Begin typing your search above and press return to search.

100 మందికి అస్వస్థత.. హఠాత్తుగా సృహ తప్పారు..

By:  Tupaki Desk   |   6 Dec 2020 8:56 AM IST
100 మందికి అస్వస్థత.. హఠాత్తుగా సృహ తప్పారు..
X
ఏపీలో మరో ఉపద్రవం చోటుచేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నగరంలో ఉన్నట్టుండి 100 మందికి పైగా ప్రజలు అస్వస్థతకు గురయ్యారు. బాధితులు వరుసగా సృహ తప్పి పడిపోవడంతో ప్రజల్లో తీవ్ర భయాందోళనలు వ్యక్తమయ్యాయి. బాధితులను అంబులెన్సుల్లో ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు.

తొలుత ఏలూరు ఒకటో పట్టణ పరిధిలోని దక్షిణ వీధిలో కొందరు అస్వస్థతకు గురవగా.. శనివారం రాత్రికి నగరంలోని పడమర వీధి, కొత్తపేట, తాపీమేస్త్రీ కాలనీ, అశోక్ నగర్, తంగెళ్లమూడి, శనివారపుపేట, ఆదివారపు పేట, అరుంధతిపేట తదితర ప్రాంతాల్లోనూ బాధితుల సంఖ్య పెరిగింది.

శనివారం రాత్రి 12 గంటల వరకు దాదాపు 95 మంది అస్వస్థతకు గురికావడంతో ఏలూరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. వీరిలో 22 మంది చిన్నపిల్లలు.. 40 మంది మహిళలు, 33 మంది పురుషులు ఉన్నారు. వెంటనే ఆక్సిజన్ అందించడంతో తేరుకున్నారని వైద్యులు తెలిపారు.

అస్వస్థతకు గురైన వారికి ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ప్రకటించారు. విజయవాడలోనూ అత్యవసర వార్డులు ఏర్పాటు చేశారు.

మూడు రోజులుగా తాగునీరు రంగు మారి వస్తోందని.. వాటిని తాగడం వల్లే ఇలా జరిగిందని బాధితులు చెబుతున్నారు. అస్వస్థతకు నీటి కాలుష్యమే కారణమని వైద్య వర్గాలు తెలిపాయి. పరీక్షలు చేశాక నిగ్గు తేలుస్తామని తెలిపారు.