Begin typing your search above and press return to search.

చిన్న‌మ్మ‌కు షాక్‌...జ‌య‌టీవీపై ఐటీ రైడ్‌

By:  Tupaki Desk   |   9 Nov 2017 5:40 AM GMT
చిన్న‌మ్మ‌కు షాక్‌...జ‌య‌టీవీపై ఐటీ రైడ్‌
X
త‌మిళ‌నాడు దివంగ‌త సీఎం జ‌య‌లలిత నెచ్చెలి శ‌శిక‌ళ‌కు మ‌రో షాక్ త‌గిలింది. ఇప్ప‌టికే జైలు జీవితం - భ‌ర్త అనారోగ్యంతో కుదేలైన చిన్నమ్మ‌కు మ‌రో షాక్ ఇచ్చేలా..శ‌శిక‌ళ సార‌థ్యంలోని జయ టీవీ ఆఫీసుపై ఇవాళ ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేశారు. చెన్నైలో ఉన్న ఆఫీసుకు ఐటీ అధికారులు వెళ్లారు. ఆదాయ పన్ను ఎగవేసారన్న ఆరోపణలపై ఆ టీవీ ఆఫీసుపై దాడులు కొనసాగుతున్నాయి. మావిస్ సాట్‌ కామ్ లిమిటెడ్ కంపెనీ పేరు మీద జయ టీవీ రిజిస్టరై ఉంది. తమిళనాడు దివంగత సీఎం జయలలితకు అత్యంత సన్నిహితురాలైన వీకే శశికళ ఇన్నాళ్లూ జయ టీవీని ప్రమోట్ చేస్తున్నారు. శశికళ మేనల్లుడు వివేక్ జయరామన్ ఆ టీవీ మేనేజ్‌ మెంట్ చూస్తున్నారు.

సుదీర్ఘ‌కాలంగా అన్నాడీఎంకే పార్టీకి ప్రధాన అస్త్రంగా జయ టీవీ నిలిచింది. అయితే ఇటీవల అన్నాడీఎంకే నేత - సీఎం పళనిస్వామి... పన్నీరుసెల్వంతో జతకట్టడం వల్ల పార్టీకి - ఛానల్‌ కు మధ్య ఉన్న సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ మధ్య జరిగిన సమావేశంలో జయ టీవీని మళ్లీ పునరుద్దరించాలని అన్నాడీఎంకే పార్టీ తీర్మానించింది. ఇంకా శశికళ ఫ్యామిలీ చేతిలోనే నమధు ఎంజీఆర్ పత్రిక కూడా ఉంది. అయితే ఇవాళ జరిగిన ట్యాక్స్ దాడులను జయ టీవీ ఖండించింది. ఇండిపెండెంట్ మీడియాపై ఇది దాడి అని ఆ సంస్థ పేర్కొంది. జయ టీవీ నెట్‌ వర్క్ గ్రూపులో న్యూస్, ఎంటర్‌ టైన్‌ మెంట్ - మూవీ ఛానళ్లు ఉన్నాయి. 1999లో తమిళనాడు దివంగత సీఎం జయలలిత జయ టీవీని స్టార్ట్‌ చేశారు. ప్రస్తుతం శశికళ ఫ్యామిలీ చేతిలో జయ నెట్‌ వర్క్‌ ఉంది. జాజ్‌ సినిమా హౌజ్‌ కూడా ప్రస్తుతం శశికళ ఫ్యామిలీ ఆధీనంలోనే ఉంది.