Begin typing your search above and press return to search.

ప్ర‌పంచంలోనే ముఖ్య‌మైన ప్ర‌ధాని మోడీః ఇజ్రాయిల్

By:  Tupaki Desk   |   28 Jun 2017 4:12 PM GMT
ప్ర‌పంచంలోనే ముఖ్య‌మైన ప్ర‌ధాని మోడీః ఇజ్రాయిల్
X
ప్ర‌పంచ‌ వ్యాప్తంగా మోడీ మేనియా న‌డుస్తోంది. భార‌త ప్ర‌ధాని పర్యటనలకు విశేష‌ ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. తాజాగా మోడీ మూడు దేశాల ప‌ర్య‌ట‌న విజ‌య‌వంత‌మైంది. ప్రపంచ దేశాలకు పెద్దన్న వంటి అమెరికాలో మోడీకి ఘన స్వాగతం లభించింది. మోడీ నాకు నిజమైన మిత్రుడని సాక్ష్యాత్తు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొనడం గ‌మ‌నార్హం.

జులై 4 నుంచి ప్ర‌ధాని మోడీ మూడు రోజుల పాటు ఇజ్రాయిల్ లో ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా ప్రముఖ ఇజ్రాయిల్ పత్రిక మోడీకి ప్రత్యేక ఆహ్వానం పలికింది. 'మేల్కొండి! ప్రపంచంలోనే అతి ముఖ్యమైన ప్రధానమంత్రి వస్తున్నారు' అంటూ ఆ దేశానికి చెందిన ప్రముఖ బిజినెస్ డైలీ 'ది మర్కార్' వ్యాఖ్యానించింది. ఒక భారత ప్రధాని ఇజ్రాయిల్లో పర్యటించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో ప్రత్యేక కథనం ప్రచురించిన ది మార్కర్ తన హిబ్రూ ఎడిష‌న్లో మోడీపై ప్రశంసలు కురిపించింది. మోడీ-డొనాల్డ్ ట్రంప్ ను పోలుస్తూ పలు వ్యాఖ్యలు చేసింది.

ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్యటన సందర్భంగా ఇజ్రాయిల్ చాలా ఆశించిందని, ఆయన ఎక్కువగా స్పందించలేదని ఆ ప‌త్రిక పేర్కొంది. 125కోట్ల మంది ప్రజల ఆదరణను పొందిన మోడీ చాలా ఆసక్తిని రేకెత్తిస్తున్నారని పేర్కొంది. స్థానిక పత్రికలు న్యూస్ పోర్టల్స్ కూడా మూడు రోజుల మోడీ పర్యటనకు చాలా ప్రాధాన్యత ఇవ్వడం గమనార్హం.

భారత్-ఇజ్రాయిల్ మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 25ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా జులై 4 నుంచి ప్రారంభం కానున్న మోడీ 3రోజుల పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. జులై 5న టెల్ అవివ్లో భారత సంతతి ప్రజలు పాల్గొనే కార్యక్రమంలో మోడీ పాల్గొంటారు. ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు కూడా మోడీ పర్యటన పట్ల ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. వచ్చే వారం భారత ప్రధాని - తన స్నేహితుడు నరేంద్ర మోడీ ఇజ్రాయిల్ కు వస్తున్నారని పేర్కొన్నారు. మోడీ పర్యటన ఇరు దేశాల మధ్య దౌత్య - ఆర్థిక సంబంధాలను బలోపేతం చేస్తాయని ఆయన తెలిపారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/