Begin typing your search above and press return to search.

కోనసీమలో ఇంటర్నెట్, సినిమా షోలు, మొబైల్ సర్వీసులు బంద్

By:  Tupaki Desk   |   25 May 2022 6:48 AM GMT
కోనసీమలో ఇంటర్నెట్, సినిమా షోలు, మొబైల్ సర్వీసులు బంద్
X
తీవ్ర కల్లోల పరిస్థితులు ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ లోని కోనసీమ జిల్లాలో పోలీసులు ఇంటర్నెట్ ను బంద్ చేశారు. ఇంటర్నెట్ ద్వారా సోషల్ మీడియాలో పుకార్లు వ్యాపించే అవకాశం ఉండటం, వాట్సాప్ ద్వారా సంఘ విద్రోహ శక్తులు అవాంచిత సందేశాలు పంపే ప్రమాదం ఉండటంతో ఇంటర్నెట్ ను తాత్కాలికంగా నిషేధిస్తూ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

ముఖ్యంగా కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురం పట్టణంలో ఎక్కడా ఇంటర్నెట్ రాకుండా అధికారులు చర్యలు చేపట్టారు. ఈ మేరకు అన్ని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు జాగ్రత్తలు, పలు సూచనలు జారీ చేశారు. పరిస్థితులు కుదుటపడే వరకు ఇంటర్నెట్ సర్వీసులను అమలాపురం పట్టణంలో నిలిపేయాలని కోరారు. అసలు గొడవంతా కూడా వాట్సాప్ మెసేజుల ద్వారానే వ్యాపించిందని పోలీసులు ఒక నిర్ధారణకొచ్చారు.

అలాగే పరిస్థితులన్నీ అదుపులోకి వచ్చే వరకు అమలాపురం పట్టణంలో అన్ని సినిమాల ఆటలను రద్దు చేశారు. అలాగే మొబైల్ ఫోన్ సర్వీసులను కూడా తాత్కాలికంగా నిలిపివేశారు. ఒక్క అమలాపురం పట్టణంలోనే కాకుండా కోనసీమ జిల్లావ్యాప్తంగా కర్ఫ్యూ విధిస్తూ కలెక్టర్ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు జిల్లా పేరును మార్చేది లేదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అంబేడ్కర్ కోనసీమ జిల్లాగానే ఉంటుందని వెల్లడించింది. ఈ మేరకు పలువురు మంత్రులు ప్రకటనలు జారీ చేశారు.

ఇటీవల వైఎస్ జగన్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 13 జిల్లాలను 26 జిల్లాలుగా మార్చిన సంగతి తెలిసిందే. ఇందులో పలు జిల్లాలకు ప్రముఖ వ్యక్తుల పేర్లను పెట్టింది. అల్లూరి సీతారామరాజు, సత్యసాయి పేర్లతో కూడా జిల్లాలను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా కొద్ది రోజుల కిందట కోనసీమ పేరుతో ఏర్పాటు చేసిన జిల్లాకు అంబేడ్కర్ పేరును జత చేసి అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా పేరు మార్చింది. దీన్ని నిరసిస్తూ కోనసీమ పరిరక్షణ సమితి నేతృత్వంలో మే 24న ఆందోళనకారులు చేపట్టిన చలో కలెక్టరేట్ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతలకు, విధ్వంసానికి దారితీసిన సంగతి తెలిసిందే. జిల్లా పేరు మార్పు వద్దు.. కోనసీమ జిల్లా పేరే ముద్దు అంటూ ఆందోళనకారులు నిరసనకు పిలుపునిచ్చారు.

మే 24న మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి తొమ్మిదిన్నర గంటల వరకు అంటే దాదాపు ఐదున్నర గంటలపాటు ఆందోళనకారులు అమలాపురం పట్టణంలో రెచ్చిపోయారు. రవాణా శాఖ మంత్రి విశ్వరూప్, ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ ఇళ్లకు నిప్పు పెట్టారు. పలు ప్రైవేటు, ఆర్టీసీ బస్సులను ధ్వంసం చేసి దహనం చేశారు. ఆందోళనకారుల రాళ్లదాడిలో ఎస్సీ సుబ్బారెడ్డి సహా 30 మంది పోలీసులకు గాయాలయ్యాయి. దీంతో పోలీసులు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కాకినాడ జిల్లాల నుంచి అదనపు బలగాలను రప్పించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఓ దశలో ఆందోళనకారులను అదుపు చేయడానికి లాఠీచార్జీ చేయడంతోపాటు గాలిలోకి కాల్పులు కూడా జరపాల్సి వచ్చింది.

కాగా ఈ ఘటనకు టీడీపీ, జనసేన పార్టీలే కారణమని అధికార వైఎస్సార్సీపీ నేతలు చేసిన విమర్శలపై ఆ రెండు పార్టీలు తీవ్రంగా మండిపడ్డాయి. పాలన చేతకాక, శాంతిభద్రతలను రక్షించలేక జగన్ ప్రభుత్వం తమపై ఆరోపణలు చేస్తోందని దుయ్యబట్టాయి. అమలాపురంలో అందరూ శాంతియుతంగా ఉండి శాంతిభద్రతలను కాపాడాలని టీడీపీ, జనసేన పార్టీలు కోరాయి. మరోవైపు పోలీసులు ఆందోళనకారులను గుర్తించే పనిలో పడ్డారు. సీసీ టీవీ పుటేజ్ లు, సోషల్ మీడియా మెసేజ్ ల ఆధారంగా చర్యలు చేపడుతున్నారు. అల్లర్లకు పాల్పడ్డ ఏ వ్యక్తిని వదలబోమని హెచ్చరించారు.