Begin typing your search above and press return to search.

అమెరికా క‌ష్టాలు కొనసాగుతున్నాయి!!

By:  Tupaki Desk   |   11 Jan 2016 3:57 AM GMT
అమెరికా క‌ష్టాలు కొనసాగుతున్నాయి!!
X
అమెరికా క‌ష్టాలు కొనసాగుతున్నాయి. విద్యాభ్యాసం కోసం అవ‌కాశాల గ‌డ్డ‌కు ఎగిరి వెళుతున్న భార‌తీయ విద్యార్థుల‌కు ప్ర‌పంచ పెద్ద‌న్న చుక్కలు చూపిస్తోంది, ఇండియా కుక్క‌లు అంటూ కామెంట్లు చేస్తోంది. అమెరికాలో చ‌దువుకునేందుకు వెళ్లిన విద్యార్థుల‌ను తిప్పిపంపుతున్న వారిలో తెలుగువారు మెజార్టీ శాతం ఉన్న సంగ‌తి తెలిసిందే. తాజాగా అమెరికా అధికారుల నిర్వాకం వ‌ల్ల ఇలా చేతుల‌కు బేడీల‌తో తీవ్ర‌ ఇబ్బందులు ప‌డ్డ ఓ విద్యార్థి ప‌రిస్థితి ఇది.

కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి గ్రామానికి చెందిన దేవినేని సూర్యతేజ అమెరికాలోని న్యూహెవెన్ యూనివర్సిటీలో ఎమ్మెస్ చదివేందుకు సీటు సంపాదించాడు. అన్ని ప‌త్రాల‌తో పాటు చెల్లించాల్సిన ఫీజుతో ఢిల్లీ నుంచి అమెరికాకు ప‌లువురు విద్యార్థులతో పాటు సూర్య‌తేజ కూడా బ‌య‌ల్దేరారు. న్యూయార్క్‌ లోని జాన్ ఎఫ్ కెన్న‌డీ ఎయిర్‌ పోర్టులో దిగిన ఈ విద్యార్థుల‌ను ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. క‌నీసం ప‌త్రాలు కూడా చూడ‌కుండానే సూర్యతేజతో పాటు అందర్నీ అదుపులోకి తీసుకుని బేడీలేశారు. ‘ఇండియా కుక్కలు’ అంటూ కామెంట్లు చేస్తూనే మీ దేశానికి వెళ్లిపోతారా? లేదా అంటూ దుర్భాష‌లాడారు. అనంత‌రం ఓ విమానం ఎక్కించి తిరిగి ఇండియాకు పంపించారు.

ఈ క్ర‌మంలో విద్యార్థుల పాస్‌ పోర్టులు వారి చేతికి ఇవ్వ‌కుండా మ‌రో అధికారితో పంపించారు. వాటిని ఢిల్లీ ఎయిర్‌ పోర్ట్‌ లో స్వీక‌రించే స‌మ‌యంలో విద్యార్థుల‌కు చుక్కలు క‌నిపించాయి. పాస్‌ పోర్ట్ కావాలంటే రూ.ల‌క్ష ఇవ్వాలంటూ అధికారులు డిమాండ్ చేయ‌డం గ‌మ‌నార్హం. త‌మ వ‌ద్ద సొమ్ము లేద‌ని పేర్కొని సూర్య‌తేజ‌తో పాటు ప‌లువురు విద్యార్థులు విమానంలో హైద‌రాబాద్‌ కు చేరుకున్నారు. అయితే పాస్‌ పోర్ట్ లేక‌పోవ‌డంతో...ఇక్క‌డి అధికారులు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంలోనే అనుకోకుండా ఎయిర్‌ పోర్ట్‌ లో ఉన్న తెలంగాణ ఉప‌ముఖ్య‌మంత్రి మ‌హ‌మూద్ అలీ వీరి ప‌రిస్థితిని చూసి అధికారుల‌తో మాట్లాడి విద్యార్థుల‌కు విముక్తి కలిగించారు.

అమెరికాలో సూర్య‌తేజ‌కు ఎదురైన దుర్ఘ‌తిపై ఆయ‌న త‌ల్లిదండ్రులు మండిప‌డుతున్నారు. ప‌త్రాలు - ఫీజులు అన్నీ స‌రిగ్గా ఉన్న‌ప్ప‌టికీ...చ‌దువుకునేందుకు వెళ్లిన విద్యార్థుల చేతుల‌కు బేడీలు వేయ‌డం స‌రికాద‌ని వాపోతున్నారు. ఈ విష‌యంలో కేంద్ర‌-రాష్ర్ట ప్ర‌భుత్వాలు త‌గిన జోక్యం చేసుకోవాల‌ని కోరారు.