Begin typing your search above and press return to search.

రైలు ఛార్జీలు పెరగ బోతున్నాయ్..

By:  Tupaki Desk   |   4 Dec 2019 9:11 AM GMT
రైలు ఛార్జీలు పెరగ బోతున్నాయ్..
X
ఈ మధ్యే తెలంగాణ ఆర్టీసీ లో ఛార్జీలు పెంచబోతున్నట్లు ప్రకటించారు ముఖ్యమంత్రి కేసీఆర్. అసలే నష్టాల్లో ఉన్న టీఎస్ ఆర్టీసీ.. సమ్మె కారణంగా మరింతగా నష్టాల్లో కూరుకు పోయింది. దీన్నుంచి బయట పడటానికి ఛార్జీల పెంపే మార్గమని కేసీఆర్ స్పష్టం చేశారు. పెంపు లాంఛనమే అనుకోవాల్సిందే. తెలంగాణ ఆర్టీసీ లో ఛార్జీలు పెంచితే.. ఏపీఎస్ ఆర్టీసీ వాళ్లు ఊరికే ఉండే అవకాశం లేదు. కాస్త ముందో వెనుకో అక్కడా ఛార్జీలు పెరగడం ఖాయం. జనాాలు ఈ భారం గురించి ఆలోచిస్తుంటే.. కేంద్ర ప్రభుత్వ రైలు ఛార్జీలు పెంచడానికి రెడీ అవుతోందన్న వార్త మరింత ఆందోళన పెంచుతోంది. త్వరలోనే 5 నుంచి 10 శాతం దాకా రైలు ఛార్జీలు పెరగబోతున్నట్లు సమాచారం.


ఈ మేరకు ప్రభుత్వానికి రైల్వే నుంచి నివేదిక అందిందట. ప్రధాని మోడీ అందుకు ఆమోద ముద్ర కూడా వేసినట్లు తెలుస్తోంది. కాక పోతే ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు నడుస్తుండటంతో.. ఇప్పటికిప్పుడు ఛార్జీల పెంపు నిర్ణయాన్ని ప్రకటిస్తే ప్రతిపక్షాలు గగ్గోలు పెడతాయని.. తమకు ఇబ్బంది గా మారుతుందని ప్రభుత్వం ఆగుతోందట. ఈ సమావేశాలు ముగిసిన కొన్ని రోజుల్లోనే ఛార్జీల పెంపు పై ప్రకటన రావచ్చు. మోడీ ప్రధాని అయ్యాక రైల్వే ఛార్జీల పెంపు ఇది రెండో సారి అవుతుంది. ఇంతకుముందు 2014లో 14 శాతం మేర ఛార్జీలు పెంచారు. అన్ని రకాల ధరలూ పెరిగి రైల్వే నిర్వహణ కష్టంగా మారుతుండటం.. అంతకంతకూ నష్టాలు పెరుగుతుండటంతో ఛార్జీల పెంపు అనివార్యం అని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. కాక పోతే ఛార్జీల పెంపు మరీ ఎక్కువ లేక పోవడం కాస్త ఊరటే.