Begin typing your search above and press return to search.

ఇంటెలో అదిరే జాబ్.. రిజైన్ చేసి 20 ఆవులు కొన్నాడు.. రూ.44కోట్లు సంపాదించాడు

By:  Tupaki Desk   |   20 May 2021 3:41 AM GMT
ఇంటెలో అదిరే జాబ్.. రిజైన్ చేసి 20 ఆవులు కొన్నాడు.. రూ.44కోట్లు సంపాదించాడు
X
మీకేం రీల్ స్టోరీ చెప్పటం లేదు. రియల్ స్టోరీనే చెబుతున్నాం. నిజాయితీగా కష్టపడటం.. సవాళ్లను ఎదుర్కోవటం.. లక్ష్యం దిశగా నిర్విరామంగా పని చేస్తూ పోతే ఆశించిన విజయం సొంతం కావటం అసాధ్యమేమీ కాదు. ఇప్పుడు చెప్పే రియల్ స్టోరీని వింటే.. సినిమా కథకు సరిపోయేంత డ్రామా ఉంటుంది. తొలుతే సాధించిన విజయాన్ని చెప్పేసి.. అదెలా సాధ్యమైందో చెబితే కాస్త భిన్నంగా ఉంటుంది కదూ. ఇంకెందుకు ఆలస్యం.. రీల్ కు మించిన రియల్ స్టోరీలోకి వెళితే..

అదిరే ఉద్యోగాన్ని వదిలేసి.. 20 ఆవుల్ని కొని.. పాలు అమ్మటం ద్వారా రూ.44 కోట్లు సంపాదించటం సాధ్యమా? అంటే.. నో అనేస్తారు. రీల్లో అయితే సాధ్యమంటారు. కానీ.. ఈ రియల్ స్టోరీలో కలలాంటి విజయాన్ని సొంతం చేసుకున్నారు కర్ణాటకకుచెందిన కిషోర్ ఇందుకూరి. ఐఐటీ ఖరగ్ పూర్ లో ఐఐటీ పూర్తి చేసి.. అమెరికాలోని మాసాచుసెట్స్ లో పీహెచ్ డీ పూర్తి చేశాడు. ఇంటెల్ లో అదిరే జాబ్ లో చేరాడు. రెండు చేతులారా సంపాదిస్తున్నాడు. అలాంటి సమయంలోనూ అనుకోనిది జరిగింది. అదే.. ఇప్పుడు ఆయన గురించి అందరూ మాట్లాడుకునేలా చేసింది.

ఇంటెల్ లో జాబ్ చేస్తున్న వేళలో ఒకసారి ఇండియాకు వచ్చారు. అనుకోకుండా హైదరాబాద్ కు వచ్చిన కిశోర్.. ఒక ఖరీదైన ప్రాంతంలో టీ తాగాడు.ఏ మాత్రం రుచిగా లేదు. అన్నేసి డబ్బులు పోసిన తర్వాత కూడా టీ రుచిగా లేకపోవటానికి కారణం.. అందులోని పాలు నాణ్యమైనవి కావన్న విషయాన్ని గుర్తించాడు. ఎందుకో ఉద్యోగం చేసే కన్నా.. నాణ్యమైన పాలను ఉత్పత్తి చేయాలన్న తలంపు అతడికి వచ్చింది.

జాబ్ కు రిజైన్ చేసి.. 20 ఆవుల్ని కొనుగోలు చేసి ఒక డైయిరీ స్టార్ట్ చేశాడు. ఇంట్లో వారు తొలుత అతడి ఐడియాకు ఓకే చెప్పకున్నా.. అతడి కమిట్ మెంట్ చూసి.. తాము సైతం సాయంగా ఉంటామని అండగా నిలిచారు. డెయిరీకి టెక్నాలజీని వినియోగిస్తూ.. వినూత్న పద్దతిలో డెయిరీ నిర్వహణను షురూ చేశారు. తన కొడుకు సిద్ధార్థ పేరుతో సిద్స్ ఫామ్ పేరుతో స్టార్ట్ చేసిన డెయిరీ ఈ రోజున హైదరాబాద్ చుట్టుపక్కల ఆరు వేల మంది వినియోగదారులకు పాలను డెలివరీ చేస్తున్నారు. పాలతో పాటు ఇప్పుడు పాల ఉత్పత్తుల్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు.

నాణ్యతకు పెద్ద పీట వేయటంతో అతడి ఐడియా సక్సెస్ కావటమే కాదు..ప్రస్తుతం 120 మంది పని చేస్తున్నారు. ఏడాదికి రూ.40 కోట్ల సంపాదననను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం రోజుకు పదివేల మందికి పాలను పంపిణీ చేస్తున్నారు. పెద్ద కష్టం లేకుండానే ఇంత భారీ విజయం సొంతమైందనుకుంటే తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే.. ఎన్నో సవాళ్లు.. కష్టాల్ని ఎదుర్కోవటమే కాదు.. తాను జాబ్ చేసే సమయంలో సంపాదించిన మొత్తాన్ని డెయిరీ కోసం వెచ్చించాడు. అతడు పడిన కష్టానికి ఫలితంగా భారీ సక్సెస్ సొంతమైంది. కష్టే ఫలి అని ఊరికే అనలేదు కదా!