Begin typing your search above and press return to search.

సాహా పరుగుల సునామీ.. రైజర్స్ గ్రాండ్ విన్

By:  Tupaki Desk   |   28 Oct 2020 8:15 AM IST
సాహా పరుగుల సునామీ.. రైజర్స్ గ్రాండ్ విన్
X
సన్ రైజర్స్ హైదరాబాద్ చెలరేగిపోయింది. ఈ ఐపీఎల్ టోర్నమెంట్ లో భారీ స్కోర్లు సాధించని రైజర్స్ ఈసారి పరుగుల సునామీ సృష్టించింది. ఏకంగా బ్యాట్స్ మెన్ 219 పరుగులు చేశారు. వార్నర్ ఇన్నింగ్స్ తో మెరుపులు మెరిపించగా సాహా పరుగుల దాహం తీర్చుకున్నాడు. ఎన్నాళ్ళు రిజర్వ్ బెంచ్ కే పరిమితమైన సాహా ఆడిన తొలి మ్యాచ్ లోనే భారీ స్కోరు చేసి ఆకట్టుకున్నాడు. సిక్సులు, ఫోర్లతో స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు. వార్నర్ సాహా మెరుపులతో సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 219 పరుగులు చేసింది. ఆ తర్వాత హైదరాబాదు బౌలర్లు బౌలింగ్ లోనూ అద్భుతంగా రాణించి ఢిల్లీ క్యాపిటల్స్ వెన్ను విరిచారు. వారి ధాటికి బలమైన ఢిల్లీ కాపిటల్స్ 19 ఓవర్లలో 131 పరుగులకే ఆలౌట్ అయి 88 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ గెలుపుతో రైజర్స్ ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా నిలుపుకుంది.

ముందుగా బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్ జట్టు పరుగుల మోత మెగించింది. చాన్నాళ్ల తర్వాత పరుగుల దాహం తీర్చుకుంది. వరుస బెట్టి బౌండరీలు బాది 220 పరుగుల లక్ష్యాన్ని విధించింది. వార్నర్‌( 66; 34 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లు), వృద్ధిమాన్‌ సాహా(87; 45 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్స్‌లు), మనీష్‌ పాండే(44 నాటౌట్‌; 31 బంతుల్లో 4 ఫోర్లు, 1సిక్స్‌) విధ్వంసం సృష్టించడంతో సన్‌రైజర్స్‌ రెండు వికెట్ల కు 219 పరుగుల భారీ స్కోరు చేసింది. ఢిల్లీ బౌలర్లలో నోర్జే, అశ్విన్‌లకు చెరో వికెట్‌ లభించింది.ఐతే ఛేదనలో బలమైన ఢిల్లీ తొలిసారి తేలిపోయింది. సందీప్‌ శర్మ వేసిన తొలి ఓవర్‌ మూడో బంతికి శిఖర్‌ ధావన్ గోల్డెన్‌ డక్‌ అయ్యాడు. రెండో ఓవర్‌ చివరి బంతికి స్టోయినిస్‌(5) ఔట్ అయ్యాడు.

అనంతరం రహానే-హెట్‌మెయిర్‌ జోడి కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకుంది.ఈ జోడి 40 పరుగులు జత చేసిన తర్వాత హెట్‌మెయిర్‌(16;13 బంతుల్లో 3 ఫోర్లు) పెవిలియన్‌ చేరాడు. మరో పరుగు వ్యవధిలో రహానే(26; 19 బంతుల్లో 3 ఫోర్లు , 1 సిక్స్‌) కూడా ఔట్‌ కావడంతో ఢిల్లీ 55 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. వీరిద్దర్నీ రషీద్‌ ఖాన్‌ ఒకే ఓవర్‌లో ఔట్ చేశాడు. ఇక శ్రేయస్‌ అయ్యర్‌((7), అక్షర్‌ పటేల్‌(1) స్వల్ప స్కోరు కే పరిమితం కాగా రిషభ్‌ పంత్‌(36) ఢిల్లీ ఇన్నింగ్స్‌ లో అత్యధిక స్కోరు సాధించిన ఆటగాడు. రషీద్‌ ఖాన్‌ మూడు వికెట్లు తీయగా సందీప్‌ శర్మ, నటరాజన్‌ చెరో రెండు వికెట్లు సాధించారు.

రషీద్‌ మరోసారి అదర గొట్టాడు

ఈ మ్యాచ్‌లో రషీద్‌ ఖాన్‌ అద్భుతమైన స్పెల్‌తో అదరగొట్టాడు. కేవలం తన నాలుగు ఓవర్ల కోటాలో 7 పరుగులే ఇచ్చి మూడు వికెట్లను తీశాడు.ఈ ఐపీఎల్‌లో ఒక ఇన్నింగ్స్‌లో బెస్ట్‌ బౌలింగ్‌ గణాంకాలు నమోదు చేశాడు. అత్యుత్తమ ఎకానమీని కూడా రషీద్‌ లిఖించాడు. ఇప్పటివరకూ 12 మ్యాచ్‌లాడిన రషీద్‌ ఖాన్‌ మొత్తం 17 వికెట్లను సాధించగా ఎకానమీ 5.00గా ఉంది. అంటే 48 ఓవర్ల బౌలింగ్‌ వేసిన రషీద్‌ 240 పరుగుల్ని ఇచ్చాడు. ఓవర్‌కు ఎకానమీ 5.00గా నమోదైంది. ఇదే ఈ సీజన్‌లో ఇప్పటివరకూ అత్యుత్తమ ఎకానమీ.

సాహో రే సాహా
ఈ మ్యాచ్లో సాహా ఇన్నింగ్స్ హైలెట్ గా నిలిచింది. వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ అయిన సాహాకు ఈ సీజన్లో ఇంతవరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. వచ్చిన తొలి అవకాశం లో మాత్రం పరుగుల సునామీ సృష్టించాడు. ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికైన ఆనందంలో సాహా చెలరేగిపోయాడు ముందుగా 27 బంతుల్లో 8 ఫోర్లతో అర్థ శతకం నమోదు చేశాడు. మొత్తంగా (45 బంతుల్లో 12ఫోర్లు, 2సిక్సులతో) 87 పరుగులు సాధించాడు.