Begin typing your search above and press return to search.

మాంద్యం ఎఫెక్ట్‌.. ఆ దేశ ఉద్యోగులకు తప్పని తిప్పలు!

By:  Tupaki Desk   |   24 Nov 2022 11:30 PM GMT
మాంద్యం ఎఫెక్ట్‌.. ఆ దేశ ఉద్యోగులకు తప్పని తిప్పలు!
X
ద్రవ్యోల్బణం, పెరుగుతున్న ధరలు, ఉక్రెయిన్‌–రష్యా యుద్ధ ప్రభావాలు, కోవిడ్‌ అనంతర దుర్భర ఆర్థిక పరిస్థితులు, దిగ్గజ కంపెనీలే ఉద్యోగులను తొలగిస్తుండటం వంటి అంశాలు యునెటైడ్‌ కింగ్‌డమ్‌ (యూకే) ఉద్యోగులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి.

దీంతో ఉద్యోగులు తీవ్ర అనారోగ్యానికి గురైనా విశ్రాంతి అవసరమని డాక్టర్‌ సూచించే సిక్‌ నోట్‌ (డాక్టర్‌ సర్టిఫికెట్‌) కూడా తీసుకోవడం లేదట. ఆఫీసులకు వెళ్లడానికే మొగ్గుచూపుతున్నారని ఆ దేశానికి చెందిన ప్రముఖ దినపత్రిక గార్డియన్‌ వెల్లడించింది.

దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు, గాయపడినవారికి సిక్‌ నోట్‌ అవసరం. వీరికి ఎంత కాలంలో విశ్రాంతి అవసరమో సూచిస్తూ జనరల్‌ ప్రాక్టిషనర్లు సిక్‌ నోట్‌ ఇస్తారు. అయితే ఉద్యోగులు వీటిని తీసుకోవడానికి ఇష్టపడటం లేదని జనరల్‌ ప్రాక్టీషనర్లు చెబుతున్నారు.

ప్రస్తుతమున్న మాంద్యం పరిస్థితుల్లో తాము అనారోగ్యంతో ఉన్నప్పటికీ సెలవు పెట్టకుండా ఉద్యోగం చేయడం అవసరమని ఉద్యోగులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సిక్‌ నోట్‌ తీసుకుంటే ఆఫీసుకు/కంపెనీకి సెలవు పెట్టాల్సి ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉద్యోగాలే గ్యారెంటీ ఉండటం లేదు. ఈ నేపథ్యంలో తీవ్ర అనారోగ్యంతో ఉండి సెలవు తీసుకుంటే అది అంతిమంగా తమ ఉద్యోగంపై ప్రభావం చూపుతుందని చాలా మంది సిక్‌ నోట్లు తీసుకోవడం లేదు.

యూకేలో అంతకంతకూ పెరుగుతున్న జీవన వ్యయాలు, ఆహారం, ఇంధన ధరలు భారంగా మారడం వంటివి ఆ దేశస్తులను ఇబ్బందిపెడుతున్నాయి. ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న యూకే ఇటీవల ఆ స్థానాన్ని భారత్‌కు కోల్పోవడం గమనార్హం. ఇది పరిస్థితి తీవ్రతకు చిహ్నమని చెబుతున్నారు.

2021 ప్రారంభం నుంచి యూకేలో జీవన వ్యయం 41 ఏళ్ల గరిష్ఠానికి చేరడం గమనార్హం. గ్యాస్‌ ధరలు ఈ ఏడాది దాదాపు 98 శాతం పెరగడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

"నేను గతేడాది ఒకరికి సిక్‌ నోట్‌ ఇచ్చాను. దానిని తీసుకోవడానికి ఆ వ్యక్తి ఇష్టపడలేదు. 'వద్దు.. నేను పనిచేయకుండా ఉండలేను. నాకు డబ్బు అవసరం ఉంది' అని చెప్పడం నన్ను ఆశ్చర్యపర్చింది" అని ది రాయల్‌ కాలేజ్‌ ఆఫ్‌ జీపీ ఛైర్‌ఉమెన్‌ డాక్టర్‌ కామిలా హౌథ్రోన్‌ పేర్కొనడం ఉద్యోగుల ఆందోళనలు ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పడానికి నిదర్శనం.

ఇటీవల కాలంలో యూకే ఉద్యోగుల్లో చాలామంది తీవ్రమైన ఆయాసం, మధుమేహం, తీవ్ర అలసట, నోట్లో పుండ్లు, మానసిక సమస్యలు వంటివాటితో బాధపడుతున్నారు. అయితే వారంతా ఆఫీసులకు సెలవుపెట్టి విశ్రాంతి తీసుకోవడానికి ఇష్టపడటం లేదు. ఆరోగ్యం బాగోకపోయినా కనాకష్టంగా ఆఫీసులకు వెళ్లిపోతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.