Begin typing your search above and press return to search.

జనసేన తో జర్నీ ముగిసింది సరే.. బీజేపీతో షురూనా?

By:  Tupaki Desk   |   3 Feb 2020 10:17 AM IST
జనసేన తో జర్నీ ముగిసింది సరే.. బీజేపీతో షురూనా?
X
జనసేనకు గుడ్ బై చెప్పేశారు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ. సీనియర్ ఐపీఎస్ అధికారే అయినప్పటికీ.. సగటు రాజకీయ నాయకుడికి ఏ మాత్రం తీసిపోని రీతిలో జనసేనాధిపతి పై నాలుగు పంచ్ లు వేసి మరీ పార్టీ నుంచి వీడిపోయారు. నిలకడలేనితనం ముద్రను పవన్ మీద వేసిన లక్ష్మీనారాయణ.. అందుకు సినిమాల్లో నటించాలన్న నిర్ణయాన్ని ఎత్తి చూపించారు. అయితే.. ఆయన వ్యాఖ్యలు జనసేన వర్గీయులే కాదు.. పలువురు తప్పు పట్టారు. సంపాదన కోసం తనకు అలవాటైన ప్రొఫెషన్ లో పని చేయటాన్ని తప్పు పట్టటానికి వీల్లేదని జేపీ లాంటి వారు సైతం లక్ష్మీనారాయణను తప్పు పట్టారు.

ఇదిలా ఉంటే.. ఆయన తాజా ప్రయాణం ఏమిటి? అన్నది ప్రశ్నగా మారింది. జనసేన నుంచి బయటకు వచ్చిన తర్వాత తొలి సారిగా నోరు విప్పిన ఆయన.. జనసేన లో తన ప్రయాణం ముగిసిందన్న ఆయన.. నా రాజీనామా ఆమోదం పొందింది.. రాజీనామాకు కారణం లేఖలో ఇప్పటికే చెప్పేశానని చెప్పారు. రైతు సంస్థను ఏర్పాటు చేసి.. రాష్ట్రమంతా పర్యటిస్తానని చెప్పిన ఆయన.. ఆ సంస్థను ఈ రోజు (సోమవారం) నుంచి స్టార్ట్ చేయనున్నారు. ప్రజా సమస్యల్ని తెలుసుకునేందుకు తాను రాష్ట్రం మొత్తాన్ని ప్రయాణిస్తానని చెప్పిన లక్ష్మీ నారాయణ ప్రజాసేవ కు అత్యుత్తమ వేదిక రాజకీయమేనని పేర్కొనటం గమనార్హం.

ఇదిలా ఉంటే.. జనసేన నుంచి బయట కు వచ్చిన ఆయన.. బీజేపీ గురించి పొగిడేయటం విశేషం. రెండు రోజుల క్రితం ప్రవేశ పెట్టిన బడ్జెట్ మీద పలువురు పెదవి విరుస్తున్న వేళ.. అందుకు భిన్నంగా ఆ బడ్జెట్ పైన ప్రశంసల వర్షం కురిపించారు. కేంద్ర బడ్జెట్ ప్రజాహితంగా ఉందన్న ఆయన.. బడ్జెట్ లో రైతుల సంక్షేమం కోసం తీసుకున్న చర్యలు బాగున్నాయని వ్యాఖ్యానించారు. తాజా బడ్జెట్ లో ఏపీకి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదన్న విమర్శ తెలిసిందే. అయితే.. ఇదే విషయాన్ని ప్రస్తావించిన మాజీ జేడీ మాత్రం.. సప్లిమెంటరీ బడ్జెట్ లో రాష్ట్రానికి మరిన్ని నిధులు వచ్చే అవకాశం ఉందని చెప్పటం గమనార్హం. అసలు బడ్జెట్ లో కేటాయింపులు లేని వేళ.. కొసరు లో మాత్రం ఇస్తారా ఏందన్న సందేహం లక్ష్మీ నారాయణ కు రాకపోవటం ఏమిటో? నచ్చినప్పుడు ఎలా ఉన్నా నచ్చేస్తుందన్న మాటకు అర్థం ఇదేనేమో?