Begin typing your search above and press return to search.

భారత్ లోనే ఐపీఎల్.. గంగూలీ స్పష్టత

By:  Tupaki Desk   |   3 Feb 2022 3:30 PM GMT
భారత్ లోనే ఐపీఎల్.. గంగూలీ స్పష్టత
X
మరిన్ని జట్లతో మరికొంత ఊపుతో రంగంలోకి రానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పదిహేనో ఎడిషన్ ఎక్కడ నిర్వహిస్తారు. అన్నదానిపై సందిగ్ధత వీడింది. రెండు కొత్త జట్లు, ఆటగాళ్ల వేలం మార్పులతో ఈ ఏడాది కనువిందు చేయనున్న ఐపీఎల్ ను కరోనా కేసుల రీత్యా విదేశాలకు తరలిస్తారన్న అనుమానాలకు తెరపడింది. ఆటగాళ్ల మార్పులతో జట్లు మరింత కొత్తగా కనిపించనున్న ఈ టోర్నీని భారత్ లోనే నిర్వహించనున్నట్లు బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ తెలిపారు. నిరుడు సెకండ్ వేవ్ కారణంగా ఐపీఎల్ అబుదాబి తరలిపోయిన సంగతి తెలిసిందే. ఫస్ట్ వేవ్ కారణంగా అంతకుముందటి ఏడాది కూడా లీగ్ అక్కడే జరిగింది. ఈసారి కూడా అలాగే జరిగితే వరుసగా మూడో ఏడాదీ లీగ్ బయట నిర్వహించక తప్పలేదనిపించుకునేది. కానీ, థర్డ్ వేవ్ తగ్గుముఖం పట్టడం, అదీ కాకుండా కేసులు ఎక్కువగానే వస్తున్నా, ఒమైక్రాన్ ప్రాణాంతకం కాకపోవడంతో ఐపీఎల్ నిర్వహణకు అడ్డంకి లేకపోయింది. ఈ నేపథ్యంలోనే ఐపీఎల్-2022 భారత్ లోనే ఉంటుందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ మరోసారి స్పష్టం చేశాడు. కరోనా పరిస్థితి చేయిదాటితే తప్ప ఈ సారి ఐపీఎల్‌ను ఇండియాలోనే నిర్వహిస్తామని తెలిపాడు. ముంబై, పూణెలలో లీగ్ మ్యాచ్‌లను జరుపుతామని అహ్మదాబాద్ వేదిక గురించి ఇంకా ఆలోచించలేదని పేర్కొన్నాడు.

అడ్డంకి లేనట్టే ప్రస్తుతం వైరస్ వ్యాప్తి తగ్గింది. కేసులు 2 లక్షల దిగువనే నమోదవుతున్నాయి. అందులోనే కేరళలోనే 50 వేలు ఉంటున్నాయి. మిగతా ఎక్కడా వైరస్ తీవ్రత కనిపించడం లేదు. రాష్ట్రాలు ఆంక్షలను ఎత్తివేస్తున్నాయి. వచ్చే రెండు నెలల్లో ప్రభావం మరింత తగ్గొచ్చు. లీగ్ జరిగే ఏప్రిల్, మే నెలకు పరిస్థితి మరింత మారొచ్చు. మరోవైపు ఏప్రిల్, మే నెలల్లో ఇండియాలో కరోనా కేసులను చూసి.. పరిస్థితులకు అనుగుణంగా ఐపీఎల్ నిర్వహణలో మార్పులపై నిర్ణయం తీసుకుంటామని గంగూలీ తెలిపాడు. అంటే.. బహుశా ఇబ్బందులు ఉండకపోవచ్చు. కరోనా కారణంగా గత రెండు సీజన్‌లను యూఏఈ వేదికగా నిర్వహించారు. దుబాయ్, అబుదాబీ, షార్జా వేదికలలో మ్యాచ్‌లను ఏర్పాటు చేశారు. ఆటగాళ్లు, సిబ్బంది బయోబబుల్ ఉంటూ ఐపీఎల్ ఆడాల్సి వచ్చింది. అయితే సొంతగడ్డపై ఆడుతున్న మజాను ఐపీఎల్ ఫ్రాంచైజీలు అందించలేకపోయాయి. దీంతో ఈ ఏడాది ఎలాగైనా.. ఇండియాలోనే ఐపీఎల్ నిర్వహించాలనే లక్ష్యంతో బీసీసీఐ ఉంది.