Begin typing your search above and press return to search.

అంగ‌ట్లో అమ్మాయిల ఫోన్ నంబ‌ర్లు

By:  Tupaki Desk   |   4 Feb 2017 7:49 AM GMT
అంగ‌ట్లో అమ్మాయిల ఫోన్ నంబ‌ర్లు
X
అమ్మాయిల ఫోన్ నంబ‌ర్ల‌ను సంపాదించే క్ర‌మంలో తెలివి తారాస్థాయికి చేరిన ఉదంతం. సెల్ ఫోన్ రీచార్జ్ కేంద్రాల వ‌ద్ద కాపు కాసి నెంబ‌ర్లు సంపాదిస్తున్నారు. ఇలా నెంబ‌ర్లు సంపాదించి వేధింపుల ప‌ర్వాన్ని మొద‌లుపెడుతున్నార‌ని జాతీయ మీడియాలో వార్త‌లు రావ‌డం క‌ల‌క‌లం రేకెత్తిస్తోంది. ఉత్తరప్రదేశ్‌ లో ఇలా అమ్మాయిల సెల్‌ ఫోన్‌ నెంబర్లను విక్రయిస్తున్నారు. అదెలాగా అంటే...సెల్‌ ఫోన్ లో రీచార్జ్‌ చేయించుకోవడానికి మొబైల్‌ చార్జింగ్‌ ఔట్‌ లెట్‌ లకు వచ్చే అమ్మాయిల నెంబర్లను తీసుకోవ‌డం ద్వారా! ఒక్కో నంబ‌రుకు రు.50నుండి రు.500 వరకు విక్రయిస్తున్నారు. అమ్మాయిలు కనిపించే తీరును బట్టి ఆ ధరలు కూడా మారుతున్నాయి. ఇదెలా జ‌రుగుతుందంటే...రీచార్జ్ సెంట‌ర్ల వ‌ద్ద కాపు కాసి ఉండే యువకులు అక్క‌డికి వ‌చ్చిన అమ్మాయిలు రీచార్జీలు చేసుకున్న త‌ర్వాత స‌ద‌రు షాప్ వ్య‌క్తి వ‌ద్ద‌కు వెళ్లి వారి నంబ‌ర్ కోసం బేరాలు ఆడుతున్నారు. ఒక్కో నంబ‌ర్ కోసం రూ.50 నుంచి 100 వ‌ర‌కు చెల్లిస్తున్నారు. కాస్త అంద‌మైన అమ్మాయి నంబ‌ర్‌ అయితే ఆ ధ‌ర రూ.500 వ‌ర‌కు చేరిపోతోంది. అనంత‌రం వారికి ఫోన్ చేసి వేధించ‌డం మొద‌లుపెడుతున్నారు!!

రోజురోజుకు మ‌హిళల భ‌ద్ర‌త విష‌యంలో స‌మ‌స్య‌లు ఎదురవ‌తుంటే తాజాగా ఈ రూపంలో వేధింపులు మొద‌ల‌వ‌డంపై లక్నో మహిళలు తీవ్రంగా దిగ్భ్రాంతి చెందారు. 'అసలు ఇటువంటి వాటిని ఊహించలేదు. రీచార్జి షాపులు మా సెల్‌ నెంబర్లను అమ్ముతున్నా యంటే ఇక ఆన్‌ లైన్‌ లో రీచార్జి చేయించుకోవడం మినహా మరో మార్గం లేదు.'' అని లక్నోలోని ప్రతిష్టాత్మక మహిళా కాలేజీ విద్యార్ధిని పేర్కొన్నారు. సోషల్‌ మీడియాలో వ్యక్తిగత సమాచారం పెట్టకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నా మని, కానీ ఇలా రీచార్జింగ్‌ కోసం దుకాణానికి వస్తే ఇటువంటివి జరుగుతున్నాయని అస్సలు ఊహించలేదని మరో విద్యార్థిని వాపోయారు. ఈ పరిణామాల పట్ల మహిళా సంఘాలు - సామాజిక కార్యకర్తలు తీవ్ర అసహనానికి గురయ్యారు. ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు మధు గార్గ్‌ మాట్లాడుతూ, ఫోన్లలో మహి ళలను వేధించడం ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కువగా కొనసాగుతోందన్నారు. ఇలాంటి సంఘటనలు రెండింటినీ ఇటీవలే తాము గుర్తించామని, ఒక యువకుడిని పోలీసులు అరెస్టు చేశారని తెలిపారు. లక్నోలోని అవథ్‌ గర్ల్స్‌ డిగ్రీ కాలేజీ ప్రిన్సి పాల్‌ ఉమా చతుర్వేది స్పందిస్తూ, ఆన్‌ లైన్‌ లో రీచార్జింగ్‌ చేయించుకోవాలంటే ప్రతి ఒక్కరికీ కంప్యూటర్ ఉండదని, పోలీసులే ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు. త్వరలోనే ఇటువంటి తరహా సంఘటనలను నిరోధించేందకు ప్రత్యేక డ్రైవ్‌ చేపడతామని సీనియర్‌ పోలీసు అధికారి తెలిపారు. ఇలాంటి అక్రమాలకు పాల్పడకుండా రీచార్జి ఔట్‌లెట్‌ యజమానుల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అమ్మాయిల వ్యక్తిగత వివరాలు ఇలా అమ్మకానికి పెట్టడం సిగ్గుచేటని సామాజిక కార్యకర్తలు వ్యాఖ్యానించారు. దీనిపై టెలికం ఆపరేటర్లను సంప్రదించగా తాము డిస్ట్రిబ్యూటర్లకు రీచార్జి కూపన్లు విక్రయిస్తున్నామని, వారు వాటిని రిటైలర్లకు ఇస్తున్నారన్నారు. మొత్తంగా అమ్మాయిల భ‌ద్ర‌త‌పై వారి కుటంబాల్లో మ‌రింత క‌ల‌వ‌రం రేకెత్తించే ప‌రిణామంగా మారింద‌నేది మాత్రం నిజ‌మ‌ని ప‌లువురు అంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/