగా వెళ్ళలేదు. ఎన్నికలంటేనే డబ్బు, మద్యం అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇవిరెండు లేని ఎన్నికలు ఎన్నికలే కావని మెజారిటి ఓటర్లు భావిస్తున్నారా ? సంక్షేమ పథకాలు ఎన్ని అమలు చేసినా, ఎంత అభివృద్ధి చేసినా డబ్బు, మద్యం పంపిణీ లేకపోతే ఓటర్లు ఓట్లు వేయరా ? అనే డౌటు కూడా పెరిగిపోతోంది.  ఈమధ్యనే జరిగిన తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో కూడా దాదాపు ఇదే జరిగింది. ఓటర్ల కోణంలో ఏమి జరిగినా అధికారపార్టీ ఫెయిల్యూర్ అయితే స్పష్టంగా కనబడుతోంది. మరి దీన్ని సవరించుకోకపోతే భవిష్యత్తులో చాలా దెబ్బ తినాల్సొస్తుంది.