Begin typing your search above and press return to search.

దాయాదికి వెంకయ్య తీవ్ర హెచ్చరిక..మర్చిపోలేనంత భారీగా ప్రతిదాడి

By:  Tupaki Desk   |   7 Sept 2019 11:10 AM IST
దాయాదికి వెంకయ్య తీవ్ర హెచ్చరిక..మర్చిపోలేనంత భారీగా ప్రతిదాడి
X
ఇప్పటివరకూ మరే ఉప రాష్ట్రపతి చేయని తీవ్ర హెచ్చరికను తాజాగా ఆ స్థానంలో ఉన్న వెంకయ్యనాయుడు నోటి నుంచి వచ్చింది. భారత్ - పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అదే పనిగా కెలుకుతున్న పాక్ పైన ఆయన తీవ్రంగా ఫైర్ అయ్యారు. పాక్ కు ఈ స్థాయిలో వార్నింగ్ ఇచ్చిన వారెవరూ ఇప్పటివరకూ లేకపోవటం గమనార్హం. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉండి.. దాయాదికి యుద్ధానికి సంబంధించిన హెచ్చరిక చేసిన వ్యక్తిగా వెంకయ్యను చెప్పక తప్పదు.

భారత్ ను ఎంతగా రెచ్చగొడుతున్నప్పటికీ భరిస్తూనే ఉందని.. కానీ దాడి చేస్తే మాత్రం ప్రతిదాడి తప్పదని తేల్చేశారు. ప్రతిదాడి తీవ్రత గురించి చెబుతూ.. ఎన్నటికీ మర్చిపోలేనంత భారీ స్థాయిలో ఉంటుందని స్పష్టం చేయటం ఉలిక్కిపడేలా చేసింది. ఇంతకీ వెంకయ్య నోటి నుంచి ఈ వ్యాఖ్యలు ఎప్పుడు.. ఎక్కడ.. ఏ వేదిక మీద నుంచి ఆయన చేశారన్నది చూస్తే.. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తన రెండో సంవత్సర పదవీ కాలంలో చేసిన 95 ప్రసంగాలతో కూడిన రెండు పుస్తకాల్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన వెంకయ్య.. భారతదేశ చరిత్రను పరిశీలిస్తే దూకుడన్నది ఎక్కడా ప్రదర్శించినట్లుగా కనిపించదని.. విశ్వగురువుగా ప్రసిద్ధి చెందిన భారత్ ఇప్పటివరకూ ఎవరిపైనా తనకు తానుగా దాడి చేయలేదన్న విషయాన్ని గుర్తు చేశారు. చాలామంది భారత్ పైన దండెత్తినా.. దాడులతో నాశనం చేసే ప్రయత్నం చేసినా.. మోసం చేసినా.. ఎవరిపైనా దాడి చేయలేదన్నారు. భారత్ తన సార్వభౌమాధికారాన్ని రక్షించుకోవటానికి శాంతి మార్గాన్నే ఎంచుకుందన్న ఆయన.. ఈసారి మాత్రం అందుకు భిన్నంగా పాక్ దాడి చేస్తే ప్రతిదాడి తీవ్రంగా ఉంటుందని చెప్పటం సంచలనమైంది.