Begin typing your search above and press return to search.

చైనాకు గట్టి షాక్​ ఇచ్చిన భారత్​.. దెబ్బకు దెబ్బ! అంటే ఇదేనేమో!

By:  Tupaki Desk   |   28 Dec 2020 3:00 PM IST
చైనాకు గట్టి షాక్​ ఇచ్చిన భారత్​.. దెబ్బకు దెబ్బ! అంటే ఇదేనేమో!
X
భారత్​ సరిహద్దుల్లో తరచూ కవ్వింపులకు పాల్పడుతున్న చైనా.. విమాన ప్రయాణాల విషయంలోనూ తన బుద్ధిని చూపించుకున్నది. గత ఏడాది నవంబర్​ నుంచి భారత పౌరులెవరు తమ దేశంలోకి రాకూడదంటూ నిషేధం విధించింది. కరోనా తీవ్రత తగ్గాక అన్ని దేశాలు విమానప్రయాణాలపై ఆంక్షలు సడలిస్తూ వచ్చాయి. భారత్​ కూడా విమానరాకపోకలకు అనుమతి ఇచ్చింది. కానీ చైనా మాత్రం ఈ విషయంలో మొండిగా వ్యవహరిస్తున్నది. దీంతో చైనా చర్యలకు భారత్​ దీటుగా బదులివ్వాలని నిర్ణయించుకున్నది.

చైనా పౌరులను భారతీయ విమానాల్లోకి అనుమతించవద్దని అన్ని విమానయాన సంస్థలను భారత్ అనధికారికంగా ఆదేశించింది. ప్రస్తుతం మనదేశ విదేశీ ప్రయాణికుల నిబంధనల ప్రకారం.. చైనీయులు భారత్​కు రావచ్చు. దీంతో ఆయా దేశాల్లో నివసించే చైనా పౌరులు భారత్​కు రాకపోకలు సాగించి తమ వ్యాపారకార్యకలాపాలు చేసుకుంటున్నారు. కానీ చైనా మాత్రం భారతీయులను తమ దేశంలోకి అడుగుపెట్టనివ్వడం లేదు. అయితే భారత్​ చైనా మీద నేరుగా నిషేధం విధించేందుకు కొన్ని నిబంధనలు అడ్డొస్తున్నాయి. దీంతో అనధికారికంగా విమానయాన సంస్థలకు ఆదేశాలు జారీచేసింది.

దేశాల మధ్య ఎన్నిగొడవలున్నా.. వ్యాపార కార్యకలాపాలు సాగించేందుకు చైనా సహకరిస్తూ ఉంటుంది. కానీ ప్రస్తుతం విమానాయాన ప్రయాణాల నేపథ్యంలో కొంత ఓవర్​ యాక్షన్​ చేస్తున్నది. ఈ నేపథ్యంలో భారత్​ కఠిననిర్ణయం తీసుకున్నది. ఇప్పటికే వివిధ దేశాలకు సంబంధించిన టూరిస్ట్​ వీసాలను మనదేశం తాత్కాలికంగా రద్దు చేసింది. కానీ వ్యాపార, వైద్యపరమైన వీసాలు మంజూరు చేస్తుంది. దీంతో ఐరోపాలో ఉండే చైనీయులు భారత్​కు వస్తున్నారు.

కానీ వివిధ దేశాల్లో ఉండే భారతీయులు చైనాకు వెళ్లేందుకు అనుమతి లేదు. చైనా కుటిలబుద్ధికి చెక్​ పెట్టేందుకు భారత్​ ఈ నిర్ణయం తీసుకున్నది. కరోనా టైంలోని చైనా.. భారతీయులపై కఠినంగా వ్యవహరించింది. చైనాలోని వివిధ ఓడరేవులలో భారతీయులు చిక్కుకున్నప్పుడు, వారిని తమ తీరంలో దిగడానికి డ్రాగన్ నిరాకరించింది. దీంతో అంతర్జాతీయ వాణిజ్య ఓడల్లో పనిచేస్తున్న దాదాపు 1,500 మంది భారతీయ సిబ్బంది స్వదేశానికి చేరుకోలేకపోయారు.