Begin typing your search above and press return to search.

నిను వీడని ''క్రీడ''ను నేను

By:  Tupaki Desk   |   10 March 2016 7:43 AM GMT
నిను వీడని క్రీడను నేను
X
ఐపీఎల్.... మైదానంలో సిక్సుల వర్షం - జేబులో కరెన్సీ వర్షం అన్నట్లుగానే ఇంతకాలం అనిపించింది. అయితే... నిజంగా ఇది కనక వర్షం కురిపిస్తున్న క్రీడలానే కనిపిస్తున్నా అందరి విషయంలోనూ ఇది నిజం కావడం లేదు. కొందరిని కుబేరులను చేస్తుంటే ఇంకొందరిని కుచేలుడిలా మార్చేస్తోంది. ఐపీఎల్ లో అడుగుపెట్టిన ప్రాంచైజీల యజమానులు - ఆటగాళ్లలో కొందరు కోట్లకు పడగలెత్తుతుంటే ఇంకొందరు మాత్రం కుదేలైపోతున్నారు. కొందరు వివాదాలతో, ఇంకొందరు విభేదాలతో... మరికొందరు నష్టాలతో ఓడిపోతున్నారు. కొందరికి బాగా కలిసి వస్తుంటే.. ఇంకొందరిని మాత్రం దారుణంగా ముంచేస్తోంది.

ఐపీఎల్ బారినపడి వ్యాపారాలు - జీవితాలు నాశనం చేసుకున్నవారి జాబితా చిన్నదేమీ కాదు.. వారు చిన్నవారూ కాదు. సునందా పుష్కర్ - విజయ్ మాల్యా - శ్రీనివాసన్ - ప్రీతి జింతా - రాజ్ కుంద్రా - వెంకటరామిరెడ్డి - సుబ్రతో రాయ్ - లలిత్ మోదీ.. వీరంతా ఐపీఎల్ బాధితులే. తమతమ రంగాల్లో ఉద్ధండులైన వీరంతా ఐపీఎల్ రాకతో క్రికెట్ వ్యాపారంలోకి అడుగుపెట్టారు. అప్పటి వరకు ఎదురులేకుండా ఉంటూ పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా వ్యవహరించిన వీరంతా ఐపీఎల్ లో అడుగుపెట్టిన తరువాత పతనం అంచుల వరకు వెళ్లిపోయారు. తాజాగా ఒకప్పటి బెంగళూరు రాయల్ ఛాలంజర్స్ ఫ్రాంచైజీ ఓనర్ విజయ్ మాల్యా పూర్తిగా దివాలా తీసి విదేశాలకు పారిపోయాడు. కొందరు ఇప్పటికే జైలు పాలయ్యారు.

నిజానికి ఐపీఎల్ ద్వారా ఎంతోమంది క్రీడాకారులు వెలుగులోకి వచ్చారు. అయితే ఆటకంటే ఎక్కువ అవినీతి - అక్రమాలు - బెట్టింగులు - తెరచాటు వ్యవహారాలు ఎక్కువన్న విమర్శలున్నాయి. జట్లను కొనుగోలుచేసేందుకు సినీ - వ్యాపార - రాజకీయ రంగాల ప్రముఖులు విపరీతమైన ఆసక్తికనబర్చారు. సాధారణ ప్రేక్షకులు ఇప్పటికీ ఈ ఆటను ఆటలాగానే చూస్తూ ఆదరిస్తున్నా జట్ల యజమానులు మాత్రం ఈ జూదక్రీడలో ఆస్తులు పోగొట్టుకుంటున్నారు.

ఇక ఐపీఎల్ జట్లకు యజమానులైన తర్వాత పలువురు ప్రముఖ బిజినెస్ దిగ్గజాలు దారుణ పతనాన్ని చవిచూశారు. బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు యజమాని విజయ్ మాల్యా వివిధ బ్యాంకుల్లో రూ. 9000 కోట్ల రుణం తీసుకుని ఎగవేసే ప్రయత్నం చేశారు. ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు బ్యాంకులపై ఒత్తిడి పెంచడంతో ఆయన దేశం విడిచి వెళ్లారనే వార్తలు వినవస్తున్నాయి. మాల్యా బ్యాంకులను బురిడీ కొట్టిస్తే.. పూణె వారియర్స్ జట్టు యజమాని - సహారా గ్రూప్ అధినేత సుబ్రతోరాయ్.. తన సంస్థలో చేరిన ముదుపుదారుల్ని దారుణంగా మోసంచేసి, మూడేళ్లుగా జైలులోనే ఉన్నారు. ఇక డెక్కన్ క్రానికల్ జట్టు యజమాని, దక్కన్ క్రానికల్ ఆంగ్ల దినపత్రిక చైర్మన్ టి.వెంకట్రామిరెడ్డి తప్పుడు పత్రాలతో బ్యాంకుకు వందల కోట్ల రూపాయల కుచ్చు టోపీ పెట్టారనే ఆరోపణలపై అరెస్టయ్యారు. ఫిక్సింగ్ ఆరోపణల నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ - రాజస్థాన్ రాయల్స్ జట్లపై నిషేధం విధించడంతో వాటి యజమానులైన శ్రీనివాసన్ - మయప్పన్ - రాజ్ కుంద్రాలపై కేసులు నమోదయ్యాయి. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ సతీమణి - దివంగత సునందా పుష్కర్.. కొచ్చి టస్కర్స్ జట్టును కొనుగోలుచేసినప్పుడు భారీ ఎత్తున నల్లధనం వినియోగంలోకి తెచ్చారనే విమర్శలున్నాయి.

క్రికెట్ సంబంధిత ఆర్థిక వ్యవహారాలే ఆమె చావుకు కారణమన్న వాదన ఉంది. కింగ్స్ లెవెన్ పంజాబ్ జట్టు సహ యజమాని ప్రీతి జింతాది మరో కథ.... ఎన్నో ఏళ్లుగా డేటింగ్ చేసి ఇంకొద్ది రోజుల్లో పెళ్లి చేసుకోబోతారనగా, అదే జట్టుకు మరో సహయజమాని నెస్ వాడియాతో ఆమె గొడవపడి విడిపోయారు. ఈ మధ్యే మరొక వ్యక్తిని పెళ్లిచేసుకున్నారు. వారు విడిపోవడానికి కారణం కూడా ఐపీఎల్ సందర్భంగా చోటుచేసుకున్న వ్యవహారాలే. ఐపీఎల్ కు కర్త - క్రియల్లో ఒకరై లలిత్ మోడీ కూడా అనేక వివాదాల్లో చిక్కుకున్నారు. అయితే... తెలివిగా ఆయన ఐపీఎల్ రచ్చరచ్చ కాకముందే ''జంపక్ జపాంగ్ జంపక్ జపాంగ్.. గిలిగిలిచా'' అంటూ విదేశాలకు జంప్ చేసేశారు. మొత్తానికి మైదానంలో మ్యాచ్ విన్నర్స్ ఎవరైనా ఐపీఎల్ లో మాత్రం గెలుపా ఓటమా అన్నది సుడిగాలిలో దీపమే? ఓడలను బళ్లు చేస్తున్న ఈ క్రీడకు ఇంకెంతమంది బలవుతారో చూడాలి. నిను వీడని 'క్రీడ'ను నేను అంటూ వెంటాడుతున్న ఐపీఎల్ నుంచి తప్పించుకుంటారో లేదంటే తన్నులు తింటారో చూడాలి.