Begin typing your search above and press return to search.

ఇంగ్లండ్ కేబినెట్లో ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అల్లుడు

By:  Tupaki Desk   |   26 July 2019 4:41 PM IST
ఇంగ్లండ్ కేబినెట్లో ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అల్లుడు
X
ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా ముగ్గురు.. మూడు కీలక పదవుల్లో భారతీయులు నియామకమయ్యారు. బ్రిటీష్ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. బ్రిటన్ నూతన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన కన్జర్వేటివ్ పార్టీ సీనియర్ నేత బోరిస్ జాన్సన్ తన మంత్రివర్గంలో అనూహ్యంగా ముగ్గురు భారత సంతతి ఎంపీలకు కీలక పదవులు ఇవ్వడం గమనార్హం.

జాన్సన్ ఎంచుకున్న కొత్త మంత్రివర్గంలో ఆయన తర్వాత కీలకమైన హోంమంత్రి పదవిని భారత సంతతి ప్రతీ పటేల్ కు ఇచ్చారు. ఈ పదవి చేపట్టిన తొలి భారతీయ సంతతి మహిళ కావడం విశేషం. గుజరాత్ రాష్ట్రానికి చెందిన ప్రతీ పటేల్ కుటుంబం ఏనాడో ఇంగ్లండ్ వెళ్లి స్థిరపడింది. మోడీకి ప్రధాన మద్దతుదారు ఈమె. బ్రిటన్ ప్రధాని జాన్సన్ తో కలిసి ఎన్నికల ప్రచారంలో కీలకంగా వ్యవహరించడంతో ఈమెకు ఈ అత్యున్నత పదవిని కేటాయించారు.

ఇక మరో భారతీయ సంతతి వ్యక్తి అలోక్ శర్మను బ్రిటన్ ప్రధాని జాన్సనర్ ఇంటర్నేషనల్ డెవలప్ మెంట్ సెక్రెటరీగా నియమించారు. ఈయన గత థెరెసా మే ప్రభుత్వం జూనియర్ మంత్రిగా ఉండగా.. ఇప్పుడు కీలక ప్రమోషన్ దక్కింది.

ఇక మరో భారతీయ సంతతి వ్యక్తి రిషి సునక్ ను కీలకమైన ట్రెజరీ విభాగం చీఫ్ సెక్రెటరీగా బ్రిటన్ ప్రధాని నియమించారు. రిషి ఇంగ్లండ్ లోని హాంప్ షైర్ లో జన్మించాడు.ఈయన స్టాన్ ఫోర్డ్ వర్సిటీలో చదివేటప్పుడు ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి కుమార్తె అక్షతా మూర్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి అల్లుడికి కీలక పదవి దక్కడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇలా ముగ్గురు భారతీయ సంతతి వ్యక్తులకు బ్రిటన్ ప్రధాని తన కేబినెట్ లో కీలక స్థానాలు కేటాయించడం విశేషం. ఇక బ్రిటన్ ప్రధాని జాన్సన్ రెండో భార్య తల్లి కూడా భారతీయురాలే కావడం విశేషం.