Begin typing your search above and press return to search.

బాబు కొత్త‌గా మూడు క‌ళ్ల సిద్ధాంతం...!

By:  Tupaki Desk   |   11 July 2021 1:30 PM GMT
బాబు కొత్త‌గా మూడు క‌ళ్ల సిద్ధాంతం...!
X
ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న సమయంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఏం నిర్ణయం తీసుకోవాలో ? తెలియక తిక‌మ‌క‌ పడేవారు. ప్రత్యేక తెలంగాణకు ఓకే చెప్తే ఏపీలో తెలుగుదేశం పార్టీపై ఎక్కడ వ్యతిరేక వస్తుందో ? అన్న సంకట స్థితిలో నలిగిపోయే వారు. ఒకవేళ తెలంగాణకు అనుకూలంగా లేకపోతే తెలంగాణలో పార్టీ పరిస్థితి ఏంటి అన్నదానిపై ఆయన ఎన్నో తర్జనభర్జనలు పడేవారు. ఏదేమైనా ప్రత్యేక తెలంగాణా ఉద్యమం సమయంలో చంద్రబాబు తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఎదుర్కోని సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఆ సమయంలోనే చంద్రబాబుది రెండు కళ్ల సిద్ధాంతం అంటూ ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శించాయి. ఇక ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగింది.. రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలు తీవ్రంగా నడుస్తున్నాయి. ఈ సమయంలో చంద్రబాబు స్పందించ‌డం లేదంటూ వైసీపీ నుంచి విమ‌ర్శ‌లు వస్తున్నాయి.

అయితే ఇప్పుడు రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో చంద్రబాబు మూడు కళ్ల సిద్ధాంతం అమలు చేస్తున్నారా ? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రెండు రాష్ట్రాల మధ్య నివురుగప్పిన నిప్పులా ఉన్న జ‌ల‌ వివాదంపై చంద్రబాబు తన అభిప్రాయం చెప్ప‌డం లేదు. అయితే టీడీపీ వాళ్లు మాత్రం మూడు విధాలుగా మాట్లాడుతున్నారు. సీమ ఎత్తిపోత‌ల ప‌థ‌కంపై వ్య‌తిరేకంగా మాట్లాడితే బాబు, టీడీపీపై సీమ‌లో తీవ్ర వ్య‌తిరేక‌త వ‌స్తుంది. అస‌లే సీమ‌లో పార్టీ ప‌రిస్థితి అంతంత మాత్రం. ఒక వేళ స‌మ‌ర్థిస్తే తెలంగాణ‌లో పార్టీ నేత‌ల నుంచి వ్య‌తిరేక‌త ఉంటుంది. అస‌లే తెలంగాణ‌లో పార్టీ లేదు ? అనుకుంటున్న టైంలో దీనిని స‌మ‌ర్థించి పార్టీకి ఘోరీ క‌ట్టుకోలేరు.

అందుకే చంద్రబాబు ఈ విష‌యంలో పూర్తి మౌనంగా ఉంటున్నారు. మరో వైపు ప్రకాశం జిల్లా టిడిపి నేతలు , ముగ్గురు ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవి, వీరాంజయనేయస్వామి,ఏలూరి సాంబశివరావులు సీమ ఎత్తిపోత‌ల ప‌థ‌కం వ‌ల్ల ప్ర‌కాశం జిల్లాకు తీవ్ర న‌ష్టం జ‌రుగుతుందంటూ సీఎం జ‌గ‌న్‌కు లేఖ రాశారు. జిల్లాలో నీటి వ‌న‌రులు చాలా త‌క్కువ అని... సాగ‌ర్‌కు రావాల్సిన నీటిని పైన మ‌ళ్లించేస్తే చివ‌రి ఆయుక‌ట్టులో ఉన్న ప్ర‌కాశం జిల్లాకు నీరు అంద‌ద‌ని వారు లేఖ‌లో పేర్కొన్నారు. ఈ లెక్కన టిడిపి సీమ ఎత్తిపోత‌ల ప‌థ‌కం విషయంలో కూడా ఒక వైఖరితో కాకుండా మూడు వైఖరుల‌తో ఉంద‌నే అర్థ‌మ‌వుతోంది. ఏపీలోనే రెండు స్టాండ్లు తీసుకోవ‌డం వారికే చెల్లింది..!