Begin typing your search above and press return to search.

సీఎం సీటు కేసీఆర్‌దే...ఇండియా టుడే స‌ర్వే

By:  Tupaki Desk   |   5 Dec 2018 4:39 AM GMT
సీఎం సీటు కేసీఆర్‌దే...ఇండియా టుడే స‌ర్వే
X
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అధినేత‌ - అప‌ద్ధ‌ర్మ‌ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావుకు జాతీయ మీడియా నుంచి అనూహ్య సానుకూల క‌బుర్లు వ‌స్తున్నాయి. టీఆర్ఎస్ మరోసారి విజయం దిశగా అడుగులు వేస్తున్నదని ప్రముఖ ఆంగ్ల టీవీ చానల్ ఎన్డీటీవీ సోమవారం పేర్కొనగా, అదే విషయాన్ని మరో ఆంగ్ల చానల్ ఇండియా టుడే చాటిచెప్పింది. ఈ ఎన్నికల్లో మహాకూటమి ప్రభావం ఏమాత్రం ఉండబోదని సాయంత్రం విడుదలైన పొలిటికల్ స్టాక్ ఎక్సేంజ్ (పీఎస్ఈ) సర్వే పేర్కొంది. రాష్ట్రంలోని సగం మందికి పైగా ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్ పట్ల ఆదరణ చూపుతున్నారని వెల్లడించింది. గత నెల రోజుల వ్యవధిలో టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలలో మరో నాలుగు శాతం మద్దతు పెరిగిందని తెలిపింది. నెలరోజుల క్రితం తాము సర్వే జరిపినప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి 44 శాతం మంది ప్రజలు మద్దతు తెలిపారని, తాజాగా వారి సంఖ్య 48 శాతానికి పెరిగిందని వెల్లడించింది. ప్రభుత్వంపై తమ అభిప్రాయాన్ని వెల్లడించేందుకు ఎక్కువ మంది ముందుకు రావడం విశేషమని పేర్కొంది.

తెలంగాణలోని 17 పార్లమెంటరీ నియోజకవర్గాల పరిధిలో 6,877 మందిని ప్రశ్నించి సర్వే నివేదికను రూపొందంచినట్టు పీఎస్ఈ తెలిపింది. ఈ గ‌ణాంకాల ప్ర‌కారం గత నెలలో ప్రభుత్వంపై ఎటువంటి అభిప్రాయం వ్యక్తంచేయని వారి సంఖ్య 22 శాతం కాగా, ఇప్పుడు వారి సంఖ్య 14 శాతానికి తగ్గింది. ఉత్తర తెలంగాణలో టీఆర్ఎస్ అత్యంత బలమైన శక్తిగా ఉన్నదని, కాంగ్రెస్ ప్రభావం దక్షిణ తెలంగాణలో మాత్రమే ఉందని పేర్కొంది. ఇక తెలుగుదేశం ప్రభావం ఖమ్మం, రంగారెడ్డి జిల్లాలకే పరిమితమని తెలిపింది. హైదరాబాద్‌లోని మురికివాడలు, పేదలు నివసించే ప్రాంతాల్లో సైతం టీఆర్ఎస్ బలమైన శక్తిగా ఉందని పీఎస్ఈ పేర్కొంది. టీఆర్ఎస్‌కు మద్దతుగా ఉన్న ఎంఐఎం హైదరాబాద్ పాతబస్తీలో బలంగా ఉందని తెలిపింది. రాష్ట్రంలోని దాదాపు అన్ని స్థానాలకు పోటీ చేస్తున్న బీజేపీ కేవలం పట్టణ ఓటర్లపైనే ఆశలు పెట్టుకుందని పీఎస్ఈ సర్వే పేర్కొంది. ప్రభుత్వం అమలు చేసిన రైతుబంధు, రైతు బీమాతోపాటు పలు పథకాలు అత్యధికమంది ప్రజలకు లబ్ధి చేకూర్చాయని వెల్లడించింది.