Begin typing your search above and press return to search.

తెలంగాణలో కరోనా అదుపుతప్పిందా? రాత్రి కర్ఫ్యూపై క్లారిటీ?

By:  Tupaki Desk   |   25 Jan 2022 1:43 PM GMT
తెలంగాణలో కరోనా అదుపుతప్పిందా? రాత్రి కర్ఫ్యూపై క్లారిటీ?
X
తెలంగాణలో కరోనా పరిస్థితులు అదుపు తప్పేలాగానే ఉన్నట్టు డీహెచ్ నివేదికను బట్టి తెలుస్తోంది. కరోనా పరిస్థితులు, ప్రభుత్వ చర్యలపై హైకోర్టులో తాజాగా విచారణ జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు రాష్ట్రంలో కరోనా తీవ్రతను బయటపెట్టారు. మూడు రోజుల్లోనే ఫీవర్ సర్వేలో ఏకంగా 1.70 లక్షల జ్వర పీడితులు బయటపడ్డారని తెలిపారు. ఇదే తెలంగాణలో కరోనా తీవ్రతకు నిదర్శనం అని వివరించారు.

ఈ క్రమంలోనే రాష్ట్రంలో మాస్కులు, భౌతిక దూరం అమలు కాకపోవడం దురదృష్టకరమని డీహెచ్ శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కోవిడ్ నిబంధనలను జీహెచ్ఎంసీ, పోలీసులు కఠినంగా అమలుచేయాలని ఆదేశించారు.

ఇక తెలంగాణలో రాత్రి కర్ఫ్యూపై ప్రభుత్వం తేల్చేసింది. రాత్రి కర్ఫ్యూ విధించేంత తీవ్రంగా కరోనా వ్యాప్తి లేదని రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు తెలిపారు. పాజిటివిటీ రేటు 10శాతం దాటితేనే కర్ఫ్యూ అవసరమని చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం పాజిటివిటీ రేటు 3.16 శాతం మాత్రమే ఉందని వివరించారు. ఒక్క జిల్లాలోనూ 10శాతం మించలేదని డీహెచ్ తెలిపారు.

అత్యధికంగా తెలంగాణలో మెదక్ జిల్లాలో 6.45శాతం పాజిటివిటీ రేటు ఉందని హైకోర్టుకు డీహెచ్ నివేదించారు. జీహెచ్ఎంసీలో 4.26 శాతం , మేడ్చల్ లో 4.22 శాతం ఉందన్నారు. ఇక అతి తక్కువగా కొత్తగూడెంలో 1.14 శాతం పాజిటివిటీ రేటు ఉంది.

ఇక తెలంగాణలో ప్రస్తుతం ఐసీయూ, ఆక్సిజన్ బెడ్ ల ఆక్యూపెన్సీ 61 శాతంగా ఉంది. ముందు జాగ్రత్త చర్యగా ఈనెల 31వరకూ ఆంక్షలు కొనసాగిస్తున్నామన్నారు. వారం రోజులుగా లక్షకు పైగా కరోనా టెస్టులు నిర్వహిస్తున్నామని.. రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటి జ్వరం సర్వే జరుగుతోందన్నారు.

అయితే ప్రభుత్వ నివేదిక ఎలా ఉన్నా క్షేత్రస్థాయిలో మాత్రం జ్వరపీడితులు, కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. చాలా మంది కరోనా లక్షణాలు ఉన్నా టెస్టులు చేయించుకోకుండా మందులు, మాకులు వేసుకొని సైలెంట్ గా ఉంటున్నారు. వారి వల్ల ఇతరులకు సోకి ఇబ్బందులు ఎదురవుతున్నాయి.