Begin typing your search above and press return to search.

పతంజలి 'కరోనిల్‌'కు డబ్ల్యూహెచ్‌వో గ్రీన్‌ సిగ్నల్‌ ... 'శుద్ధ అబద్ధం' అని తేల్చేసిన ఐఎంఏ!

By:  Tupaki Desk   |   22 Feb 2021 11:00 PM IST
పతంజలి కరోనిల్‌కు డబ్ల్యూహెచ్‌వో గ్రీన్‌ సిగ్నల్‌ ... శుద్ధ అబద్ధం అని తేల్చేసిన ఐఎంఏ!
X
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం పతంజలి ఆయుర్వేదం తన కరోనిల్‌ ఔషధంను ఆయుష్‌ మంత్రిత్వశాఖ నుంచి ధృవీకరణ పత్రం అందుకున్నట్లు హరిద్వార్‌ కు చెందిన పతంజలి ఆయుర్వేద్‌ శుక్రవారం వెల్లడించింది. యోగా గురువు రామ్‌దేవ్‌ 158 దేశాలకు చెందిన ఔషధమైన దివ్య కరోనిల్‌ టాబ్లెట్‌, దివ్య శ్వాసరి ఎగుమతి చేయడానికి అనుమతిస్తూ డబ్ల్యూహెచ్ ‌వో నుంచి ఔషధ ఉత్పత్తుల ధృవీకరణకు అనుమతి తీసుకున్నట్లు తెలిపింది. అయితే కరోనా కు పతంజలి రూపొందించిన 'ఎవిడెన్స్ బేస్ట్ మెడిసెన్' పరిశోధనా పత్రాన్ని రామ్‌దేవ్ బాబా శుక్రవారంనాడు ఢిల్లీలో విడుదల చేశారు. కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్, మరో మంత్రి నితిన్ గడ్కరి సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది.

కాగా, రాందేవ్‌ బాబా గత ఏడాది జూన్ ‌లో కరోనిల్‌ అనే ఔషధంతో సహా మూడు ఉత్పత్తులతో కూడిన కోవిడ్‌ కిట్‌ ను ప్రారంభించారు. మొదట్లో కరోనా వైరస్‌ కు దీనిని 'నివారణ'గా అభివర్ణించారు. అయితే ఆ తర్వాత ఈ ఔషధం పలు వివాదాల్లో చిక్కుకుంది. పతంజలి ఉత్పత్తి తన వాదనకు మద్దతు ఇవ్వడానికి సరైన క్లినికల్‌ ట్రయల్‌ డేటా లేకపోవడంతో దగ్గు, జ్వరం, రోగనిరోధక శక్తిని పెంచే ఔషధంగా విక్రయించడానికి అనుమతి కోరిందనే దానిపై వివాదం నెలకొంది. 2020 డిసెంబర్‌లో హరిద్వార్‌ ఆధారిత సంస్థ ఆయుష్‌ మంత్రిత్వశాఖతో కరోనిల్‌ టాబ్లెట్ల కోసం ఆయుష్‌ లైసెన్స్‌ను రోగ నిరోధక శక్తిని పెంచే కరోనాకు ఉపయోగించే ఔషధానికి అప్ ‌డేట్‌ చేయమని విజ్ఞప్తి చేసింది.

అయితే, కరోనిల్ మాత్రను డబ్ల్యూహెచ్ ఓ ధ్రువీకరించిందంటూ పతంజలి సంస్థ ప్రకటించడం షాక్‌ కు గురి చేసిందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) సోమవారం పత్రికా ప్రకటన లో వెల్లడించింది. అది శుద్ధ అబద్ధం అని, దీనిపై వివరణ ఇవాల్సిందిగా ఆ సమావేశానికి హాజరైన కేంద్ర ఆరోగ్య మంత్రి హర్ష వర్ధన్‌ ను ఐఎంఏ కోరింది.ఈ ఔషధం కరోనా చికిత్సకు ఉపయోగపడుతుందని చెబుతూ ఈ దేశ ప్రజలను మోసం చేస్తున్నారంటూ మండిపడింది.

ఈ దేశానికి ఆరోగ్య శాఖ మంత్రి అయ్యుండి ఇలాంటి అశాస్త్రీయమైన, కల్పిత ఔషధం గురించి తప్పుడు ప్రచారం చేయడం ఎంతవరకు సమర్థనీయం, కరోనా చికిత్సకు కరోనిల్ ఉపయోగపడుతుందని రుజువులు ఉన్నాయంటున్నారు కదా.. ఏ సమయంలో, ఎంత కాలం పాటు క్లినికల్ ట్రయల్స్ చేశారో వివరించగలరా అంటూ ఆరోగ్య మంత్రి హర్ష వర్ధన్‌ ను ఐఎంఏ ప్రశ్నించింది. ఇదిలా ఉండగా, పతంజలి సంస్థ తయారు చేసిన కరోనిల్ ఔషధం సామర్థ్యాన్ని తాము పరిశీలించలేదని, దానికి ఏ రకమైన ధృవీకరణ పత్రాన్నీ జారీ చేయలేదని డబ్ల్యూహెచ్ఓ ట్వీట్ చేసింది.