Begin typing your search above and press return to search.

రిజర్వేషన్ల కోతపై నెల్లూరులో రగడ.. బీసీ వర్సెస్ రెడ్డి

By:  Tupaki Desk   |   10 March 2020 8:49 AM GMT
రిజర్వేషన్ల కోతపై నెల్లూరులో రగడ..  బీసీ వర్సెస్ రెడ్డి
X
తెలంగాణలో మాదిరి ఏపీలోకి కూడా అదే పరిస్థితి ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బీసీ రిజర్వేషన్లకు భారీగా కోతపడింది. మొత్తం రిజర్వేషన్లలో 10 శాతమే తగ్గినా సీట్లలో మాత్రం బీసీలకు భారీగా కోత పడింది. ఈ ప్రభావం నెల్లూరు జిల్లాలో తీవ్రంగా ఉండనుందని తెలుస్తోంది. ఈ రిజర్వేషన్లు తలకిందులయ్యాయని ఆయా పార్టీలు భావిస్తున్నాయి. అయితే తాజా పరిణామాలకు నెల్లూరు జిల్లాలో రెండు సామాజికవర్గాల మధ్య వివాదం రేగేలా కనిపిస్తోంది. ముఖ్యంగా రెడ్లకు, బీసీలకు మధ్య ఆధిపత్య పోరు వలనే ఈ పరిణామాలు వచ్చాయని చర్చ సాగుతోంది.

మొదటి నుంచి నెల్లూరులో రెడ్లు రాజకీయంగా ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారు. అందుకే ఈ జిల్లాలో ముఖ్య నాయకులంతా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే. అయితే ప్రస్తుతం పరిణామాలు, రాజకీయాలు మారుతున్న నేపథ్యంలో 2019 ఎన్నికల్లో జిల్లాలో ఉప్పూనిప్పుగా ఉన్న రెడ్లంతా ఒకే తాటిపైకి వచ్చారు. దీని ప్రభావంతోనే రెడ్ల పార్టీగా పేరొందిన వైఎస్సార్సీపీ అన్ని స్థానాల్లో గెలుపొందింది. జిల్లాలో ఉన్న పదికి పది ఎమ్మెల్యే స్థానాలను కైవసం చేసుకుని సత్తాచాటింది. అయితే జిల్లాలో తమ ఉనికికి ప్రమాదం ఏర్పడిందని బీసీలు భావిస్తున్నారు. తమ కన్నా జనాభా తక్కువ ఉన్న రెడ్లు తమపై ఆధిపత్యం చాటుతుండడంతో బీసీలు రాజకీయంగా వెనకబడుతున్నామని ఆందోళన చెందుతున్నారు. అయితే వీరికి కలిసొచ్చే అంశం ఏమిటంటే మంత్రిగా అనిల్ కుమార్ యాదవ్ ఉండడమే.

జిల్లాపై తమ ప్రభావం ఉండాలని రెడ్లు, బీసీలు భావిస్తున్నారు. జనాభా పరంగా ఎక్కువగా తాము ఉండడంతోనే తమ చేతుల్లోనే రాజకీయం ఉండాలని బీసీలు కోరుకుంటున్నారు. దీంతో బీసీ సామాజికవర్గానికి చెందిన అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు పట్టణం నుంచి ఎమ్మెల్యే కావడం, ఆ తర్వాత బీసీ కోటాలో మంత్రి కూడా అవడంతో రెడ్లతో పోటీకి సిద్ధమయ్యారంట. అయితే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కూడా రెడ్డే కావడంతో కొంత ఆలోచిస్తన్నట్లు సమాచారం. బహిరంగంగా ఈ పోరు ఉండకున్నా అంతర్గతంగా మాత్రం ఇరు సామాజిక వర్గం మధ్య ఈ పోరు కొనసాగుతూనే ఉంది.

ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో ఆ ప్రభావం స్పష్టంగా కనిపించే అవకాశం ఉంది. రెడ్లకు స్థానిక పోరులో చెక్ పెట్టాలని బీసీలకు తోడు ఇతర సామాజికవర్గాలు కూడా భావిస్తున్నాయి. అయితే తమ ఆధిపత్యం కొనసాగేందుకు రెడ్లు కూడా ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి సమయంలోనే రిజర్వేషన్ల రూపంలో బీసీలకు పెద్ద దెబ్బ తగలడం.. భారీగా సీట్లలో కోత పడడంతో బీసీలు డీలా పడ్డారు. ఈ అంశం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బీసీ రిజర్వేషన్ల కోత వెనుక రెడ్లు ఉన్నారని బీసీల్లో చర్చ సాగుతోంది. అయితే ఇన్నాల్లు బీసీలకు అండగా ఉన్న మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సొంతం జిల్లాలోనే ఈ విధంగా బీసీ సీట్లకు కోత పడడం ఆసక్తికరం. దీంతో రెడ్లకు చెక్ పెట్టేందుకు బీసీలు అంతర్గతంగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సహకరిస్తున్నారా లేదా అనేది తెలియడం లేదు. ఎందుకంటే రెడ్లకు వ్యతిరేకంగా వెళ్లితే సీఎం జగన్ కు ఆగ్రహం తెప్పించే అవకాశం ఉంది. దీంతో తమ సామాజిక వర్గానికి మద్దతు పరోక్షంగా తెలుపుతున్నట్లు సమాచారం.