Begin typing your search above and press return to search.

పెళ్లి బ‌హుమ‌తిగా బిట్‌ కాయిన్‌..జీఎస్టీలో చాన్స్‌

By:  Tupaki Desk   |   22 Dec 2017 8:25 AM GMT
పెళ్లి బ‌హుమ‌తిగా బిట్‌ కాయిన్‌..జీఎస్టీలో చాన్స్‌
X
అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తున్న డిజిటల్‌ కరెన్సీ బిట్‌ కాయిన్ ఖాతాలో మ‌రో ప్ర‌త్యేక‌త చేరింది. ఇప్ప‌టికే బాలీవుడ్ మెగాస్టార్ బిగ్‌ బీకి అనూహ్య రీతిలో సంప‌ద‌న సృష్టించి పెట్టిన బిట్ కాయిన్స్ తాజాగా మ‌రో రెండు వార్త‌ల‌తో తెర‌మీద‌కు వ‌చ్చింది. అందులో ప్ర‌ధాన‌మైన‌ది ఓ జంట‌కు వివాహ గిఫ్ట్‌ గా బిట్ కాయిన్లు స‌మ‌ర్పించ‌డం. బెంగుళూరులో ఓ జంట ఇటీవలే పెళ్లి చేసుకుంది. వారి పేర్లు ప్రశాంత్ శర్మ - నితి శ్రీ. వీరు బెంగుళూర్‌లో ఓ డిజిటల్ స్టార్టప్ నడిపిస్తున్నారు. అయితే పెళ్లికి ముందే వీళ్లు ఓ వెరైటీ ఆలోచన చేశారు. వెడ్డింగ్ గిఫ్ట్‌ ను బిట్‌ కాయిన్ల రూపంలో పొందాలనుకున్నారు. మ్యారేజ్‌ కు హాజరయ్యే అతిథులకు ఈ విషయాన్ని ముందే చెప్పారు. గిఫ్ట్‌ లు ఇవ్వాలనుకున్నవారు.. బిట్‌ కాయిన్ల రూపంలో ఇవ్వాలని సూచించారు. అయితే మిత్రులందరూ టెక్నాలజీ రంగంలోనే ఉద్యోగం చేస్తున్న వారు కావడంతో వీళ్ల సూచన ఫలించింది.

డిసెంబర్ 9న ప్రశాంత్ - నితిల పెళ్లి జరిగింది. అంతకు రెండు రోజుల ముందే బిట్‌ కాయిన్ల అంశంలో ఆర్బీఐ ఓ వార్నింగ్ కూడా ఇచ్చింది. అయినా ఈ కొత్త జంట మాత్రం బిట్‌ కాయిన్‌ ను గిఫ్ట్‌గా స్వీకరించేందుకు వెనుకాడలేదు. పెళ్లి కట్నాలు చదివించేవారు కూడా బిట్‌ కాయిన్‌ నే ప్రిఫర్ చేశారు. దాదాపు 200 మంది అతిథులకు పెళ్లికి వస్తే - అందులో కేవలం 15 మంది మాత్రమే మరో గిఫ్ట్‌ ను అందించారు. పెళ్లి కట్నాలుగా సుమారు లక్ష రూపాయలు విలువైన బిట్‌ కాయిన్లు వచ్చాయని ప్రశాంత్ శర్మ తెలిపాడు. ప్రభుత్వాలు ప్రస్తుతం బిట్‌ కాయిన్‌ ను వ్యతిరేకించినా.. మునుముందు అంగీకరించే అవకాశాలు ఉన్నాయని ప్రశాంత్ అభిప్రాయపడ్డాడు. బిట్‌ కాయిన్ టెక్నాలజీ ఎలా మునుముందుకు వెళ్తుందన్న అంశాన్ని పరిశీలించేందుకు కూడా తాము గిఫ్ట్‌గా బిట్‌ కాయిన్లను స్వీకరించినట్లు పెళ్లి కుమారుడు చెప్పాడు. బ్లాక్‌ చెయిన్ టెక్నాలజీ చాలా నమ్మకమైదని - బిట్‌ కాయిన్‌ కు ఆ సామర్థ్యం ఉందన్నాడు. అయితే తమ పెళ్లికి గిఫ్ట్‌ గా వచ్చిన బిట్‌ కాయిన్లను అమ్మితే వచ్చే డబ్బును పేద పిల్లల విద్యకు ఖర్చు చేయనున్నట్లు ప్రశాంత్ తెలిపాడు.

ఇదిలాఉండ‌గా...బిట్‌ కాయిన్‌ ను వస్తుసేవల పన్ను (జీఎస్‌ టీ) పరిధిలోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇప్పటికే దేశంలోని ప్రధాన బిట్‌ కాయిన్‌ ఎక్స్ఛేంజీలపై పరోక్ష పన్నుల శాఖ అధికారులు సర్వే చేపట్టారు. కాగా జీఎస్‌ టీలో ఏ పన్నురేటు కింద దీనిని చేరిస్తే బాగుంటుందని ఆయా సంస్థల నిర్వాహకుల అభిప్రాయాన్ని అధికారులు అడిగి తెలుసుకున్నట్లు సమాచారం అందుతుంది. ఆదాయ పన్ను శాఖ అధికారులు గ‌త‌ బుధవారం బిట్‌కాయిన్‌ ఎక్స్ఛేంజీలైన జెబ్‌ పే - యునోకాయిన్‌ - కాయిన్‌ సెక్యూర్‌ సంస్థల్లో ఆదాయ పన్ను చట్టం 133ఏ ప్రకారం సర్వే నిర్వహించారు. బిట్‌ కాయిన్‌ లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి భారీ లాభాలు పొందిన వారు పన్నులు ఎగవేస్తున్నారో ఏమోనన్న అనుమానం వస్తుండ‌టంతో ఈ చ‌ర్య‌కు దిగారు.

‘మదుపర్లు - ట్రేడర్లు.. వారు జరిపిన లావాదేవీలు - అవతలి పక్షం వాళ్ల గుర్తింపు - సంబంధిత బ్యాంకు ఖాతాలను తెలుసుకుని సాక్ష్యాలను సేకరించడం’ ఈ సర్వే ముఖ్య ఉద్దేశం అని ఐటీ శాఖ తెలిపింది. అయితే అధికారులు రెండు నెలల క్రితమే బిట్‌ కాయిన్‌ ఎక్స్ఛేంజీల వ్యాపార నిర్వహణ నమూనా - గతేడాది వచ్చిన ఆదాయంపై ఎంత పరోక్ష పన్ను లేదా సేవల పన్ను - విలువ ఆధారిత పన్ను (వ్యాట్‌) విధించవచ్చని ప్రశ్నించినట్టు తెలిసింది. బిట్‌ కాయిన్‌ పై సరైన చట్టాలు లేకపోవడంతో ఏ పన్ను విధించాలన్న అంశంపై ప్రభుత్వం సమాలోచనలు చేస్తుందట. పరోక్ష పన్నుల కిందకు రాదు కాబట్టి జీఎస్‌ టీ కిందకు తీసుకురావాలని చూస్తున్నట్లు తెలుస్తుంది.