Begin typing your search above and press return to search.

శ్రీలంకకు టీమిండియా ‘బి’టీం: ఆ దేశానికి అవమానమేనా?

By:  Tupaki Desk   |   2 July 2021 11:54 AM GMT
శ్రీలంకకు టీమిండియా ‘బి’టీం: ఆ దేశానికి అవమానమేనా?
X
అర్జున రణతుంగ, డిసిల్వ, జయసూర్య, జయవర్ధేనే, మురళీధరన్. సంగక్కర లాంటి మేటి దిగ్గజాలు ఉన్న లంకను చూస్తే ఒకప్పుడు ఆస్ట్రేలియా లాంటి జట్లు కూడా భయపడేవి. ముఖ్యంగా స్పిన్ పిచ్ లైన లంకలో ఆడాలంటే అన్ని జట్లు జడుసుకునేవి. భారత్ జట్టు కూడా లంక చేతిలో చాలా సార్లు గతంలో ఓడిపోయింది. భారత ఫుల్ జట్టుతో బరిలోకి దిగినా లంకను గెలవడం కష్టమయ్యేది.

అంతదాకా ఎందుకు ధోని సారథ్యంలో టీమిండియా 2011 ప్రపంచకప్ ఫైనల్ ప్రత్యర్థి శ్రీలంకనే. అంతటి బలమైన జట్టు దిగ్గజాల రిటైర్ మెంట్ తో ఇప్పుడు కష్టాల్లో పడింది. వారిని తలదన్నే ఆటగాళ్లు రాక కళతప్పింది. ఎంతలా అంటే బంగ్లదేశ్, వెస్టిండీస్ లాంటి జట్లతో కూడా ఇప్పుడు పోటీపడలేకపోతోంది. ఇంగ్లండ్ లో వరుసగా ఇప్పుడు మ్యాచ్ లు ఓడిపోతోంది.

అయితే శ్రీలంక క్రికెట్ దుస్థితిని చూసి బీసీసీఐ ఏకంగా భారత సెకండ్ టీంను ఆ దేశ పర్యటనకు పంపడం ఇప్పుడు దుమారం రేపుతోంది. ప్రధాన ఆటగాళ్లు అంతా ఇంగ్లండ్ టూర్ లో ఉంటే.. సెకండ్ హ్యాండ్ టీంగా పేర్కొంటున్న శిఖర్ ధావన్ సారథ్యంలోని రెండో జట్టు లంక పర్యటనకు వెళ్లింది. లంకతో మూడు వన్డేలు, 3 టీట్వంటీలు ఆడనుంది.

ప్రధాన జట్టును పంపకుండా కేవలం టీవీ వ్యూయర్ షిప్, డబ్బుల కోసం భారత్ బీ టీంను పంపడం శ్రీలంక జట్టును అవమానించడమేనని ఆ దేశ మాజీ కెప్టెన్ రణతుంగ తీవ్రంగా మండిపడ్డారు. శిఖర్ ధావన్ స్టాండిన్ కెప్టెన్ గా సెకండ్ రేట్ ఇండియన్ టీం పర్యటనకు అంగీకరించిన శ్రీలంక క్రికెట్ బోర్డుకు ముందుగా బుద్ది ఉండాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేవలం టీవీ మార్కెటింగ్ కోసమే ఓకే చెప్పారని రణతుంగ విమర్శించారు. శ్రీలంక బోర్డును ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేశారు.

మొత్తంగా ఇది టీమిండియా ప్రధాన జట్టు వెళ్లకుండా బీ టీం వెళ్లడం నిజంగానే లంక టీంను అవమానించినట్టే. ఎందుకంటే శ్రీలంక జట్టులో ఇప్పుడు అస్సలు మ్యాచ్ విన్నర్లు లేరు. అయినా కూడా అది ఒక దేశపు జట్టు. ఆజట్టుకు విలువ ఇవ్వాల్సింది. అయినా కూడా బీసీసీఐ ఆ జట్టు సామర్థ్యం ఆలోచించి ఇలా సెకండ్ జట్టును పంపింది. లంక క్రికెట్ బోర్డు అయినా దీన్ని వ్యతిరేకించి ఉండాల్సింది అని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదే సెకండ్ జట్టు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ లకు వెళితే చిత్తు అవుతుంది. శ్రీలంక కాబట్టి ఈ ప్రతిపాదన ఒప్పుకుంది కానీ మిగతా ఏ టీం కూడా దీనికి అంగీకరించేది కాదని చెబుతున్నారు.