Begin typing your search above and press return to search.

చైనా ఆర్మీతో లింక్స్ - 7 దిగ్గజ కంపెనీలపై భారత్ తీవ్రచర్యలు?

By:  Tupaki Desk   |   19 July 2020 3:50 AM GMT
చైనా ఆర్మీతో లింక్స్ - 7 దిగ్గజ కంపెనీలపై భారత్ తీవ్రచర్యలు?
X
సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో భద్రతా కారణాలతో గత నెలలో 59 చైనీస్ యాప్స్‌ ను నిషేధించిన భారత ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. చైనా సైన్యంతో లింక్ ఉన్న ఏడు ప్రముఖ కంపెనీలు ఇండియాలో తీవ్ర చర్యను ఎదుర్కోవాల్సి రావొచ్చును. హువావే - అలీబాబా - జిండియా స్టీల్స్ - జిన్ జింగ్ కేఫీ ఇంటర్నేషనల్ - చైనా ఎలక్ట్రానిక్ టెక్నాలజీ గ్రూప్ - టెన్సెంట్ - సైక్ మోటార్ కార్పోరేషన్ సంస్థలకు చైనా సైన్యంతో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంబంధాలు ఉన్నట్లు భావిస్తున్నారు.

ఈ కంపెనీలపై భారత నిఘా వర్గాలు దృష్టి పెట్టాయి. 2018-19 ఆర్థిక సంవత్సరంలో భారత్‌ లోని తన ఆపరేటర్ల ద్వారా హువావే కంపెనీకి రూ.12,800 కోట్ల రెవెన్యూ వచ్చినట్లుగా తెలుస్తోంది. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (PLA) ఇంజినీరింగ్ కార్ప్స్ మాజీ డిప్యూటీ డైరెక్టర్ రెన్ జెంగ్ ఫీ 5Gకి సంబంధించి పలు దేశాల నుండి సమస్యలు ఎదుర్కొంటున్నాడు. అలీబాబా - బైదు - టెన్సెంట్ చైనా మిలిటరీ సివిలి ఫ్యూజన్ అండ్ ఆర్టిఫిషియల్ ప్రాజెక్టుల్లో భాగంగా ఉన్నాయి.

యూఎస్ -చైనా ఎకనమిక్ అండ్ సెక్యూరిటీ రివ్యూ కమిషన్ 2019 రిపోర్ట్ ప్రకారం వీటి పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. చైనాకు చెందిన దిగ్గజం అలీబాబా మన దేశంలో పేటీఎం - జొమాటో - బిగ్ బాస్కెట్ - స్నాప్ డీల్ వంటి సంస్థల్లో పెట్టుబడులు పెట్టింది. టెన్సెంట్ క్యాబ్ రైడర్ ఓలాలో 400 మిలియన్ డాలర్లను - ఫ్లిప్‌ కార్ట్‌ లో 700 మిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేసింది. ఇతర సంస్థలు పలు ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టాయి.

చైనా సైన్యంతో టెక్ లేదా మొబైల్ సంస్థలకు మాత్రమేకాదు - చైనా ప్రభుత్వానికి చెందిన ఆటోమొబైల్ సైక్ మోటార్ కార్పోరేషన్ ఇండియాలో స్పోర్ట్ యుటిలిటీ వెహికిల్ ఎంజీ హెక్టార్‌ ను విక్రయిస్తోంది. దీని హెడ్ క్వార్టర్ షాంఘైలో ఉంది. ఈ కంపెనీ అనుబంధ సంస్థ నాంజింగ్ ఆటోమొబైల్స్ గతంలో PLA వెహికిల్ సర్వీసింగ్ యూనిట్. ఇలా ఒక్కో సంస్థకు ఒక్కో విధంగా చైనా ఆర్మీతో లింక్స్ ఉన్నాయి. ఈ ఏడు కంపెనీలపై భారత్ చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.